హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్యూలకు షెడ్యూల్ విడుదలైంది. 2024 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించింది. ఈ ఇంటర్వ్యూలకు మొత్తం 2,844 మంది అర్హత సాధించగా.. తొలుత 1,026 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ను విడుదల చేసింది. మిగతా 1,818 అభ్యర్థుల షెడ్యూల్ను తర్వాత విడుదల చేయనున్నట్టు యూపీఎస్సీ పేరొన్నది. తొలి విడతలో ఇంటర్వ్యూకు హాజరయ్యేవారి ఈ-కాల్ లెటర్లను త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థనలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల ప్రయాణ సంబంధ ఖర్చులను రీయింబర్స్ చేస్తామని, రైళ్లలో సెకెండ్/స్లీపర్ తరగతుల్లో ప్రయాణానికే డబ్బులు చెల్లిస్తామని వివరించింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. వారికి సెప్టెంబరు 15 నుంచి 24 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించి ఈ నెల 8న ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ.. తాజాగా ఇంటర్వ్యూలకు షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ ఇంటర్వ్యూలకు ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 90 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు అంచనా.