మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర తప్పనిసరి. నిద్ర అనేది దీర్ఘకాలిక అనారోగ్యాలనుంచి కాపాడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ప్రతి మనిషికీ కనీసం ఆరుగంటలైనా నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 7-9గంటలు నిద్రపోయేవారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.
కానీ, నిద్రలేమి ఒక సాధారణ రుగ్మతగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 60శాతం కంటే ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి అనేది శారీరక, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కాగా, నిద్రకు, మనం తీసుకునే ఆహారానికి అవినాభావ సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓ ఐదురకాల పదార్థాలు తీసుకుంటే వద్దన్నా నిద్ర వస్తుందని వారు పేర్కొంటున్నారు.
1. అశ్వగంధ
అశ్వగంధలో ప్రధాన క్రియాశీల పదార్థాలు వితనోలైడ్లు. ఇవి ఒత్తిడిని తగ్గించే సామర్థ్యంతో పాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఒత్తిడి వల్ల నిద్రలేమితో బాధపడుతుంటే అశ్వగంధ చాలా ఉపయోగపడుతుంది. అలాగే, అశ్వగంధలో నిద్రకు తోడ్పడే ట్రై ఎథిలీన్ గ్లైకాల్ ఉంటుంది.
2. బాదం
బాదంలో మెలటోనిన్, మెగ్నీషియం, జింక్లాంటి ముఖ్యమైన ఖనిజాలుంటాయి, ఇవి శారీరక ప్రక్రియల శ్రేణికి అవసరం. మెలటోనిన్, మెగ్నీషియం, జింక్ కలయిక నిద్ర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ బాదం తింటే మంచి నిద్రకు సహాయపడుతుంది.
3. చమోమిలే టీ
చమోమిలే టీ లేదా చామంతిపూల టీ అనేది ఒక ప్రముఖ హెర్బల్ టీ. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీని తీసుకుంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇది నిద్ర ప్రేరకంగా ఉపయోగపడుతుంది. మెదడులోని బెంజోడియాజిపైన్ గ్రాహకాలతో బంధించే గుణమున్నఫ్లేవనాయిడ్స్, ఎపిజెనిన్లు చమోమిలే టీలో ఉండడం వల్ల మంచి నిద్రపడుతుంది.
4. వైట్ రైస్
ప్రతిరోజూ రాత్రి భోజనానికి ముందు వైట్ రైస్ తింటే మంచి నిద్రపడుతుంది. వైట్ రైస్లాంటి అధిక జీఐ (గ్లైసమిక్ ఇండెక్స్) ఉన్న ఆహారాలు తీసుకుంటే నిద్ర తొందరగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వైట్రైస్ తింటే ప్రయోజనం ఉంటుంది.
5. అరటిపండ్లు
అరటి తొక్కల్లో ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటుంది. అరటి పండులో మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు మంచి రాత్రి నిద్రను పొందడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తింటే ప్రయోజనం ఉంటుంది.