కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూ
బీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!!
దేశంలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. దేశానికి, దేశ ఆహార భద్రతకు, ఆహారాన్ని పండించే రైతుల భవిష్యత్తుకు భంగం కలిగించే విచిత్ర వివాదానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. ఇంత కాలంగా కొనుగోలు చేస్తున్న యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని తొండికి దిగింది. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో నీతిని ప్రదర్శించవద్దని, పంజాబ్లో లాగే తెలంగాణలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు కేంద్రం మన రైతుల ధాన్యాన్ని కొనబోమ ని అంటున్నందున, పంటల మార్పిడి, అంటే వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయడం తప్ప మరో దారి లేదని రాష్ట్రప్రభుత్వం అన్నదాతలకు విన్నవిస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరి మాత్రమే వేయాలని అం టూ రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారు.
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూ, ధర్నాలు, ఆందోళనలు చేయబూనారు బీజేపీ నేతలు! దీంతో కేంద్రంపై కోపం గా ఉన్న రైతులు ఆందోళనకు దిగిన ఆ బీజేపీ వారిని తరిమి కొట్టారు. అసలు ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం?! వడ్లు కొంటున్న కేంద్రాలకుపోయి, వడ్లు కొనాలని ధర్నాలు చేయడం వింతగా ఉంది!
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి పంచవర్ష ప్రణాళికను వ్యవసాయాభివృద్ధిపై కేంద్రీకరించారు. హరిత విప్లవం ద్వారా దేశ పౌరులకు ఆహార భద్రత కల్పించారు. రాజ్యాంగంలో సైతం ఆహారం భద్రత బాధ్యతను పూర్తిగా కేంద్రానికే అప్పగించారు. ధాన్యం కొనుగోలు, అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులు, కనీస మద్దతు ధర ప్రకటించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. వడ్ల నుంచి నేరుగా బియ్యం తీస్తే వాటిని ‘రా రైస్’ అంటారు. వడ్లను ఉడుకబెట్టి బియ్యం తీస్తే, ‘బాయిల్డ్ రైస్’ అంటారు. బాయిల్డ్ రైస్లో నూక శాతం తక్కువ. అందుకే కేంద్రం ధాన్యం కాకుండా, బాయిల్డ్ రైస్ ని కొనుగోలు చేస్తుంది. ఇవి సాంబార్ రైస్, కర్డ్ రైస్ కోసం బాగుంటాయి. సాంబారన్నం తినే తమిళనాడు, కేరళల్లో ఎక్కువగా బాయిల్డ్ రైస్నే వాడతారు. ఇప్పుడు ఎక్కువ మంది రా రైస్ నే వాడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు చేసేవి బాయిల్డ్ రైస్. ఇప్పుడు బాయిల్డ్ రైస్కు డిమాండ్ తగ్గింది కాబట్టే, కేంద్రం కొనబోమని అంటున్నది. స్ట్రీమింగ్ రైస్ పంపండి అంటున్నది. స్ట్రీమ్ అంటే ఒక రకమైన పారా బాయిల్డ్ రైస్.
యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని కేంద్రానికి, సామాన్య రైతుకు, ఎఫ్సీఐకి తెలుసు. అలాగే రా రైస్ అయితే 100కిలోల వడ్లనుంచి 67కిలోలు ఇవ్వమని, బాయిల్డ్ రైస్ అయితే 100కిలోల వడ్లనుంచి 68కిలోలు ఇవ్వమని ఎఫ్సీఐ శాస్త్రీయ అధ్యయనాలతో నిర్ధారించింది. 100 కిలోల ధాన్యానికి 80కిలోల బియ్యం వస్తాయంటూ దొంగ లెక్కల అబద్ధాల ప్రచారమెందుకు? కేంద్రం కాస్ట్ షీట్ లో రా రైస్ కి 67శాతం, బాయిల్డ్ రైస్కి 68శాతం (అవుట్ టర్న్ రేషియో) బియ్యం వస్తాయని ప్రకటించింది.
సీఎంఆర్ మిల్లింగ్ బియ్యం ధర టారిఫ్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఇది కేంద్ర ఆధీనంలోని సంస్థ. కేంద్రప్రభుత్వ ఆధీనంలో టారిఫ్ కమిష న్ నిర్ణయించిన ధరల ప్రకారమే ప్రతి రాష్ర్టానికి కస్టమ్ మిల్లిం గ్ రైస్ ధర నిర్ధారించబడుతుంది. ఆ ధర ప్రకారమే బాయిల్డ్ గానీ, రా రైస్ గానీ ఎఫ్సీఐకి దశాబ్దాలుగా ఇవ్వ బడుతు న్నది. ఇది ఒక్క తెలంగాణకే కాదు, దేశంలోని అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుంది. బియ్యం లెక్కన కొన్నప్పుడు లాభ నష్టాలతో కేంద్రానికి సంబంధమేంటి? మునిగినా తేలినా రాష్ట్ర ప్రభుత్వమే కదా!? ఈ మాత్రానికి ఇంత రాద్ధాంతం దేనికి? ఎవరి కడుపులు కొట్టి ఎవరిని బతికించడానికి? అసలు ఇదంతా ఎందుకు? యాసంగిలో బియ్యం కొంటామని కేంద్రం తేల్చేస్తే సమస్య ఉండదు కదా.
యాసంగి పంటమార్పిడి చేపట్టాలంటే రైతుకు అవగాహన కల్పించాలి. మద్దతు ధర ముందే ప్రకటించాలి. తగిన విత్తన సబ్సిడీ ఇవ్వాలి. భూ పరీక్షలు నిర్వహించాలి. వాణిజ్య పంటలను పరిచయం చెయ్యాలి. అప్పుడే రైతులు పంట మార్పిడి చేస్తారు. ఇదీ కేంద్రం వాదన. నిజమే. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందదే కదా! సమృద్ధిగా సాగునీటిని ఇస్తున్నది. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నది. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచింది. రైతులకు పెట్టుబడిగా రైతుబంధు ఇస్తున్నది. రైతు బీమా అందిస్తున్నది. అందుకే ఒకప్పుడు కరువు కాటకాలకు నెలవైన తెలంగాణ ఇవ్వాళ కోటి ఎకరాల మాగాణంగా మారింది. కోటికి పైగా ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దేశంలో పండుతున్న ధాన్యంలో సగానికిపైగా ఒక్క తెలంగాణ నుంచే వస్తున్నది. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేండ్లలో నే సీఎం కేసీఆర్ దార్శనికతతో సాధించిన ప్రగతి. ఇంత వేగం గా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టానికి ప్రోత్సాహకాలు అందించాల్సిన కేంద్రం మొండి చేయి చూపిస్తే ఏం చేయాలి? రాష్ట్రం ఆయిల్పామ్ కు ఏడాదికి 30వేల సబ్సిడీ ఇస్తున్నది. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు నిరంతరంగా సూచనలు చేస్తున్నది. కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన కేంద్రం ఆ మాటే ఎత్తడం లేదు. ఎఫ్సీఐ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నది. కేంద్రం వద్దంటున్నది. ఇప్పుడు అన్నదాత ఏం కావాలి?
దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాలు ఎనిమిది.
ఇతర పార్టీలతో కలిపి బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాలు పది. ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలు 12. దేశంలో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు రాష్ర్టాలు మాత్రమే దేశానికి సరిపడా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అన్నదాతలు ఇప్పుడు కేంద్రాన్ని సూటిగా అడుగుతున్నారు.
ఏదో ఒక రూపంలో ధాన్యం కొంటరా? కొనరా? యాసంగిలో వరి సాగు చేయాలా వద్దా? ‘జై జవాన్! జై కిసాన్’ అన్న దేశంలో ఇదేం చిల్లర రాజకీయం?
రాష్ట్రసాధనకోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్ సీఎంగా ఉండి కూడా తెలంగాణ రైతుల కోసం మరోసారి ఉద్యమిస్తున్నారు. స్వయంగా ధర్నా చేస్తున్నారు. కేంద్ర మొండి వైఖరి రాష్ట్ర రైతాంగాన్ని, ఒక ప్రభుత్వాన్ని రోడ్డున పడేసింది. రైతన్నలను, రాష్ర్టాలను కన్న తల్లిలా చూడాల్సిన కేంద్రం ఇలా కడుపుకోతకు గురి చేస్తున్నది. ఇది కేంద్రం- రాష్ర్టాల కొట్లాట కాదు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రైతుగా, రైతు పక్షపాతిగా మరో ఉద్యమానికి దిగుతున్నారు. (వ్యాసకర్త: లోక్సభ సభ్యులు, చేవెళ్ళ)
కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేసే కుట్రలో భాగమే వడ్లను కొనబోమని చెప్పటం. యాసంగి వడ్లు కొనబోమని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మూసేసి, అటు మార్కెట్లను ఇటు గిడ్డంగులను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర ఇది. ఇప్పటికే వ్యవసాయ మోటార్ల కాడ మీటర్లు పెట్టి ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తున్న కేంద్రం, రేపు రైతుని కార్పొరేట్లకు కట్టుబానిస చేయాలని చూస్తున్నది.
డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి