న్యూఢిల్లీ : రోజువారీ ఆహారంలో భాగంగా చక్కెర తీసుకోని వారు అరుదు. చక్కెరను తగ్గిస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి పెను ముప్పని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మధుమేహం, ఊబకాయం, ఇన్ఫ్లమేషన్కు చక్కెర అధికంగా వాడటం దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర తగిన మోతాదులో తీసుకుంటే పలు ప్రయోజనాలున్నాయి.
చక్కెర పరిమితంగా వాడటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయం ముప్పును నివారించడంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ను క్రమబద్ధీకరించవచ్చు. చక్కెర మితంగా తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. చక్కెర మితంగా వాడితే మధుమేహ ముప్పును నివారించడంతో పాటు మున్ముందు మధుమేహం బారినపడకుండా జాగ్రత్త పడవచ్చు. మధుమేహం ఉన్నవారు చక్కెరను దూరం పెడితే షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇక ఒత్తిడి, కంగారు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను నివారించేందుకు చక్కెర మితంగా వాడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర అధికంగా తీసుకుంటే శరీరంలో వాపు ప్రక్రియకు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో ఊబకాయం, మధుమేహం, తలనొప్పి, అలర్జీ వంటి అనారోగ్యాల బారిన పడే ముప్పు ఉంది. ఈ ముప్పును నివారించేందుకు చక్కెరను తక్కువ మోతాదులో తీసుకోవడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.