ఆయిల్పాం సాగు విస్తరణలో..
అశ్వారావుపేట, జూలై 22: రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో ఉద్యానశాఖ ప్రధాన భాగస్వామ్యం కానుందని హార్టికల్చర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీవీ భాగ్యలక్ష్మి తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు విస్తరణకు లక్ష్యాన్ని నిర్దేశించారని, ఇందుకోసం ఆయిల్పాం రైతులకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనున్నారని చెప్పారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో గురువారం పర్యటించిన ఆమె.. అకినేపల్లి, అచ్యుతాపురం, అశ్వారావుపేట కొబ్బరి విత్తనోత్పత్తి, పట్టు విత్తనోత్పత్తి నర్సరీలను సందర్శించారు. ఆయిల్పాం మొక్కల పెంపకానికి అవసరమైన వనరులను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా ఆయిల్పాం సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.36 వేల వరకు సీఎం కేసీఆర్ రాయితీలు ప్రకటించారని, ఆ దశగా సాగు విస్తరణ ప్రణాళికను వేగవంతం చేశారని చెప్పారు. హార్టికల్చర్ ఏడీ సువర్ణ, జిల్లా ఉద్యానాధికారి జినుగు మరియన్న, మండల ఉద్యానాధికారులు కిశోర్, మంగ పాల్గొన్నారు.