2020, మార్చి 25 తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులు విజయపురి సౌత్, పంచలింగాల, గరికపాడు, పొందుగుల!
దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్న ఆ సమయంలో తమ సొంత రాష్ట్రంలోకి వెళ్లడానికి ఎన్ఓసీలు సంపాదించి హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరానికి పైగా ప్రయాణించి సరిహద్దులకు చేరుకున్న ఆంధ్రాకు చెందిన ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, వారి కుటుంబాలు, విద్యార్థులను ఏపీ పోలీసులు అనుమతించలేదు. హైదరాబాద్లో హాస్టళ్లు మూసేశారని తిండి దొరకని పరిస్థితి ఉందని బతిమాలినా వినలేదు. ఊళ్లో తల్లిదండ్రులు మంచం పట్టారని కొందరు, ప్రాణాపాయంలో ఉన్నారని మరికొందరు ఇలా రకరకాల సమస్యలు చెప్పుకున్నా, వేడుకున్నా ససేమిరా అన్నారు. వాగ్వాదాలు, రాళ్ల దాడులు, లాఠీచార్జీల వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు యువకులతో పాటు గృహిణులు, చంటిపిల్లలు కూడా తిండి తిప్పల్లేక అగచాట్లు పడ్డారు. చివరికి క్వారంటైన్కు అంగీకరించిన 44 మందిని మాత్రమే అనుమతించారు. వందలాది వాహనాల్లో వచ్చిన వేలకొద్ది మంది ఉసూరుమంటూ వెనుదిరిగారు. ‘వచ్చే వాళ్లలో ఎంతమంది కరోనా మోసుకొస్తున్నారో చెప్పలేం. ఇప్పటికే ఉన్న రోగులతోనే తలమునకలవుతున్నాం.
అదనపు భారాన్ని మేం మోయలేమని పై అధికారులకు స్పష్టం చేశాం.’ ఇది విజయవాడలో ఒక ప్రధాన వైద్యాధికారి ఒక పత్రికా ప్రతినిధితో చెప్పిన మాట. ‘ఈ కఠోర సమయంలో ఇలా పంపించడం సబబు కాదు..’ మంత్రి కేటీఆర్తో ఈ విషయమై మాట్లాడిన ఆంధ్రా మంత్రి బొత్స సత్యనారాయణ అన్న మాట.
రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వ వైద్యులు, వైద్యాధికారులు,వైద్య సిబ్బంది సెలవుల్లేకుండా పనిచేస్తున్నారు. గతేడాది కూడా వారు కొన్ని నెలల పాటు తీవ్రంగా కష్టపడ్డారు. ఇప్పుడు మళ్లీ అంతకుమించి కష్టపడాల్సి వస్తున్నది. ఐదువందల మందికి సేవ చేయాల్సిన చోట వెయ్యి మందికి చేస్తున్నారు. రోజుంతా ఊపిరి సలుపని విధి నిర్వహణ జరుపుతున్నారు. దీన్ని రెండు రాష్ర్టాల అధికారుల సమన్వయలోపంగా ప్రసార మాధ్యమాలు చిత్రించాయి. అప్పుడు రాజ్యాంగాలు-హక్కులు వగైరా ఏవీ గుర్తుకురాలేదు. మానవీయ విలువలు వంటివి కొన్ని వ్యవస్థలకు కూడా గుర్తుకురాలేదు. అమ్మలా పిలిచి కడుపులో పెట్టుకోవలసిన సొంత రాష్ట్రం ఇలా తరిమివేయడమేమిటి? అని పొద్దున్నే టీవీల్లో సొల్లు కబుర్లు చెప్పే ఏ మేధావీ అడగలేదు. నాడూ ఏ కోర్టూ సుమోటో కేసులు తీసుకొని ఇది రాజ్యాంగ విరుద్ధమనీ ఉద్ఘాటించలేదు. అందరికందరూ కళ్లు, చెవులు గట్టిగా మూసుక్కూచున్నారు.
అటు ఇటుగా ఏడాది తర్వాత అదే లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. అప్పటితో పోలిస్తే పదిరెట్లు అధికంగా కరోనా కేసులు అల్లాడిస్తూ ప్రజలు భయాందోళనల్లో ఉన్న వేళ.. అవే సరిహద్దుల్లో ప్రజలను ఆపితే ఎంత రచ్చ.. ఎంత గగ్గోలు.. ఎన్ని నీతులు.. ఎన్ని ఉపదేశాలు. లైవ్లు.. శోకాలు.. వేడుకోళ్లు.. ఆగ్రహాలు. హక్కుల ప్రస్తావనలు. అవి చాలవన్నట్టు ఇక్కడ మానవతా విలువల ప్రస్తావనలు. సుత్తి ముక్తావళులు. ఒక జాతీయపార్టీ నాయకుడైతే హైదరాబాద్ హక్కుల దాక పోయాడు. పాపం ఇప్పటికే రాజధాని తరలిపోయిందని గవర్నర్ బంగళా, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ అమరావతికి చేరాయని, ఆఖరికి సచివాలయం ఖాళీ చేసి తాళాలు ఇచ్చి వెళ్లిపోయాక ఇంకే హక్కు ఎవరికీ ఉండదని తెలియదు. విభజన చట్టం సరిగా చదివి ఉండకపోవచ్చు. ఇలా అడ్డంగా వాదించినందుకే ఓ చానెల్లో సన్మానం కూడా జరిగినా సదరు శాల్తీకి జ్ఞానోదయం కలిగినట్టు లేదు. ఇక చానెళ్ల సంగతి చెప్పనక్కర లేదు. కనిపించిన ప్రతివారి ముందు గొట్టాలు పెట్టి కరుణ రసాన్ని ఒలికించడం. తామెందుకు తక్కువ తినాలన్నట్టు కొన్ని వ్యవస్థలు తమకు తామే కలుగజేసుకొని పెత్తనాలకు దిగటం.
ఈ చానెళ్లు, నాయకుల ప్రచారాలు చూస్తుంటే ఆంధ్రలో ఆస్పత్రులే లేనట్టు తెలంగాణ వారు సరిహద్దుల్లో రోగులను నిరోధించి పీక పిసికి చంపేస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణకు రాకపోతే వైద్యమే అందదేమో.. అన్యాయంగా ప్రాణాలు పోతాయేమోనన్నట్టు ప్రచారాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఏపీలో ఉన్నన్ని ఆస్పత్రులు తెలంగాణలో లేవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులు మళ్లించి బోలెడన్నిఆస్పత్రులు అక్కడే కట్టేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మినహా మిగిలిన చోట్ల చెప్పుకోదగిన ప్రభుత్వ ఆస్పత్రులు లేవు. కానీ ఏపీలో బ్రిటిష్ కాలంలోనే అక్కడ ప్రధాన నగరాలన్నింటా ఆస్పత్రులు నిర్మించారు.
విశాఖలోని కింగ్జార్జ్ హాస్పిటల్ చరిత్ర ప్రసిద్ధి చెందింది. గుంటూరు, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు దశాబ్దాల నుంచి లక్షల మందికి ప్రాణదానం చేశాయి. ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించిన చరిత్ర ఉంది. మెడికల్ విద్యార్థులు ఈ ఆస్పత్రుల్లో హౌసీ కోసం తహతహలాడుతారు. తిరుపతి రూయా ఆస్పత్రి నిమ్స్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నది. ఆంధ్ర, రాయలసీమలో జిల్లాకో మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా ఆస్పత్రులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో కూడా ఏపీ టాపే. అపోలో వంటి ప్రముఖ ఆస్పత్రులు ప్రధాన నగరాల్లో ఉన్నాయి. కాకినాడ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అపోలో, హోప్ వంటి పేరెన్నిక గన్న సంస్థల ఆస్పత్రులున్నాయి. విజయవాడలో కామినేని, సన్రైజ్, విజయా, మణిపాల్, కేర్, రెయిన్బో, ఎన్టీఆర్ వర్సిటీ హస్పిటల్ వంటి వందకు పైగా ప్రముఖ ఆస్పత్రులున్నాయి. డెంటల్ నుంచి క్యాన్సర్ దాక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులున్నాయి. ఇక కోస్తా తీరం పొడవునా డజన్ల కొద్దీ మిషనరీ హాస్పిటళ్లు ప్రత్యేకం. వాస్తవం ఇది కాగా ఏదో అక్కడ వైద్యం లేనట్టు హైదరాబాద్ లేకపోతే వైద్యమే అందక ప్రజలంతా శవాల కుప్పల్లా మారుతారన్నట్టు కొందరు అతి తెలివి మేధావులు భ్రమపెడుతున్నారు.
కొన్ని ప్రసార మాధ్యమాలకూ, వ్యవస్థలకూ తెలంగాణను నిందించడం, వేలెత్తి చూపడం తప్ప మరొకటి తెలియదు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేను ప్రశంసించడానికి వాటికి మనసు రాదు. కానీ విమర్శలు బురద చల్లటంలోనే వాటి శ్రద్ధ అంతా. ఉదయం లాక్డౌన్ పెట్టాలని, సాయంత్రం అంత అర్జంటుగా పెడతారా అంటూ వ్యాఖ్యలు చేస్తే ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలుగుతుంది!
రాజ్యాంగము- మానవ విలువల గురించి మాట్లాడుతున్నవారు ఒకసారి 1897 ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ చదువుకోవాలి. దేశంలో ఇప్పటికీ ఆ చట్టం కొనసాగుతున్నది. ఏ ప్రాంతంలోనైనా ప్రమాదకరమైన అంటువ్యాధులు వ్యాపించినప్పుడు దాన్ని నిరోధించడం కోసం ఈ చట్టం కింద రాష్ర్టాలకు అపరిమిత అధికారాలు సంక్రమిస్తాయి. ఈ చట్టంలోని ప్రొవిజన్ల మేరకే గతేడాది కరోనా ప్రబలినప్పుడు రాష్ట్ర సరిహద్దులనే కాదు, జిల్లాల సరిహద్దులనూ రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. కరోనా వ్యాధిగ్రస్థులున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి ఆ ప్రాంతాన్ని బారీకేడ్లతో కట్టడి చేసింది. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటుచేసి విదేశాల నుంచి వచ్చినవారిని 14 రోజులు నిర్బంధంగా అందులో ఉంచింది. అందుకే మొదటి వేవ్ కరోనాను రాష్ట్రం విజయవంతంగా ఎదుర్కొన్నది. ఆ నిబంధన మేరకే మనం లాక్డౌన్ ప్రకటించుకున్నాం. ఆ మేరకే సరిహద్దులను కట్టడి చేస్తున్నాం. ఇది రాజ్యాంగబద్ధం. లాక్డౌన్ సమయంలో సామాన్య చట్టాలు వర్తించవు. ఇది తెలియని మేధావులు, అతి మేధావులు వితండవాదానికి దిగుతున్నారు. వారు ముందు లాక్డౌన్ అంటే ఏమిటో ఎందుకు విధించారో ఏ చట్టం ఆధారంగా దీన్ని పెట్టారో తెలుసుకోవడం మంచిది. సరిహద్దుల్లో రోగుల నిలిపివేత ఈ లాక్డౌన్ లక్ష్యానికి అనుగుణమైందే. ఇష్టారాజ్యంగా రోగులు వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్లో అడ్డగోలు తిరుగుళ్లు తిరిగి అందరికీ అంటించుకుంటూ పోతే అదెంత ప్రమాదం? అందునా సెకండ్ వేవ్ వైరస్ మ్యుటేషన్ తీవ్రంగా ఉంది. ఈ సమయంలో ఇలాంటివి ఏ ప్రభుత్వమన్నా అనుమతిస్తుందా? ఇక్కడ చూడాల్సింది వ్యక్తిగత మానవతావాదమా.. సామూహిక మానవతా వాదమా? లాక్డౌన్ ఉద్దేశమే పౌరుల రాకపోకల్ని నివారించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం.
ఎన్ని దేశాలు ఇపుడు ఇండియా నుంచి రాకపోకలను నిషేధించాయి! ఎందుకు? ఏ దేశానికైనా తన పౌరులు ముఖ్యం.వాళ్ల ప్రయోజనమే ముఖ్యం. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంతటివాడు విదేశాలకు టీకాల సహాయం విషయంలో ‘అమెరికన్స్ ఫస్ట్’ అన్నాడు. ఆస్ట్రేలియా అయితే ఇండియా నుంచి వస్తే జైళ్లో పెడతామని చట్టం చేసింది. రష్యా అధ్యక్షుడు స్పుత్నిక్ టీకాను మొదట తమ దేశస్తు లందరికీ ఇచ్చాకే విదేశాలకు ఇవ్వడానికి అంగీకరించారు. మరి వీళ్లందరికీ మానవతా విలువలు లేవా?
కరోనా నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రం తనకు మాలిన ధర్మానికి పోతున్నది? తమిళనాడు తన రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు కేంద్ర ఆక్సిజన్ కేటాయించినా పంపడానికి ససేమిరా అంటున్నది. ఢిల్లీ ప్రభుత్వం పక్కరాష్ర్టాల వారు తమ రాష్ర్టానికి వస్తే 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే అంటున్నది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు వారికి ఈ హెచ్చరిక చేసింది. అనేక రాష్ర్టాలు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపితే తప్ప, తమ రాష్ర్టానికి ఇతర రాష్ర్టాల పౌరుల రాకపోకలను నిషేధించాయి.
ఎన్ని దేశాలు ఇపుడు ఇండియా నుంచి రాకపోకలను నిషేధించాయి! ఎందుకు? ఏ దేశానికైనా తన పౌరులు ముఖ్యం. వాళ్ల ప్రయోజనమే ముఖ్యం. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంతటివాడు విదేశాలకు టీకాల సహాయం విషయంలో ‘అమెరికన్స్ ఫస్ట్’ అన్నాడు. ఆస్ట్రేలియా అయితే ఇండియా నుంచి వస్తే జైళ్లో పెడతామని చట్టం చేసింది. రష్యా అధ్యక్షుడు స్పుత్నిక్ టీకాను మొదట తమ దేశస్తు లందరికీ ఇచ్చాకే విదేశాలకు ఇవ్వడానికి అంగీకరించారు. మరి వీళ్లందరికీ మానవతా విలువలు లేవా? తమ దేశస్తులను రక్షించుకోవటం ప్రథమ ప్రాధాన్యం అనడం సంకుచితమా? వెర్రిమొర్రి వాదన. ఇవాళ తెలంగాణలో ప్రతి ఇల్లు ఒక హాస్పిటల్ లాగ మారింది. ఈ పరిస్థితిలో ఇక్కడి ప్రజలను గాలికొదిలేసి పక్కవారికి పక్కలు పరిచేయాలా? వీళ్లలో ఎవరికైనా కరోనా వస్తే ఇదే మాట మీద నిలుచుంటారా?
ఏ రాష్ట్రమైనా కరోనా వంటి విపత్తులు విరుచుకుపడుతున్న వేళ ఏం చేస్తుంది. ఉన్నతాధికారులతో సమావేశాలు జరిపి రాష్ట్రంలో జనాభా ఎంత? ఉన్న ఆస్పత్రుల పరిస్థితి ఏమిటి? రోగుల సంఖ్య పెరిగితే ఏం చేయాలి? ఏయే పరికరాలు సమకూర్చాలి. మానవ వనరులను ఏ విధంగా పెంచుకోవాలి? ఎన్ని క్వారంటైన్ కేంద్రాలు తెరవాలి? ఎన్ని ఐసోలేషన్ సెంటర్లు తెరవాలి? ఏయే ఔషధాలు ఏ మేరకు కొనుగోలు చేయాలి? మందులేమిటి? టీకా లేమిటి? ఇందుకు బడ్జెట్ను ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? అనే విషయం చర్చించి దానికి అనుగుణంగా అన్నీ సమకూర్చుకుంటుంది. అదే సమయంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఏం చేయాలి? ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ముందుకుపోతుంది. మరి ప్రభుత్వ ప్రణాళికలో ఊహించనివిధంగా ఇతర రాష్ర్టాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో విరుచుకుపడితే ప్రణాళిక ఏమవుతుంది? బడ్జెట్ ఏం కావాలి? ఒక్క హైదరాబాద్ ఆస్పత్రుల్లోనే సగానికి పైగా రోగులు ఇతర ప్రాంతాల వారు ఆక్రమిస్తే తెలంగాణ వారిని ఎక్కడ పెట్టాలి?
అవును పొరుగు రాష్ర్టాల నుంచి రోగులను అనుమతిద్దాం. మరి తెలంగాణ రోగులు ఎక్కడికి పోవాలి? వారికి చికిత్స ఎవరు అందించాలి? ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే చెస్ట్ ఆస్పత్రి, నిమ్స్ కిమ్స్, గాంధీ ఇలా ప్రధాన ఆస్పత్రుల్లో బెడ్లు నిండి ఉన్నాయి. తెలంగాణ రోగులకే బెడ్లు ఎక్కడ సమకూర్చాలనే విషయంలో అధికారులు నానా యాతన పడుతున్నారు. ఈ సమయంలో పొరుగు రాష్ర్టాల నుంచి ఉప్పెనలాగ విరుచుకుపడితే తెలంగాణ వారి పరిస్థితి ఏమిటి? జిల్లాల్లో పరిస్థితి విషమిస్తే హైదరాబాద్కు తేవాలి. ఇక్కడ బెడ్ లేకపోతే తెలంగాణ రోగిని ఎవరు కాపాడాలి?
ఇక్కడ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రోగుల పాజిటివ్ కేసుల నమోదు వారి వారి రాష్ర్టాల్లో జరుగుతున్నది. ఆయా రాష్ర్టాల్లో కరోనా కేసుల నమోదు లెక్కలను రాష్ట్రం కేంద్రానికి సమర్పిస్తే దానికి అనుగుణంగా ఆక్సిజన్, టీకాలు ఇతర మందులను కేంద్రం కేటాయిస్తున్నది. అంటే ఏ రాష్ట్రంలోనైనా నమోదైన కేసుల మేరకే ఆక్సిజన్, టీకాలు ఇతర ఔషధాల కేటాయింపు ఉంటుంది. మన రాష్ట్రంలో తెలంగాణలో నివసిస్తున్న ప్రజల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి.
ఆ మేరకే కేంద్రం కేటాయింపులు వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి పాజిటివ్ కేసులేవీ మన రాష్ట్రంలో నమోదైనవి కావు. వీళ్ల కోటా ఆక్సిజన్, మందులు మనకు రావు. కానీ వైద్యం మాత్రం మన నెత్తిన పడుతున్నది. ఇలా ఇక్కడి లెక్కలోకి రాని రోగులు వచ్చి ఆస్పత్రిలో చేరితే వారికి ఎవరి కోటా నుంచి ఆక్సిజన్ ఇవ్వాలి. ఎవరి కోటా కత్తిరించి మందులు ఇవ్వాలి? మరోవైపు ఇక్కడ వైద్యం పొందుతూ ఇతర రాష్ర్టాల వారు మరణిస్తే ఆ లెక్క మాత్రం తెలంగాణ కోటాలో పడుతున్నది. మరణాలకు కేంద్రం పైసా ఇవ్వదు.
దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ మెడికల్ హబ్గా ఉన్నందున వివిధ రాష్ర్టాల కరోనా రోగుల తాకిడి ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సహాయంలో కోటా పెంచాలని తెలంగాణ ఎంత కోరినా కేంద్రం కిమ్మనదు. ఇతర రాష్ర్టాల వారి తాకిడి ఒక్క హైదరాబాద్కే పరిమితం కాలేదు. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాలకు మహరాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి.. కరీంనగర్ జిల్లాకు ఛత్తీస్ గఢ్ నుంచి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు కర్ణాటక, రాయలసీమ నుంచి రోగుల తాకిడి ఉధృతంగా ఉంది. ఇక హైదరాబాద్కు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషాల నుంచి వస్తున్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఉన్న రోగుల్లో దాదాపు సగం ఇతర రాష్ర్టాల వారే ఉంటున్నారు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వ వైద్యులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సెలవుల్లేకుండా పనిచేస్తున్నారు. గతేడాది కూడా వారు కొన్ని నెలల పాటు తీవ్రంగా కష్టపడ్డారు. ఇప్పుడు మళ్లీ అంతకుమించి కష్టపడాల్సి వస్తున్నది. ఐదువందల మందికి సేవ చేయాల్సిన చోట వెయ్యి మందికి చేస్తున్నారు. రోజుంతా ఊపిరి సలుపని విధి నిర్వహణ జరుపుతున్నారు. ఈ సేవ ఇలా ఎడతెగక కొనసాగి వాళ్లు చేతులెత్తేస్తే పరిస్థితి ఏమిటి? ఇతర రాష్ర్టాల వారు మరో నగరం వెతుక్కొని వెళ్లిపోతారు. మన తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏమిటి? కొన్ని ప్రసార మాధ్యమాలకూ, వ్యవస్థలకూ తెలంగాణను నిందించడం, వేలెత్తి చూపడం తప్ప మరొకటి తెలియదు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేను ప్రశంసించడానికి వాటికి మనసు రాదు. విమర్శలు బురద చల్లటంలోనే వాటి శ్రద్ధ అంతా. ఉదయం లాక్డౌన్ పెట్టాలని, సాయంత్రం అంత అర్జంటుగా పెడతారా అంటూ వ్యాఖ్యలు చేస్తే ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలుగుతుంది!
తెలంగాణ ప్రభుత్వానికి తన పర అనే తేడా ఏమీ లేదు. హైదరాబాద్ విశ్వనగరంగా ఉంది. ఇది మినీ ఇండియా. ఇక్కడ ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిషాతో పాటు అన్ని రాష్ర్టాల ప్రజలు జీవిస్తున్నారు. ప్రభుత్వం అందరినీ ఒకే దృష్టితో చూస్తున్నది. తెలంగాణలో నివసించేవారంతా తెలంగాణ ప్రజలే! వారికి ప్రభుత్వం అన్నిరకాల వైద్యం అందిస్తున్నది. అందిస్తుంది. అందులో భేద భావమేమీ లేదు.
-సవాల్ రెడ్డి