సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థత కారణంగా శనివారం ఉదయం ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. అవయవాల వైఫల్యం వల్ల పరిస్థితి సీరియస్గా మారింది. నిపుణులైన డాక్టర్ల బృందం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన అనుకున్న విధంగా చికిత్సకు స్పందించడం లేదు. కోలుకునే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి’ అని హెల్త్బులెటిన్లో పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో అసమాన అభినయంతో నవరస నటసార్వభౌమగా కైకాల సత్యనారాయణ గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు ఎనిమిదివందల చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో మెప్పించారు. 2019 తర్వాత ఆయన మరే తెలుగు చిత్రంలో నటించలేదు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.