కరోనా.. మూడేండ్లుగా మనిషితో దాగుడుమూతలు ఆడుతున్నది. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ
వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆ మహమ్మారి మరోసారి బీఎఫ్-7 వేరియంట్ రూపంలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నది. అయితే, ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పన్లేదని
అంటున్నారు వైద్యనిపుణులు. చైనాతో పోల్చుకుని భయపడాల్సిన అవసరమూ లేదంటున్నారు. ఇప్పటికే విజయవంతమైన టీకాల కార్యక్రమం, వైద్యుల నైపుణ్యం భారతదేశానికి రక్షణ కవచాలని భరోసా ఇస్తున్నారు.
కరోనాలో ఇప్పటి వరకూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు వచ్చాయి. మొదటి వేవ్లో
ఆల్ఫా, బీటా, రెండో వేవ్లో డెల్టా నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపాయి. ఫలితంగా అపార ప్రాణనష్టం జరిగింది.హాస్పిటల్స్ కిటకిటలాడాయి. కానీ ఆ తరువాత వచ్చిన ఒమిక్రాన్, దాని ఉప-వేరియంట్లలోని వైరస్ కేవలం అప్పర్ రెస్పిరేటరీ ప్యాక్కే.. అంటే గొంతు వరకు మాత్రమే వచ్చి ఆగిపోయింది. దీనివల్ల మూడో వేవ్లో ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వల్ల చాలామందికి న్యుమోనియా రాలేదు. కానీ, తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి సోకింది. అయినా చెప్పుకోదగినంత స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. హాస్పిటల్స్లో చేరాల్సిన దుస్థితీ దాపురించలేదు. సాధారణ జలుబు వైరస్లా ఇట్టే వచ్చి అట్టే పోయింది.
కాకపోతే గతంలో వచ్చిన వేరియంట్ల కంటే చాలా వేగంగా, అదీ ఎక్కువ మందికి వ్యాపించింది.
మిక్రాన్ మనకు కొత్త కాదు. ఇదివరకే మన దేశంలో ప్రవేశించింది. అందులో బీఏ-1, బీఏ-2, బీఏ-3, బీఏ-4, బీఏ-5 అనే వేరియంట్లు వచ్చాయి. బీఏ-5లో మరో మూడు ఉపవేరియంట్ల్లూ ఉన్నాయి. అందులో ఒకటి బీఎఫ్-7. ఇది కూడా గత జూలైలోనే మన దేశంలో నమోదైంది. ఆ తర్వాత కూడా అక్కడక్కడా కేసులు వెలుగు చూశాయి. అయితే మన దగ్గర ఒమిక్రాన్, దాని ఉప-వేరియంట్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీనికి అనేక కారణాలు.
చాలామంది ఇప్పటికే ఒమిక్రాన్కు గురికావడం, ఫలితంగా మన శరీరంలో యాంటిబాడీస్ ఏర్పడటం, దాదాపుగా అందరూ టీకాలు తీసుకోవడం, సుమారు 27 నుంచి 28 శాతం మంది బూస్టర్ డోస్ కూడా వేయించుకోవడం.. వీటన్నిటి ఫలితంగా నేచురల్ ఇమ్యూనిటీతో పాటు వ్యాక్సిన్ ఇమ్యూనిటీ కూడా వచ్చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. ఆ తరువాత పిల్లలతో సహా అందరికీ వ్యాక్సిన్లు వేయించడంలో కరోనాపై మన యుద్ధం కొలిక్కి వచ్చింది.
చైనాలో దుస్థితికి ఎన్నో కారణాలు
చైనాలో కొవిడ్ తొలి దశ నుంచి ఇప్పటి వరకూ లాక్డౌన్, ఐసోలేషన్ కఠినంగా అమలు చేశారు. అంతకంటే కచ్చితంగా టెస్టులు చేయించారు. డిసెంబర్ 7కు ముందు వరకూ.. పనికి వెళ్లే ప్రతి ఉద్యోగీ రోజూ టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన పెట్టారు. పాజిటివ్ వచ్చిన వారిని నిర్మొహమాటంగా క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉండ మన్నారు.
దేశవ్యాప్తంగా లక్షలకొద్దీ ఉచిత టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ తరహా కఠిన నిబంధనలతో అక్కడి ప్రజల్లో వ్యతిరేకత తలెత్తింది. ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో మళ్లీ కేసుల నమోదు పెరిగింది. దీనికితోడు అక్కడ వ్యాక్సినేషన్ సరిగ్గా అమలు కాలేదు. అందరికీ టీకాలు ఇవ్వనే లేదు. ఇచ్చినా.. వాటి నాణ్యతపై ఎన్నో సందేహాలు. ఫలితంగా వైరస్ మహావేగంగా వ్యాపించింది. ఎక్కువ మంది వైరస్ ప్రభావానికి గురయ్యారు. అయితే, బీఎఫ్-7 అనేది మైల్డ్ వేరియంట్ కావడం వల్ల పెద్దగా మరణాలు సంభవించడం లేదు. కానీ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో ఎక్కువ సంఖ్యలో ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు.
మరో ముఖ్య విషయం.. అక్కడ వృద్ధులకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. కారణం, చైనా పెద్దల దేశం. దాదాపు 30 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. అందులో చాలా మందికి టీకాలు వేయలేదు. కొంతమంది ఏదో సాకుతో వేయించుకో లేదు. దీంతో అక్కడ వయోధికులే ఎక్కువగా వైరస్ తీవ్రతకు బలి అవుతున్నారు. నిజానికి, చైనాకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు దాదాపుగా అర్ధసత్యాలే. అంత తీవ్ర స్థాయిలో మరణాలు లేవక్కడ. దీనికి కారణం.. బీఎఫ్-7 వ్యాప్తిరేటు అధికమే అయినా, తీవ్రత తక్కువ కావడమే.
ఒకరి ద్వారా 18 మందికి
బీఎఫ్-7.. ఇన్ఫెక్టివిటీ రేటు అధికం. అత్యంత వేగంగా ఒకరి ద్వారా పద్దెనిమిది మందికి వ్యాపిస్తుంది. అదే డెల్టా వేరియంట్ ఒకరి నుంచి నలుగురికి మాత్రమే పాకుతుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా తక్కువ. గతంలో వైరస్ వస్తే ఐదు రోజుల నుంచి రెండు వారాలు ఇంక్యుబేషన్ పీరియడ్గా భావించేవారు. కాని బీఎఫ్-7 మాత్రం రెండుమూడు రోజుల్లోనే ఇతరులకు సోకుతుంది. మన దేశంలో కేసులు కొంత పెరిగే ఆస్కారం ఉన్నా, ఈ వేరియంట్ అంత ప్రమాదకరమేం కాదు. మనవద్ద అధిక శాతం ప్రజలు వ్యాక్సిన్ వేసుకున్నారు.
మొదటి మూడు దశల్లో ఇన్ఫెక్ట్ అయినవారందరిలో యాంటిబాడీస్ సమృద్ధిగా ఉంటాయి. సమర్థవంతమైన టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ వ్యవస్థ మన దగ్గర ఉంది. దవాఖానల్లో సదుపాయాలకు కొదవ లేదు. గతంతో పోలిస్తే.. వైద్యులతోపాటు పారామెడికల్, నర్సింగ్ సిబ్బందికి కొవిడ్ పట్ల పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. చికిత్స చేయడంలో అనుభవం పెరిగింది. గ్రామాల్లో మనకంటూ 30 వేల మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. కాబట్టి, మనం వైరస్ విస్తరణ గురించి భయపడాల్సిన పన్లేదు.
వ్యాక్సిన్ తీసుకున్నా..
టీకా తీసుకున్న తర్వాత కూడా బీఎఫ్-7 వచ్చే ఆస్కారం ఉంది. కరోనా ప్రభావం ఏమంత తీవ్రంగా ఉండకపోయినా సరే, బూస్టర్ డోస్ తీసుకోవడం ఉత్తమం. ఇది వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మన దగ్గర కొవిడ్ను ఎదిరించే యాంటి వైరల్ మందులు అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్ కంపెనీ అమెరికాలో ‘పాక్స్లోవిడ్’ పేరుతో మందులను ప్రవేశపెట్టింది. మన వద్ద ‘జనరా’ అనే కంపెనీ ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నది. ఈ ప్యాక్లో రెండు రకాల మాత్రలు ఉంటాయి. 1. నిర్మాట్రెల్విర్ 2. రిటోనవిర్. ఈ రెండు మందులు కలిపి ఐదు రోజులు తీసుకోవాలి. ఓపీ రోగులకు కూడా ఈ మాత్రలు ఇవ్వవచ్చు. మొత్తానికి, కరోనా మనకు కొత్త రోగం కాదిప్పుడు. ఆ వైరస్ను నిలువరించే సమర్థత మనకు ఉంది. అలా గని నిర్లక్ష్యం వద్దేవద్దు.
ఈ మధ్యకాలంలో చాలామంది కొవిడ్ను పూర్తిగా విస్మరించారు. మాస్క్ ధరించడం మానేశారు. వైరస్ వల్ల చాలామందిలో ప్రాణాపాయం లేకపోయినా, కొవిడ్ తర్వాత ఉత్పన్నమయ్యే.. లాంగ్ కొవిడ్ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే మాత్రం జాగ్రత్తపడాలి. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. సాధ్యమైనంత వరకు జన సమూహాలకు, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. శానిటైజర్ వాడాలి. ప్రస్తుతం జలుబు, జ్వరం, దగ్గు అధికంగా ఉన్నాయి. అదే సమయంలో కరోనా బీఎఫ్-7 కేసులు కూడా నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఏ లక్షణాలు కనిపించినా సరే, వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. మూడు రోజుల్లో తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ అని తేలితే, ఐసోలేషన్లోకి వెళ్లి వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
– డాక్టర్ ఎం.వి.రావు సీనియర్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్