దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే.. వీరి శ్రామిక శక్తి ఇంటి పనుల్లో, అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్నది. వీరి సేవలు వెలకట్టలేనివి. కానీ మన దేశంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న ప్రతి 10 మందిలో 9 మంది పురుషులే. అంటే ఉద్యోగ ఉపాధి రంగాల్లో మహిళా శ్రామిక శక్తి చాలా తక్కువ. వీరి శక్తి సామర్థ్యాలన్నీ ఇంటిపనులకే పరిమితమవుతున్నాయి. ఈ తీరులో మార్పు రావాలి. అవకాశాల్లోనూ సరైన ప్రాతినిధ్యం లభించినపుడే మహిళ సాధికారత సాధ్యమవుతుంది.
పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణలోనే మహిళలు కాలం గడిపేస్తున్నారు. మనదేశంలో ఇంటి పనుల్లో సహాయ సహకారాలు అందిస్తున్న పురుషుల సమయం రోజుకు 19 నిమిషాలైతే, మహిళలు వెచ్చిస్తున్న సమయం 298 నిమిషాలు. అదే అమెరికాలో అయితే పురుషులు ఇంటిపనుల్లో 82 నిమిషాలు, మహిళలు 135 నిమిషాలు వెచ్చిస్తున్నారు. స్లోవేనియా దేశంలో ఇంటి పనుల్లో పురుషులు 114 నిమిషాలు, మహిళలు 212 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఇక మనదేశంలో ఉద్యోగ ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న మహిళలు రోజుకు 8 గంటలు ఉపాధి రంగంలో, 2 గంటలు ప్రయాణానికి, సుమారు 5 గంటలు పైబడి ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు. అందుకే వీరిని సూపర్ ఉమెన్ గా పరిగణిస్తారు. ఆడవారికి చేదోడువాదోడుగా పురుషులు సహాయసహకారాలందించాలి. కానీ అన్ని సమయాల్లో అది జరగటం లేదు.
నేడు మన దేశంలో 24 శాతం మంది మహిళలు మాత్రమే వివిధ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నిమగ్నమయ్యారు. నేటికీ మనదేశంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ వల్ల మహిళలపై ఎక్కువ భారం పడుతున్నది. ఈ నేపథ్యంలో మహిళల శ్రమను గౌరవించాలి. ముఖ్యంగా మహిళలకు విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. కుటుంబసభ్యులు కూడా ప్రోత్సహించాలి.
బాలికలు, మహిళలకు సంబంధించిన అనేక చట్టాలపై అవగాహన కల్పించాలి. వీరి భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వరకట్న వేధింపులు గృహహింసకు ఫుల్స్టాప్ పెట్టాలి. ఆరోగ్య పరంగా మహిళలు బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారికి పోషకాహారం అందించే ఏర్పాట్లు చేయాలి. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలి. ఇటీవల మనదేశం ప్రయోగించిన చంద్రయాన్-3 రూపకల్పనలో సుమారు 100 మంది మహిళల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మరువరాదు.
మన దేశంలో నేటికీ మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారు. ఈ వైఖరిలో మార్పు రావాలి. సామాజిక , లింగ వివక్ష లేకుండా చూడాలి. ఆర్థిక అసమానతలను రూపుమాపాలి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకు వచ్చాయి. పాలకులు మహిళా అభివృద్ధికి, సాధికారతకు పాటుపడుతున్నామని తరచూ చెప్తుంటారు. కానీ నేటికీ పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లుకు ఆమోదం లభించకపోవడం గర్హనీయం. వివిధ పరిశ్రమలు, సంస్థల్లో మహిళల పనిచేసే ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలుండే విధంగా చూడాలి.
దేశంలో మహిళా భద్రతా చ ట్టాలను సక్రమంగా అమలు చేయాలి. పురుషులతో సమానం గా మహిళలకు వేతనాలు మం జూరు చేయాలి. ఏ రకమైన వివక్షత లేకుండా మహిళల అభ్యున్నతికి పాటుపడటమే మనందరి కర్తవ్యం. తద్వారా దేశ జీడీపీ పెరి గి, భవిష్యత్తులో మనం కలలు కంటున్న 3వ అతి పెద్ద ఆర్థికవ్యవస్థను నిర్మించగలుగుతాం.
– ఐపీ రావు 63056 82733