ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ నేడు ప్రజాస్వామ్యం కోసం దేశంలో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. అసలు దేశంలో రాజ్యాంగం అమలులో ఉందా లేదా తెలియని పరిస్థితి ఏర్పడింది. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను కీలుబొమ్మలుగా మార్చింది. భారత దేశం రాష్ర్టాల సమాఖ్య అనే విషయాన్ని మరిచిపోయి కేంద్రం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులు, కార్మికులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా పతనమైంది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడి కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు కేంద్ర ప్రభుత్వాలు రూ.50 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంతకు 178 రెట్ల ఎక్కువ అప్పు చేసింది. ఇది జీడీపీలో 60 శాతం. మోడీ అధికారంలోకి రాక ముందు సెస్సులు 6 శాతం వసూలు చేసేవారు. మోదీ అసమర్థ పాలనలో సెస్సులు 20 శాతానికి చేరాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను, విమానాశ్రయాలను మోదీ సర్కారు తెగనమ్మి సొమ్ము చేసుకుంటున్నది. కానీ ఆ ఆదాయంలో ఒక్క పైసా కూడా సామాన్యుడికి అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల వల్ల మోదీకి సన్నిహితులైన పారిశ్రామికవేత్తల సంపద వేల రేట్లు పెరిగింది. వారు ఈ దేశాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక సూత్రంపై నడిచే ఈ దేశంలో మతం ఆధారంగా ప్రజల్లో చీలిక తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితుల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని మైనార్టీలు భయపడుతున్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ర్టాలను సంప్రదించకుండా నిర్ణయాలను తీసుకుంటున్నది. రాష్ర్టాలకు అందాల్సిన 42 శాతం పన్నుల వాటాను కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. జీఎస్టీ ఆదాయ పంపిణీలోనూ అసమానతలు చోటు చేసుకుంటున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేస్తున్న కేంద్రం రాష్ర్టాలకు మాత్రం ఎఫ్ఆర్బీఎం పరిమితి విధించి అవి అప్పులు చేయకుండా అడ్డుకుంటున్నది. దీని వల్ల అనేక రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది.
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీల నాయకులను వేధించడానికి ఉపయోగిస్తున్నది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాలు, ఇళ్లపై ఆయా సంస్థలతో దాడులు చేయిస్తున్నది. జమ్మూ కశ్మీర్లో శాంతిని పునరుద్ధరిస్తామనే నెపంతో 371 అధికరణను రద్దు చేసి అక్కడ మరింత అశాంతిని రగిల్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలో ఉన్న రాష్ర్టాలతో ఒక విధంగా, అధికారంలో లేని రాష్ర్టాలతో ఒక విధంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే కేంద్రం ఇవ్వలేదు. కానీ తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఆ హోదా ఇచ్చింది. విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ దాడులు చేయడం లేదు. కానీ మంచి పాలన అందిస్తున్న ఢిల్లీ ప్రభుత్వంలోని కొందరు మంత్రులపై లిక్కర్ కుంభకోణాన్ని మోపి దాడులు చేస్తున్నది.
పెద్ద నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీజేపీ నాయకుల విద్వేష ప్రసంగాల వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తున్నది. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం కనిపిస్తున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక, రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కించి అభ్యుదయ పథంలో నడిపించే ప్రగతి శీల నాయకుడి కోసం దేశం ఎదురు చూస్తున్నది.
అందుకోసం దేశం తెలంగాణ వైపు చూస్తున్నది. తెలంగాణ తరహాలో దేశం అభివృద్ధి చెందాలని దేశ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ దేశాన్ని సైతం అభివృద్ధి మార్గంలో నడిపించగలరని విశ్వసిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి లాంటి ఎత్తిపోతల పథకాలతో కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కళ్యాణ లక్ష్మి, హరిత హరం, సబ్బండ వర్గాలకు పెన్షన్లు వంటి పథకాలు తెలంగాణకే ప్రత్యేకం. ఈ విధంగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్నది. తెలంగాణలాగే దేశం కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. దేశ సమైక్యత, అభివృద్ధి కోసం జాతీయ పార్టీ స్థాపించనున్నారు. కేసీఆర్ పాలన దేశమంతటా ఉండాలని కోరుకుంటున్న భారత ప్రజానీకం ఆయనకు ఈ సందర్భంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపగలరు.
(వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్, ఓయూ)
తెలంగాణ తరహాలో దేశం అభివృద్ధి చెందాలని దేశ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్నకేసీఆర్ దేశాన్ని సైతం అభివృద్ధి మార్గంలో నడిపించగలరని విశ్వసిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లాంటి ఎత్తిపోతల పథకాలతో కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్నది. తెలంగాణలాగే దేశం కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు.
తుంగబాలు: 9985930246