హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కొందరిలో జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. కానీ, కొందరు ఆ లక్షణాలు రాకుండా, ఒకవేళ వస్తే నివారణ కోసం ఇష్టారీతిగా పెయిన్కిల్లర్లను వేసుకుంటున్నట్టు వైద్యులు చెప్తున్నారు. పెయిన్కిల్లర్ వాడితే రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై వ్యాక్సిన్ అసలు లక్ష్యం నెరవేరదని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అంటేనే.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్రమబద్ధం చేస్తూ ఫలానా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే గుర్తించి చంపేందుకు ముందస్తుగా సిద్ధం చేయడం.
ఈ ప్రక్రియలో కొందరిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, వాపు వంటివి కనిపిస్తే.. వ్యాక్సిన్ దానిపని అది సమర్థంగా నిర్వర్తిస్తున్నదని అర్థం. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందు, తర్వాత పెయిన్కిల్లర్స్ వాడటంవల్ల అవి రోగ నిరోధక శక్తి పెరుగకుండా అడ్డుకుంటాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇబ్రూఫెన్ ఉండే కొన్నిరకాల పెయిన్ కిల్లర్లు రోగనిరోధకశక్తిని అడ్డుకుంటాయని ఎలుకల్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ మందులు వేసుకుంటే వ్యాక్సిన్ వల్ల విడుదలయ్యే యాంటీబాడీలు తగ్గిపోతాయని, వైరస్ ప్రభావం శరీరంలో తగ్గకపోగా.. యాంటీబాడీలు తక్కువగా ఉండటం వల్ల అది మరింతగా పెరుగుతుందని తేలింది. చిన్నపిల్లల్లోనూ వ్యాక్సిన్ ప్రభావాన్ని పెయిన్ కిల్లర్లు తగ్గిస్తాయని మరో అధ్యయనంలో వెల్లడయింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకునేముందు పెయిన్కిల్లర్స్ తీసుకోకూడదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే రోజూ తీసుకునేవారు ఆపాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒళ్లు నొప్పులతో బాధపడుతూ పెయిన్కిల్లర్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే యాంటీబాడీల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపించని ఎసిటమినోఫెన్ వంటివి ఉపయోగించడం మంచిదని వారు వెల్లడిస్తున్నారు. దీంతోపాటు వేడినీటి కాపడం, చల్లని నీటితో అద్దుకోవడం వంటివి చేయడం, నొప్పి వచ్చిన భాగాన్ని కొద్దిగా కదుపుతూ ఉండటం జ్వరం కూడా ఉంటే బాగా నీళ్లు తాగటం, తేలికైన దుస్తులు ధరించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.