ప్రజా జీవితంలో కొనసాగే వ్యక్తులు, ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపించే చట్టాలకు ప్రాణం పోసే శాసన నిర్మాతలు.వారు తీసుకునే నిర్ణయాలు వ్యవస్థకు మేలు చేసే విధంగా ప్రజలపై అనుకూల మార్పులు కనబరచే విధంగా, అంతిమంగా ప్రజాస్వామ్య సూత్రాలకు ఊపిరిపోసే విధంగా ఉండాలి. కానీ, వ్యక్తిగత స్వార్థంతో ఉండరాదని, నాటి రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేస్తూ చేసిన నిర్వచనమిది. దీనికి పూర్తి విరుద్ధంగా తన వ్యక్తిగత స్వార్థం కోసం, తన సంపాదన వృద్ధికోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నారు.
కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటూ అబద్ధా లు ఆడుతున్నాడు. వేల కోట్ల కాంట్రాక్టులు సొంతం చేసుకొని మునుగోడు ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేయడమే అసలైన అభివృద్ధి అనుకున్నాడో ఏమో గాని, బీజేపీలో చేరి అభివృద్ధికి కొత్త అర్థాన్నిచ్చాడు. కేసీఆర్ నాయకత్వంలో వినూత్నమైన పథకాలతో తెలంగాణ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం అభివృద్ధి కోసమే బీజేపీలో చేరానంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది.
పాలనలో అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రం పేరు మార్చి అమలు చేయడమే దీనికి నిదర్శనం. అలా రైతుబంధు ఆదర్శంగా కిసాన్ సమ్మాన్ నిధి, మిషన్ భగీరథను కేంద్ర జలశక్తి మిషన్గా అమలు చేస్తున్నది. ఇలా తెలంగాణ అభివృద్ధి ఆచరణలో కనిపిస్తుంటే కేంద్రం అభివృద్ధి మాత్రం ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను తెగనమ్మడంలో కనిపిస్తున్నది.
ఉజ్వల గ్యాస్ యోజన పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్ అని ఊదరగొట్టిన కేంద్రప్రభుత్వం గ్యాస్ బండ ధరను పెంచి సామాన్యులకు గుదిబండలా మార్చింది. తాజాగా ఒక కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ బండలు చాలవా అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలతో వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్నది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నది.
సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ రైతాంగం, ఇప్పుడిప్పుడే వృద్ధిని సాధిస్తుంటే ఓర్వలేని కేంద్రం ఎరువుల ధరలను అమాంతం పెంచడమే గాక, యాసంగి పంట కాలానికి సంబంధించిన కేటాయింపుల్లో 4.29 లక్షల టన్నుల భారీకోత విధించింది, నూతన విద్యుత్ చట్టాల పేరుతో బావులకు, బోర్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకునే కుట్రలు పన్నుతున్నది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడుతుంటే రాజగోపాల్ రెడ్డి మీటర్ల ఏర్పాటును సమర్ధించడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో రైతన్నను రాజును చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి తరుణంలో కేంద్రం వారి ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది.
రైళ్లు, రోడ్లు, ఓడరేవులు, ఎయిర్ పోర్టు లు, గోడౌన్లు, స్టేడియాలు, జాతీయ రహదారుల వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కేంద్రం ప్రైవేటీకరిస్తున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా కేంద్రం ఆ హామీని విస్మరించి యువత ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో 1,32,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 80 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ముఖంలో సంతోషం‘ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.
నేతన్నలకు కేంద్రం 5% జీఎస్టీ విధించి ఇబ్బందులకు గురి చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వారికి రాయితీలను ప్రోత్సాహకాలను ఇస్తూ అండగా నిలుస్తున్నది. కల్లుగీత కార్మికులకు సైతం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయడమే కాకుండా 50 ఏండ్లు పైబడిన వారికి పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నది. గొల్ల కురుమలకు ఒక యూనిట్కి రూ. 1.75 లక్షలతో గొర్రెలు పంపిణీ చేస్తున్నది.నాయీబ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడమే కాక అధునాతన సెలూన్లు, ధోబీఘాట్ల నిర్మాణానికి ఆర్థిక చేయూతనందిస్తున్నది. వెనుకబాటు తనానికి గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దేశంలోనే తొలిసారిగా ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలతో దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చి విడుతల వారీగా పంపిణీ చేస్తున్నది. ఈవిధంగా అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్న టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారు.
అనేక విషయాల్లో వైఫల్యం చెందిన బీజేపీ పార్టీలో చేరిన రాజగోపాల్రెడ్డిని ఓడించి ప్రజా ప్రభుత్వమైన టీఆర్ఎస్ను గెలిపించి ప్రజా సంక్షేమానికి అండగా నిలవాల్సిన అవసరం మునుగోడు ప్రజలకు ఉన్నది.
(వ్యాసకర్త : టీఆర్ఎస్వీ నాయకుడు,కాకతీయ విశ్వవిద్యాలయం)
ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు, చేతులు వంకర పోయిన నల్గొండ జిల్లా వాసులను ఆదుకోవడానికి మిషన్ భగీరథతో మంచినీటిని అందించి ఫ్లోరోసిన్ రక్కసిని తరిమిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. బీడువడ్డ భూములకు సాగు నీరందించడానికి లక్ష్మణపల్లె, శివన్నగూడెం, కిష్టరాయినిపల్లె ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. నియోజకవర్గంలోని 79,000 మంది రైతులకు రైతుబంధు సహాయాన్ని అందించి సాగుకు ఊతమిచ్చింది.
కొనుకటి ప్రశాంత్ 8008492700