Breast Cancer | రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడంతో పాటు మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్లో మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 31.2 శాతం స్తన క్యాన్సర్ కేసులేనని రాష్ట్ర గణాంకాలు వెల్లడించాయి. ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ స్తన క్యాన్సర్ పరిశోధన దినోత్సవం సందర్భంగా గుజరాత్ ఆరోగ్య శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ గుజరాత్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (జీసీఆర్ఐ)లో 2025లోనే 1,541 కొత్త స్తన క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మహిళల్లో క్యాన్సర్ను ఎదుర్కోవడంలో ముందస్తు గుర్తింపు, అవగాహన కీలకమని అధికారులు పేర్కొన్నారు.
30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు పైబడిన మహిళలు డిజిటల్ మామోగ్రఫీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. రొమ్ములో అసాధారణమైన గడ్డ కనిపించినా, ఇతర అనుమానాస్పద లక్షణాలు ఉన్నా ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని లేదా జీసీఆర్ఐని సంప్రదించాలని సూచించారు. గుజరాత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో స్తన క్యాన్సర్ వాటా 31.2 శాతంగా ఉంది. అహ్మదాబాద్ జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం 0 నుంచి 74 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో ప్రతి 12 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్లో కూడా మహిళల్లో స్తన క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్గా ఉంది. గ్లోబోకాన్ 2022 గణాంకాల ప్రకారం 2022లో దేశంలో 14,13,316 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మహిళల్లో 1,92,020 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు ఉన్నాయి. మహిళల్లో నమోదైన మొత్తం క్యాన్సర్లలో ఇవి 26.6 శాతానికి సమానం.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాలను ఉటంకిస్తూ.. 2024లో రాష్ట్రంలో మొత్తం 77,205 క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వీటిలో మహిళల్లో స్తన క్యాన్సర్ అత్యధిక వాటాను కలిగి ఉంది. జీసీఆర్ఐలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే 2015 నుంచి 2025 మధ్య రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2025లో నమోదైన 1,541 కొత్త కేసుల్లో 41 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన మహిళలే అత్యధికంగా ఉన్నారు. ఈ వయసు విభాగంలో 469 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 51 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో 436 కేసులు నమోదయ్యాయి. 1972లో స్థాపించిన జీసీఆర్ఐ ప్రస్తుతం రాష్ట్రంలోని కీలక క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చెందిందని అధికారులు తెలిపారు. 2025లో ఈ సంస్థలో మొత్తం 26,812 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందారు. వీరిలో 17,665 మంది గుజరాత్కు చెందినవారు కాగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి 9,147 మంది వచ్చారు.
గుజరాత్ వెలుపల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు జీసీఆర్ఐకి రావడం అక్కడ అందుబాటులో ఉన్న క్యాన్సర్ సేవలకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తుందని అధికారులు పేర్కొన్నారు. క్యాన్సర్ను గుర్తించేందుకు, చికిత్స అందించేందుకు ఈ సంస్థలో పలు ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. స్తన క్యాన్సర్ను తొలిదశలో గుర్తించేందుకు డిజిటల్ మామోగ్రఫీ సదుపాయం ఉంది. అలాగే కచ్చితమైన శస్త్రచికిత్స, నాన్-ఇన్వేసివ్ చికిత్స కోసం సర్జికల్ రోబోట్, సైబర్నైఫ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కీమోథెరపీ సమయంలో జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు స్కాల్ప్ కూలింగ్ పరికరం కూడా అందుబాటులో ఉంది. జన్యుపరమైన పరీక్షలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించేందుకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సదుపాయం కూడా ఉంది. ట్రూ బీన్ లినాక్, టోమోథెరపీ, 3టి ఎంఆర్ఐ, హెచ్పీవీ డీఎన్ఏ పరీక్షల కోసం కోబాస్ 4800, 19 అధునాతన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద అర్హత ఉన్న రోగులు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.