శారీరకంగా, మానసికంగా మనిషి జీవితం బాల్యం, యవ్వనం, ప్రౌఢదశ, వృద్ధాప్యంగా పరిణమిస్తుంది. కొంచెం అటుఇటుగా ఈ దశల క్రమాన్ని అనుసరించే ఆర్షధర్మం జీవితాన్ని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ నిర్వహణగా రూపొందించింది. జీవనదశలు నిర్దుష్టమైన కాల విభజనలు కావు. అవి క్రమంగా ఒక దశ తర్వాతి దశలోకి పరిణమిల్లే వికాసం. బ్రహ్మచర్యం పునాది దశ, గృహస్థాశ్రమం నిర్మాణ దశ, వానప్రస్థం విజ్ఞానదశ, సన్యాసం విమోచనదశ.
బ్రహ్మచర్య దశలో శారీరక, మానసిక, సామాజిక వికాసాలకు సంబంధించిన విజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని, విలువల అధ్యయనం, యోగం, సేవల ద్వారా సంపాదించి తర్వాతి జీవితానికి కావలసిన వ్యక్తిత్వ సంపదను బలమైన పునాదిగా వేసుకునే దశ. గృహస్థాశ్రమం వృత్తి, ధర్మనిష్ఠ, తన కుటుంబ, సామాజిక బాధ్యతల నిర్వహణ ద్వారా సంఘ నిర్మాణంలో సమర్థతను వెలయించే దశ. తాను సంపాదించిన విద్యతో, పాటించిన ధర్మ బలంతో, లోకానుభవంతో జీవితాన్ని మూల్యాంకనం చేసేది ప్రౌఢదశ. అదే వానప్రస్థం. జీవితం మొదటి నలభై ఏండ్లు పాఠ్యగ్రంథం. తర్వాతి జీవనం దానిపై వ్యాఖ్యానం అని చెప్తారు. జీవన పరిణామాలతో కలిగే మానసిక పరిణతి వల్ల అనిత్య భౌతిక ఆకర్షణలు తగ్గి, నిత్యానందం వైపు మనసు మొగ్గ తొడిగే దశ వానప్రస్థం. సన్యాసోన్ముఖమైన వృద్ధాప్య దశలో సాధ్యమైనంత వరకు బంధాలను, బాధ్యతలను విదిలించుకొని, వదిలించుకొని గడిచిన మూడు దశల పరిపక్వతగా నిత్యమైన, అమృతమైన పరమాత్మ అనుభవం వైపు ఏకాగ్రం కావలసి ఉంటుంది.
జీవితం ఒక అఖండ ప్రయాణం. ఈ ప్రస్థానంలో మార్పునకు అనుగుణంగా పరిణతి చెందవలసి ఉంటుంది. అధ్యయనం ద్వారా సఫల జీవితానికి పునాదిని వేసుకోవడమే బ్రహ్మచర్యంలో చేయవలసింది. గృహస్థాశ్రమంలో మార్పు సహజమే కాదు, అనివార్యం, అభిలషణీయం, ఆరాధ్యం అన్న స్పృహ పెరగాలి. ఎందుకంటే, సుఖానికి, దుఃఖానికి మార్పే కారణం. ఏ సుఖమైనా మార్పులేకుండా అలాగే కొనసాగితే చివరికి దుఃఖదాయినిగా మారుతుంది. జీవితంలో నిరంతరం మార్పు కోసం ప్రయత్నిస్తుండాలి. ఈ మార్పుల వల్ల కలిగే సుఖదుఃఖాలకు అతిగా పొంగిపోవడం, కుంగిపోవడం సరికాదన్న అవగాహన గృహస్థాశ్రమ దశలో తెలుసుకోవాలి. వివేచనాత్మక వికాసానికి, విస్తృతికి మూడోదైన వానప్రస్థం పరమాస్పదమైనది. మారని స్థిర నేపథ్యంలోనే మార్పును గమనించగలుగుతాం. కదలని వెండితెరపై చిత్రం కదులుతుంటుంది. కదలని రహదారిపై వాహనాలు కదులుతుంటాయి. అలాగే అనిత్యమై అనుక్షణం మారుతున్న ప్రపంచానికి ఆధారం మారని దాని చైతన్య సూత్రమే. ఈ ప్రపంచంలో కష్టసుఖాలు అనిత్యమైనవేనని, వాటికి ఆధారమైన, అవ్యయమైన, అచ్యుతమైన, సకల శక్తిమయమైన సదాశివచైతన్యమే నిత్యమని, దాన్ని తెలుసుకొని తన చైతన్యంలో విప్పార్చుకోవడమే వానప్రస్థ విశేషం.
ఏ పేరుతో పిలిచినా ఆ సదాశివ చైతన్యాన్ని ఆత్మ చైతన్యంలో ఆవిష్కరించుకోవడమే వృద్ధాప్య దశ పరమావధి. దైనందిన కాలమానంలో ఎంత ఎక్కువ సమయం, ఎంత ఎక్కువ అనుభవం ద్వారా ఆ సదాశివం అనుభూతిలోకి వస్తే అంతగా ఆధ్యాత్మికత జాగృతమై మోక్షపథంలో పురోగమించడం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికత ఎంత ఎక్కువ జాగృతమైతే అంత ఎక్కువగా సున్నితత్వం పెరిగి ప్రకృతి లీలలపై, జీవుల గొప్పదనంపై, ఆత్మీయత వికసించి ఆనందంతో హృదయం చెమ్మగిల్లుతుంది. వాటికి ఏ ఆపదవచ్చినా మనసు నొచ్చుకుంటుంది. వాటితో ఎప్పుడూ ప్రేమగా వ్యవహరిస్తుంది. ఇదే ఆధ్యాత్మికతకు లౌకికమైన కొలత. అందుకే మానవ జీవన సార్థకతకు ఆధారం నిత్యానిత్య వస్తువివేక పరిణతి అని పెద్దలు చెప్పారు. ఆ పరిణతి వల్లే తనలోని ఉపాధి గత చైతన్యం నిరుపాధికమైన విశ్వచైతన్యంలో సంలీనమవుతుంది. ఈ శ్రేయస్కర మానవ సంస్కార పురోగతినే ఆర్షభారతం నాలుగు ఆశ్రమాలుగా జగతికిచ్చిన ఒక మహోన్నతమైన వరం.
– యముగంటి ప్రభాకర్
94401 52258