భారతీయ ఆరాధనా సంప్రదాయంలో శ్రీమహావిష్ణువును వివిధ రూపాల్లో ఆరాధించడం అనాదిగా కొనసాగుతున్నదే. విష్ణువు రూపాల్లో సగుణోపాసనలో భారతదేశంలో ఎక్కువగా కనిపించే మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడివి కావడం గమనించాల్సిన విషయం. అయితే రాముడి కంటే కృష్ణుడి విగ్రహాల్లో వైవిధ్యం ఎక్కువగా ఉండటం విశేషం. కృష్ణుడి బాల్యం ఎక్కువగా గడిచిన బృందావనంలో వేణువును చేతిలో ఉంచుకొని, త్రిభంగి నాట్యముద్రలో బన్కే బిహారిగా (వన విహారి) పూజలు అందుకుంటున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం నాథ్ద్వారాలో గోవర్ధన గిరిధారి రూపంలో శ్రీనాథ్జీగా, గుజరాత్లోని ద్వారకలో రణ్చోఢ్రాయ్గా, మహారాష్ట్ర పండరీపురంలో నడుముపై చేతులు ఉంచుకొని భక్తుల కోసం ఎదురుచూస్తూ విఠ్ఠలుడిగా, చేతిలో కవ్వం పట్టుకొని పశ్చిమాభిముఖంగా ఉడుపిలో (కర్ణాటక) శ్రీకృష్ణుడిగా, జనన సమయంలో నాలుగు చేతులతో దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చిన రూపంలో కేరళలోని గురువాయూరులో, మీసాలు శంఖంతో పార్థసారథిగా తమిళనాడు రాజధాని చెన్నపట్నంలో, ఒడిశాలోని పూరీలో జగన్నాథుడిగా అసంపూర్ణ రూపంలో దర్శనమిస్తాడు. విభిన్నమైన రూపాలతో తనను చూడవచ్చిన వారిని కటాక్షిస్తున్నాడు. ఈ విగ్రహాలలో వైవిధ్యం వెనక భారతీయ ఆలయ సంప్రదాయంలో ఓ కథ ప్రచారంలో ఉంది.
అది శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన అనంతర కాలం. అప్పుడు ఆయన మునిమనుమడు వజ్రనాభుడు మథుర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. కృష్ణుడు, రుక్మిణి సంతానం ప్రద్యుమ్నుడు. ఆయన కొడుకు అనిరుద్ధుడు. ఆయన తనయుడే ఈ వజ్రనాభుడు. ఆయనకు తన ముత్తాత రూప లావణ్యం గురించి వినడమే తప్ప, ఎలా ఉంటుందో తెలియదు. ఆ వివరాలు తెలుసుకునేందుకు మథుర నుంచి హస్తినాపురం వెళ్తాడు. అభిమన్యుడి భార్య ఉత్తరను కలుసుకుంటాడు. ఆమె అప్పటికే బాగా వృద్ధురాలై ఉంటుంది. ఆమెను తన ముత్తాత రూప విశేషాల గురించి చెప్పమని అడుగుతాడు వజ్రనాభుడు. అంతేకాదు ఆమె చెప్తున్న వివరాల ఆధారంగా విగ్రహాలను తయారు చేయడానికి నిపుణులైన శిల్పులనూ తన వెంట తీసుకువెళ్తాడు.
శ్రీకృష్ణుడి ముగ్ధమనోహర రూపాన్ని గురించి ‘ఆయన కురచైన భుజాలను కలిగి ఉంటాడు. పెదవులు వెడల్పుగా ఉంటాయి. కాళ్లు, చేతులు సొగసుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వెంట్రుకలు గిరజాలు తిరిగి ఉంటాయి. శరీరం దట్టమైన నలుపు రంగులో ఉంటుంది. కండ్లలో దయ కనిపిస్తుంది. నడవడికలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. నవ్వులో కొంటెతనం తొంగిచూస్తుంది. ఆయనకు పట్టు పీతాంబరాలు, చందనపు పూత అంటే ఎంతో ఇష్టం. చెవులకు మకర కుండలాలు అలంకారంగా ఒప్పారుతాయి. మెడలో పరిమళాలు వెదజల్లే వివిధ పుష్పాలతో కూడిన దండ, తలపై నెమలి పింఛం కిరీటంగా ఉంటాయి…’ అంటూ కృష్ణుడికి సంబంధించిన ప్రతీ చిన్న వివరాన్ని విడవకుండా విడమరిచి వజ్రనాభుడి కండ్లకు కట్టేలా వర్ణిస్తుంది ఉత్తర.
ఈ వివరాల ఆధారంగా వెంట వచ్చిన శిల్పులను తన ముత్తాత విగ్రహాలను చెక్కమని అడుగుతాడు వజ్రనాభుడు. కొందరు శిల్పులు ముఖ కవళికలను అందంగా చూపుతారు. మరికొందరు చేతివేళ్లను, ఇంకొందరు కాళ్లను, ఇంకా కొందరు కృష్ణుడి కొంటెనవ్వును ఇలా దేనికదే నైపుణ్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. కానీ పరిపూర్ణమైన రూపాన్ని మాత్రం చెక్కలేకపోయారట. ఏదేమైనప్పటికీ తన ఆదేశం మేరకు రూపొందాయి కాబట్టి, ఈ విగ్రహాలన్నింటినీ వజ్రనాభుడు భక్తితో పూజించాడట. కాలక్రమంలో ఇవే భారతదేశం నలుమూలకూ చేరుకున్నాయని అంటారు. అలా జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుడు ఒక్కో దగ్గర ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నాడని కథ ప్రచారంలో ఉంది.
కథను అలా ఉంచితే భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్న ఈ ప్రాంతాల్లో కొలువైన మూర్తులను శ్రీకృష్ణుడి స్వయంవ్యక్త రూపాలుగానే పూజిస్తున్నారు. ఈ మూర్తులను ప్రతిరోజూ రంగురంగుల పట్టువస్ర్తాలతో ముస్తాబుచేస్తారు. తులసిమాలలు, సువాసనలు వెదజల్లే పూలహారాలను మెడలో అలంకరిస్తారు. షోడశోపచారాలతో అర్చిస్తారు. భక్తి శ్రద్ధలతో వండిన రుచికరమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సంగీతం, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. వివిధ ఉత్సవాలను వైభవంగా జరిపిస్తారు. అలా ఈ భూమండలం అంతాకూడా పరమాత్ముడి రంగస్థలం అనే సూక్ష్మాన్ని గుర్తుచేస్తారు.
– చింతలపల్లి హర్షవర్ధన్