న్యూ ఢిల్లీ: శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్యర్ధాలు, అదనపు ద్రవ్యాలను సమర్థవంతంగా తొలగించలేవు. దీంతో డయాలసిస్ ద్వారా రక్తాన్ని వడకట్టి.. అవాంఛిత టాక్సిన్స్, అదనపు ద్రవ్యాలు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తారు. కిడ్నీలు 80 శాతం పాడయ్యేవరకు బాగానే పనిచేస్తాయి.
ధూమపానం, మద్యపానంలాంటి అనారోగ్య అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోతాయి. అధిక బరువు, ఇతరత్రా కారణాల వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. మనం సింపుల్గా తీసుకునే కొన్ని ప్రాథమిక, రోజువారీ అలవాట్ల వల్ల కూడా కిడ్నీలు పాడైపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని చాలా తక్కువ మంది వ్యక్తులు గ్రహించలేరని అంటున్నారు. మరి ఆ ఐదు చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
1. తగినంత నీరు తాగకపోవడం..
తగినంత నీరు తాగకపోవడంతో శరీరం డీ హైడ్రేషన్కు గురవుతుంది. బీన్ ఆకారంలో ఉన్న అవయవాలకు తగిన మొత్తంలో నీరు లభించనప్పుడు, అవి వ్యర్థాలను తొలగించలేవు. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర కిడ్నీ వ్యాధులు వస్తాయి.
2. శరీరానికి ఎండ తగలకపోవడం..
సూర్యరశ్మిలో ఉండే పోషకాలు ఆరోగ్యకరమైన కిడ్నీలకు కీలకం. ఉదయం పూట ఎండలో విటమిన్ డీ ఉంటుంది. విటమిన్ డీ లోపంతో కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్ని నివారించేందుకు విటమిన్ బీ6 తీసుకోవడంతో పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
3. పెయిన్ కిల్లర్స్ను ఎక్కువగా ఉపయోగించడం..
వెన్ను, తలనొప్పి, అనేక ఇతర రకాల నొప్పులను తగ్గించుకునేందుకు చాలామంది రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. వీటిని ఎక్కువసార్లు వాడితే కిడ్నీ క్యాన్సర్ బారినపడే ప్రమాదముంది. అందుకే చిన్నపాటి నొప్పులకుకూడా పెయిన్ కిల్లర్స్ వాడొద్దు.
4. అతిగా ఆల్కహాల్ తాగడం..
పరిమిత పరిమాణంలో ఆల్కహాల్ శరీరానికి హానిచేయదు. కానీ, అతిగా తాగితే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజుకు నాలుగు కంటే ఎక్కువ పెగ్లు దీర్ఘకాలంపాటు తాగేవారిలో కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
5. అధికంగా ఉప్పు తీసుకోవడం..
అధిక ఉప్పు ప్రాణానికే ముప్పు. ఉప్పులో సోడియం ఉంటుంది. రోజులో అధికంగా ఉప్పు తీసుకుంటే అది హై బీపీకి దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో హానికరం. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయడమేగాక గుండె జబ్బులు, స్ట్రోక్కు కారణమవుతుంది.