దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగురవేయాలనే అత్యుత్సాహంతో వారు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ప్రజాప్రతినిధులకు డబ్బును ఎరగా చూపి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ధన బలానికి తలొగ్గని నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరిపిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. బీజేపీ విధాన నిర్ణయాలు దేశ ప్రజలు చీదరించుకునే స్థాయికి చేరాయంటే ఆ పార్టీ ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ నీచ రాజకీయాలను నిలువరించాలంటే ప్రజాపక్షాన జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఏనాయకుడైనా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ కోణంలో ఆలోచించినపుడు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అపారమైన అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ దేశ రాజకీయాలకు సరితూగే వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఆయన జాతీయ పార్టీ ప్రకటన పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేసీఆర్ను అభిమానించే పలు పార్టీల ప్రతినిధులు తమ సానుకూల వైఖరిని తెలియజేసి మద్దతు ప్రకటిస్తున్నారు.
తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కేసీఆర్ను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాదు, దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు సైతం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. దేశంలో బీజేపీని నిలువరించే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నదని చెప్పాలి. ఈడీలకు, బేడీలకు భయపడకుం డా బీజేపీ అప్రజాస్వామ్య పరిపాలనను ఎండగట్టేందుకు, బీజేపీ మోసపూరిత విధానాలను కేసీఆర్ ప్రజలకు తెలియజేస్తున్నారు.
కేసీఆర్ కేవలం బీజేపీని విమర్శించడమే కాకుండా జాతీయస్థాయిలో ప్రజా మద్దతును కూడగడుతున్నారు. ఇందులో దేశానికి అన్నం పెట్టే రైతన్నల సమస్యలను తెరకెక్కించే ప్రయత్నం చేయడం ప్రధానమైనది. ప్రధాని మోదీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ‘దశరథ్ లక్ష్మణ్ కేదారి’ అనే రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక ఆత్యహత్యకు పాల్పడ్డారు.
‘రైతులు బిచ్చగాళ్లు కాదని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని’ ప్రధాని మోదీకి తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. 2021లో దేశవ్యాప్తంగా 10,881 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ నివేదికలో వెల్లడైంది. కేంద్రం గతంలో మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలను అమలుచేసి, రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ కేంద్రం ఆ చట్టాలను రద్దుచేసే వరకు జరిగిన రైతు పోరాటంలో 700 మంది రైతులు మరణించడం విషాదం. వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడ్డాయి.
మృతి చెందిన ప్రతి రైతు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున మొత్తం రూ.23 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. దేశ రక్షణలో భాగంగా అమరులైన బీహార్కు చెందిన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక చేయూతనందించింది. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లోని స్క్రాప్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఇలాంటి కార్యక్రమాల్లో బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా కేసీఆర్లో మానవీయ కోణం ఎలాంటిదో యావత్ దేశానికి తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ రైతాంగ సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకొని పోరాటం చేశారు. ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ ప్రాంతానికి నీటిరంగంలో జరిగిన అన్యాయంపై గొంతెత్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునే ‘కాళేశ్వరం’ అతి తక్కువకాలంలో పూర్తయింది. ఉమ్మడి ఏపీ పాలనలో పంట విత్తనాలు, ఎరువుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడేవారు. కానీ ఇపుడు రైతులకు ఆ ఇబ్బందులే లేవు. రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరికే ప్రభుత్వం నేరుగా వెళ్లి కొనుగోలు చేస్తున్నది. రైతుల కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది.
రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. మార్కెట్ యార్డులను బలోపేతం చేసింది. పెట్టుబడి కోసం రైతులకు ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. అనివార్య కారణాల వల్ల రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నది. రైతు సంక్షేమం కోసం విధానపరమైన నిర్ణయాలను నేడు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసమే దేశ రాజకీయాల్లోనూ రాణించడానికి కేసీఆర్ రైతు ఎజెండానే ప్రధానాంశంగా తీసుకునే అవకాశం ఉన్నది. ఆ కోణంలోనే కేసీఆర్ ఇటీవల దేశవ్యాప్తంగా రైతులకు ప్రాతినిధ్యం వహించే సంఘాలతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలపై దేశ రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన రైతు సంక్షేమం దేశవ్యాప్తంగా విస్తరించాలనే చర్చ తెరమీదకు వచ్చింది. అందుకే దేశంలో పేదల అభివృద్ధి, రైతుల సంక్షేమమే ఎజెండాగా తీసుకొని కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రానున్నారు. అనతికాలంలోనే దేశ ప్రజలు తెలంగాణ నుంచి ఒక గొప్ప జాతీయ నాయకుడిని చూడబోతున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త: వర్ధన్నపేట శాసనసభ్యులు)
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ రైతాంగ సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకొని పోరాటం చేశారు. ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ ప్రాంతానికి నీటిరంగంలో జరిగిన అన్యాయంపై గొంతెత్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునే ‘కాళేశ్వరం’ అతి తక్కువకాలంలో పూర్తయింది.
ఆరూరి రమేష్