ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేన్నయినా సాధించగలడు. కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ప్రస్తుతం మనిషి సంపాదిస్తున్న డబ్బులో సగానికి పైగా ఆరోగ్యం కోసమే వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల పట్ల మొగ్గుచూపడం ఎక్కువైపోయింది. మార్కెట్లో వివిధ రకాల స్క్రీనింగ్ టెస్టుల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. జనం కూడా ఆరోగ్య సంరక్షణ ధ్యాసతో వీటిపై దృష్టి సారిస్తున్నారు. కాకపోతే వీటిలో అత్యవసరమైన వాటికంటే అనవసరమైన స్క్రీనింగ్ పరీక్షలే ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు వైద్యులు. ఈ పరీక్షల్లో ఏ వ్యాధీ నిర్ధారణ జరగకపోవడంతో కొంతమంది తాము పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తున్నారు. చివరికి రిస్క్తో కూడిన జబ్బులు ప్రభావం చూపడంతో రోగులు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కుంగిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది. కాబట్టి మనం ముందుగా అసలు ఆరోగ్యం అంటే ఏంటి, వ్యాధులు ఎలా వస్తాయి, ఆరోగ్యకరమైన జీవనానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం వ్యక్తుల మానసిక, శారీరక, సామాజిక శ్రేయస్సునే ఆరోగ్యంగా పరిగణిస్తారు. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతను మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఉండాలి. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అతను నివసించే సామాజిక పరిస్థితులు సైతం ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే మనిషి పూర్తి ఆరోగ్యంతో మనగలుగుతాడు. కేవలం వ్యాధులు లేకపోయినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఏవైనా మానసిక ఒత్తిళ్లతో బాధపడుతూ ఉంటే ఆ మానసిక ఒత్తిడే క్రమంగా పలురకాల జబ్బులకు దారితీస్తుంది.
ఇక శారీరంగా కూడా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతను చేసే శారీరక శ్రమకు తగిన ఆహారంతోపాటు విశ్రాంతి కూడా తీసుకోవాలి. అప్పుడే అతనికి శారీరక ఆరోగ్యం లభిస్తుంది. సామాజిక ఆరోగ్యం అంటే వ్యక్తి నివసించే ప్రదేశంలో, పనిచేసే చోట ప్రశాంత వాతావరణం ఉండాలి. ఇంట్లో తరచూ గొడవలు, పనిచేసే చోట పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ ఏవైనా సమస్యలు ఉంటే దానివల్ల మానసిక, శారీరక ఒత్తిడి పెరిగి పలురకాల జబ్బులకు దారితీయవచ్చు. అందుకని ఈ మూడు అంశాలు ఆరోగ్యకరంగా ఉంటేనే ఎవ్వరైనా సరే పూర్తి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారు.
కాలంతోపాటు జబ్బులూ మారతాయి
జబ్బు అనేది ఒక వ్యక్తికి, ఒక అవయవానికి లేదా ఒక వ్యవస్థకు వచ్చే ప్రత్యేక సమస్య. అది కాలానుగుణంగా ఆయా పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉండవచ్చు. ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు జీవనశైలికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి. కారణం మారిన ఆహారపు అలవాట్లు, మనిషి జీవన విధానం తదితర పరిస్థితులు. మారిన వాతావరణ పరిస్థితులు, ఆహార లభ్యత ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ తగ్గడం తదితర కారణాల వల్ల కొన్నిరకాల జీవనశైలి వ్యాధులు పెరిగాయి.
గతంలో కూడా మనిషి ఆరోగ్యంగానే ఉండేవాడు. కానీ వైద్యరంగంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇన్ఫెక్షన్స్కు ఎక్కువగా ప్రభావితులయ్యేవారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యాన్ని రకరకాలుగా నిర్వచిస్తున్నారు. ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటూ, జిమ్లో వర్కవుట్లు చేసి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే… అదే ఆరోగ్యం అని చాలామంది భ్రమపడుతున్నారు. అది కేవలం బయటికి కనిపించేది మాత్రమే. అలా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదని తెలుసుకోవాలి.
పనినిబట్టే ఆరోగ్యం… వ్యాధులు
జబ్బులు చాలా రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని వయసు రీత్యా వచ్చేవి కాగా మరికొన్ని వాతావరణ పరిస్థితుల ఆధారంగా వస్తాయి. ఇంకొన్ని ఆహారపు అలవాట్లు, చేసే పని ఆధారంగా వచ్చే వ్యాధులు ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా సీజనల్ వ్యాధులు దాడిచేయొచ్చు. లేదంటే ఇతర వ్యాధులు రావచ్చు. మరికొన్ని వ్యాధులు ప్రాంతాలవారీగా వచ్చేవి ఉంటాయి. ఉదాహరణకు కొండప్రాంతాల్లో కొన్నిరకాల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. తీర ప్రాంతాల్లో కొన్ని రుగ్మతలు ప్రబలుతాయి. ఇలా ప్రాంతాలవారీగా కూడా వ్యాధుల్లో తేడాలు ఉంటాయి. వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో చిన్నప్పుడు వచ్చే వ్యాధులు, పెద్దయ్యాక వచ్చే జబ్బులు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి వ్యక్తికీ అన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు. ఎక్కువ శాతం జబ్బులు వారు చేసే వృత్తి, వయసు, జీవనశైలి, ఆహారపు అలవాట్ల ఆధారంగా వస్తాయి. వాటిని గుర్తించడం, నివారించడం ఎలా అని తెలుసుకోవడం ప్రధానం.
ఉదాహరణకు యాభై ఏండ్లు దాటినవాళ్లు.. ఎక్కువగా కూర్చుని పనిచేస్తుంటే గనుక వాళ్లు బీపీ, షుగర్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. అదే ముప్పయ్యేండ్ల వయసు, ఆరోగ్యవంతులైన వారికి వైద్య పరీక్షల అవసరం పెద్దగా ఉండదు. ఇక ముప్పై ఏండ్లు పైబడిన మహిళలు మూడేండ్లకోసారి గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. అయితే, మనదేశంలో కనీసం పదిశాతం మంది కూడా సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం లేదు. మరోవైపు ప్యాకేజీల రూపంలో అనవసరమైన పరీక్షలు మాత్రం చేయించుకుంటూ ఉండటం శోచనీయం. దీంతో సరైన స్క్రీనింగ్ జరగకపోవడం వల్ల మహిళల్లో చాలా మంది రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ల బారిన పడుతున్నారు.
వయసుతోపాటు ముప్పు…
వయసు రీత్యా ఎలాంటి జబ్బులు వచ్చే ముప్పు ఉంటుందో వాటికి సంబంధించిన వైద్య పరీక్షలే చేయాలి. కానీ అందరికీ అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు హెల్త్ ప్యాకేజ్లో చెస్ట్ ఎక్స్రే, అబ్డామినల్ అల్ట్రాసౌండ్ లాంటివి ఉంటాయి. ఈ పరీక్షలు అందరికీ అవసరం లేదు. దగ్గు, కడుపులో నొప్పి తదితర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఈ పరీక్షలు అవసరం.
ఆరోగ్య సూత్రాలు
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా రెండు నియమాలు పాటించాల్సి ఉంటుంది. మొదటగా.. మనం చేసే పనికి తగిన ఆహార విధానాన్ని అనుసరించాలి. ఇప్పుడు ఎక్కువగా డెస్క్ ఉద్యోగాలే చేస్తున్నారు. ఇలాంటి పనుల్లో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రతిరోజూ అరగంట పాటు రోజువారీ పనితో సంబంధం లేకుండా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఏదైనా వ్యాయామం లాంటివి వారంలో కనీసం ఐదు రోజులు తప్పకుండా చేయాలి. రెండోది… ఆహారంలో సింపుల్ కార్బొహైడ్రేట్స్ తగ్గించాలి. కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు జొన్నలు, కొర్రలు మొదలైన చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల షుగర్, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యవంతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.
ఇక ఇప్పటికే ఏవైనా జబ్బులు ఉంటే వాటి లక్షణాలను బట్టి కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బీపీ రోగులు ఉప్పు తగ్గించాలి. మధుమేహం ఉంటే తియ్యటి పదార్థాలకు దూరం ఉండాలి. డాక్టర్ల సూచన లేకుండా విటమిన్ సప్లిమెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు. ముతకధాన్యం, చిరుధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు, పాల పదార్థాలతో కూడిన సమతులాహారం తినాలి. తీసుకునే ఆహారంలో 3వ వంతు కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. మరో మూడోవంతు ప్రొటీన్లు ఉంటే మంచిది. మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని మర్చిపోవద్దు.
మహేశ్వర్రావు
బండారి
డాక్టర్ సాయినాథ్ , బేతనభొట్ల
మెడికల్ ఆంకాలజీ,బీఎంటీ విభాగ అధిపతి
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్