రుతుక్రమం అగిపోయిన మహిళల ఎముకలు పగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన ఆ అధ్యయన ఫలితాలు ‘అడ్వాన్స్మెంట్ ఇన్ న్యూట్రిషన్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ సమస్య తుంటి ఎముకల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికో పరిష్కారాన్నీ కనిపెట్టారు. అదే ఎండబెట్టిన ప్రూనే పండు. ఇది అల్బుకరా ఫలాల జాతికి చెందినది. ప్రూనే ఫ్రూట్ను రోజూ తగిన మోతాదులో తీసుకుంటే తుంటి ఎముక పగుళ్లను నివారించవచ్చని తేల్చారు పరిశోధకులు. సలాడ్స్, స్మూతీ.. ఇలా వివిధ రూపాల్లో దీన్ని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. తీరిక సమయాల్లో చిరుతిండిగానూ ఆరగించవచ్చు. ఎండిన ప్రూనే పండులో బోరాన్, పొటాషియం, కాపర్, విటమిన్-కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ఎముకల పరిపుష్టికి దోహదపడతాయి. వీటితోపాటుగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు మనసుకు ఉత్తేజాన్ని ఇస్తాయని అంటున్నారు. అన్ని కాలాల్లో లభించే నల్లని, తెల్లని ప్రూనే పండ్లు కనిపిస్తే వదలకండి. ఈ మధ్య సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతున్నాయి.