స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సామాజిక వ్యవస్థ సక్రమంగా సాగటానికి స్త్రీ కారణం అన్న సత్యాన్ని విస్మరించలేము. సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ ముందు తరాలకు స్ఫూర్తి నిచ్చే విధంగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ రోజును మహిళలు ఆర్థికంగా సాంఘికంగా సాంస్కృతికంగా విజయోత్సవాలు జరుపుకొనే రోజుగా చెప్పవచ్చు. మహిళలకు న్యాయం, సామాజిక హోదా, సమానత్వం, ప్రశంస, గౌరవం మహిళా దినోత్సవ లక్ష్యాలుగా చెప్పుకొంటున్నాం.
గతంలో ఇంటి పనులకే పరిమితమైన స్త్రీలు.. అన్ని రకాల ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని నేడు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. నేడు మహిళలు విద్య, వైద్య, సామాజిక, సాహిత్య, సాంకేతిక, పారిశ్రామిక, పాత్రికేయ, క్రీడా, రాజకీయ రంగాల్లో సమర్థంగా విధులను నిర్వహిస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు.
దుర్గాబాయి దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు, అనిబిసెంట్, విజయలక్ష్మీ పండిట్, కమలా నెహ్రూ, కస్తూరిబా గాంధీ.. మొదలగు మహిళ లు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి విజయం సాధించారు. ఇందిరాగాంధీ మొదలు, ప్రతిభా పాటిల్, మేధాపాట్కర్, మదర్ థెరిస్సా, కల్ప నా చావ్లా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, పి.సుశీల, ఎస్.జానకి, లతా మంగేష్కర్, సానియా మీర్జా, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, మాలవత్ పూర్ణ తదితరులు తమ తమ రంగాల్లో అద్భుత విజయాలు సాధించారు. చట్టపరంగా పురుషులకు మహిళలకు సమాన హక్కులు అన్నవి ఇంకా అంతటా అనుభవంలోకి రాకపోవటం విచారకరం. 2011 గణాంక లెక్కల ప్రకారం దేశంలో స్త్రీ పురుషుల అక్షరాస్యతలో కూడా వ్యత్యాసం ఉన్నది. మొత్తం 74.04 శాతం అక్షరాస్యతలో 82.14 శాతం పురుషుల అక్షరాస్యత ఉంటే, 65.46 శాతం మాత్రమే స్త్రీల అక్షరాస్యత ఉన్నది. ఈ తేడా గ్రామీణ ప్రాంతాలలో మరీ ఎక్కువగా ఉన్నది. మహిళల స్థితి గతులు బాగుపడనిదే.. సమాజం అభివృద్ధి చెందదు. అన్నీ మారుతున్నాయి కానీ మహిళల పట్ల కొందరి ఆలోచనాధోరణి మాత్రం ఇంకా మారడం లేదు. బంధం కోసం, బాధ్యత కోసం, అందరికీ ఆత్మీయత పంచి, అహర్నిశలు కష్టించి ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వందనం చేయాల్సిందే
– డాక్టర్ కోడూరి శ్రీవాణి
ఆర్థిక రంగంలోనూ అతివలు..
ఆర్థిక ప్రాతినిధ్యం, ఆర్థిక ఫలాలు రెండూ మహిళలకు అందుబాటులో ఉండాలి. ప్రపంచ స్థాయి మార్కెట్లతో పోటీపడుతూ తట్టుకుని నిలబడే అవకాశం ఇచ్చేందుకు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వి-హబ్’ ప్రారంభించటం హర్షణీయం. సమాజంలో అట్టడుగున ఉన్న పేద మహిళలకు, స్వయం సహాయక గ్రూప్ల్లో ఉన్న మహిళలకు వ్యక్తిగతంగా ఎలాంటి తనఖా లేకుండా వారి వ్యాపార అభివృద్ధి కోసం ‘స్త్రీ నిధి’ ద్వారా పావలా వడ్డీకే లక్ష అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలు అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధమైన అభివృద్ధి సంక్షేమాలతోనే మహిళా సాధికారత కల సాకారమవుతుంది. అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న మహిళా మణులందరికీ
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
తోడుగా నిలువాలి
మగవాడి చదువు అతనికే పరిమితం. మహిళల చదువు ఇంటికే కాదు మొత్తం సమాజానికే వెలుగు. అటువంటి మహిళల పట్ల గౌరవ మర్యాదలతో మనం నడుచుకోవాలి. అప్పుడే తల్లి రుణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. అమ్మగా , సోదరిగా, భార్యగా, అమ్మమ్మగా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే త్యాగమూర్తులైన మహిళల కష్ట సుఖంలో మనం బాధ్యతగా తోడుగా నిలవాలి. అప్పుడే మహిళా దినోత్సవ సార్థకత. – గడ్డం సంపత్