‘బడ్జెట్’ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు, ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయవ్యయాలను తెలియజేసి ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నిజం చేసే నిర్మాణాత్మక ప్రణాళిక. ఇందుకు పూర్తి విరుద్ధంగా 2022-23 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉన్నది. రూ.39.45 లక్షల కోట్ల వ్యయంతో వచ్చే 25 ఏండ్ల అమృత కాలానికి పునాది వేస్తామని గొప్పలు చెప్పిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో దేశ ప్రజల అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం.
కొవిడ్ ప్రారంభమైన తర్వాత దేశంలో కొత్తగా కోటి మంది ఉపాధి కోల్పోయిన తరుణంలో ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్లో రూ.25 వేల కోట్ల (25 శాతం) నిధులు తగ్గించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారెంటీగా కల్పించాలంటే దాదాపు రూ.2.4 లక్షల కోట్లు అవసరమవుతాయి. కానీ బడ్జెట్లో ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించింది.
దేశంలో 20 కోట్ల మంది భారతీయులు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే ఆ బడ్జెట్ను రూ.37 వేల కోట్ల నుంచి రూ.27 వేల కోట్ల వరకు తగ్గించారు. కరోనా విజృంభిస్తున్న కాలంలో ఉపాధి కోల్పోయి, ఆదాయాలు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ఫలితంగా దేశంలో కొత్తగా 4.6 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఇలాంటి సమస్యలకు బడ్జెట్ ద్వారా పరిష్కారం చూపించాల్సిన కేంద్రం ఆహార సబ్సిడీలను తగ్గించింది. 2022-23 బడ్జెట్లో రూ.రెండు లక్షల 6 వేల కోట్లకు తగ్గించారు. అంటే సుమారు రూ.80 వేల కోట్లను ఆహార సబ్సిడీపై తగ్గించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బడ్జెట్లో పెట్రోలియం సబ్సిడీలు తగ్గించారు. 2020- 21 బడ్జెట్ నిజ వ్యయంలో పెట్రోలియం సబ్సిడీలు రూ.38 వేల కోట్లు ఉండగా, 2022-23 బడ్జెట్లో వాటిని రూ.5,800 కోట్లకు తగ్గించారు. 139 కోట్ల భారతీయులకు ఇస్తున్న పెట్రోలియం సబ్సిడీలను తగ్గించటం ప్రజలపై భారాన్ని మోపడమే.
కేంద్రం 2021-22 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 4.26 శాతం నిధులు కేటాయించగా, ఈ బడ్జెట్లో 3.84 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. వరి, గోధుమ, ధాన్యం సేకరణకు గత బడ్జెట్లో రూ.2.48 లక్షల కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.2.37 లక్షల కోట్లకు తగ్గించారు. అలాగే మద్దతు ధర పొందే లబ్ధిదారుల సంఖ్య గతేడాది 1.97 కోట్లు ఉంటే నేడు అది 1.63 కోట్లకు తగ్గిపోయింది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఎరువుల సబ్సిడీలు 25 శాతం తగ్గించారు.
తెలంగాణకు నిధుల కేటాయింపు, విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపుతున్నారు. కేంద్ర పన్నులలో రాష్ర్టాల వాటా ఇవ్వటంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. జీఎస్టీ పరిహారం, కేంద్ర పన్నుల్లో వాటా, విపత్తుల నిర్వహణ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు, స్థానిక సంస్థలకు నిధులు, రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాలకు వచ్చేవే. రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై బడ్జెట్లో ప్రస్తావించకుండా తెలంగాణ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేకపోవటం, ట్రైబల్ యూనివర్సిటీకి తక్కువ నిధులు కేటాయింపు, ఐటీఐఆర్ ప్రస్తావన, రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు లేకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేక సాయం, ప్రత్యేక గ్రాంట్లు లేవు. పురపాలక ప్రాజెక్టుల కోసం రూ.1960 కోట్లు అడిగినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో తెలంగాణకు ఇవ్వలేదు. రూ.730 కోట్ల స్పెషల్ గ్రాంట్తో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లను కూడా ప్రస్తావించకపోవడం అన్యాయం. ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని దీన్ని బట్టే అర్థమవుతున్నది.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి)
– మెట్టు శ్రీనివాస్
73969 33799