వయసు, ఎత్తు, బరువు, పేద, ధనిక ఏ విషయమూ క్యాన్సర్కు అతీతం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్కు గురవుతున్నారు. మనదేశంలో ప్రతి 22 మంది స్త్రీలలో ఒకరు, పట్టణ మహిళల్లో, అధిక బరువు ఉండేవారిలో, వయసు పైబడిన స్త్రీలలో, లేటు వయసులో పిల్లలు, పాలివ్వని తల్లుల్లో, రజస్వల త్వరగా అయినవారిలో, 55 ఏళ్లు పైబడినా మెనోపాజ్కు చేరుకోని వారిలో, దీర్ఘకాలికంగా హార్మోను ట్రీట్మెంట్ తీసుకున్నవారిలో ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నా, ఎవరిలోనైనా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే తొలిదశలో కనుక్కుని పూర్తిగా నయంచేసే అవకాశం ఉంది.
ఎత్తుకు తగిన బరువు, ఆరోగ్యకరమైన జీవనశైలి, పండ్లు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయటం ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా కొంతవరకు దూరంగా ఉంచుతాయి. కానీ, దురదృష్టవశాత్తు క్యాన్సర్ ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా సవాలు విసురుతుంది అనటానికి ఉదాహరణ అనేకమంది ప్రముఖులు క్యాన్సర్కు గురవడమే. అయితే వారు క్యాన్సర్ను జయించి, మరెంతో మందికి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. వారి అనుభవాలను ఇతరులతో పంచుకొని ధైర్యం నింపటమే కాకుండా, కొందరు పుస్తకరూపంలో ఇతరులకు తమ జీవిత అనుభవాలను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ముందుకు దూసుకెళ్లిన స్త్రీలు, అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని జీవితాన్ని జయించిన స్త్రీలు అంతే మనోధైర్యంతో ఈ క్యాన్సర్ను జయించటం, స్త్రీలందరికీ పాఠం వంటిది. మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనగానే జీవితం అయిపోయిందని కుంగిపోయి, ట్రీట్మెంట్ కూడా సరిగ్గా తీసుకోకుండా జీవితం త్వరగా ముగించుకునే వారు తప్పకుండా క్యాన్సర్ జయించిన వారి గురించి తెలుసుకోవాలి. గౌతమి మనందరికీ తెలిసిన ప్రముఖ నటి. దక్షిణ భారతదేశంలో అన్ని భాషలలో ప్రముఖ నటుల సరసన అనేక సినిమాలలో నటించారు. 2004లో 35 ఏళ్ల వయసులో ఆమె రొమ్ములో గడ్డ క్యాన్సర్ అని తెలిసినప్పుడు మొదట్లో కొంత ఆందోళన చెందినా ధైర్యంగా, కమల్ సహకారంతో జయించ గలిగానని, ఇప్పుడు వైద్యం ఎంతో అభివృద్ధి చెందిందని వైద్యుల సలహాలు, సూచనలు పాటించగలిగితే పూర్తిగా నయం అవుతుందని నమ్మకంగా చెబుతారామె. అలానే అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ సతీమణి నాన్సీరీగన్, ఆస్ట్రేలియా నటి, సింగర్ కైలిమినాగ్, 2010లో 53 ఏళ్ల వయసులో.. డక్టల్ కార్సినోమాను జయించిన మార్టినా నవ్రతిలోవా, బాలీవుడ్ నటి ముంతాజ్ వంటివారు ఎంతోమంది క్యాన్సర్ను జయించారు.
ఎంత అవగాహన ఉన్నా, మనోధైర్యం ఉన్నా, వైద్యంలో ఆధునిక పద్ధతులు ఉన్నా క్యాన్సర్ను జయించటానికి అందరూ చేయవలసింది మాత్రం తొలిదశలో గుర్తించగలగటమే. క్యాన్సర్ కణాలు శరీరమంతా పాకిపోయిన తరువాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. కొద్దికాలం జీవితాన్ని పొడిగించటం తప్ప అనే విషయం అక్షరసత్యం. రొమ్ములో మార్పులు త్వరగా గుర్తించగలరు కాబట్టి రొమ్ము క్యాన్సర్ను తొలిదశలో గుర్తించటం తేలికే. రొమ్ములో కణితిలాగా తగలగానే అనుమానించాల్సిన అవసరం లేనేలేదు, నెలసరి ముందు రోజుల్లో, పాలిచ్చే స్త్రీలలో, మెనోపాజ్ దశలో రొమ్ములో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కణితి కొంతకాలంగా ఉంటూ, పెరుగుతూ, గట్టిగా కదలకుండా, నొప్పి లేకుండా ఉంటే అనుమానించాల్సిందే. ప్రతి స్త్రీ 20 ఏళ్ల నుండే నెలసరి అయిన ఏడవరోజు స్నానం చేసేటప్పుడు సబ్బు చేతులతో, వేళ్ల మధ్య భాగంలో రొమ్ములను సర్కిల్గా విభజించుకొని పరీక్షించుకోవాలి. ఇలా స్వయంగా పరీక్షించుకోవటంతో పాటు 30 ఏళ్లు పైబడ్డాక అల్ట్రాసౌండ్ మమోగ్రామ్ వంటి స్క్రీనింగ్ టెస్టులు, ఇంకా అనుమానంగా ఉంటే MRI, బయాప్సి వంటివి తప్పనిసరి. ఈ స్క్రీనింగ్ పరీక్షలతో కణితిని చేతికి కూడా తగలనంత చిన్న సైజులో ఉన్నప్పుడే పసిగట్టగలుగుతాము. దగ్గరి బంధువులలో, రక్త సంబంధికులలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఇక ఎటువంటి రిస్క్ లేనివారు కూడా 40 ఏళ్ల వయసులో ఒకసారి, తరువాత 40-50 ఏళ్ల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి, 50 ఏళ్లు పైబడ్డాక ఏటా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటే కణితిని తొలిదశలోనే పసిగట్టి, కణితిని మాత్రమే తీసివేయగలిగే లంపెక్టమీ చేయగలుగుతారు.