ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును తీసుకు వచ్చింది. విద్యుత్తు రంగంలో తమ గుత్తాధిపత్యానికి ఈ బిల్లు ద్వారా బాటలు పరవాలని కేంద్రం సంకల్పించింది.ఈ బిల్లు చట్టమై అమల్లోకి వస్తే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీలు పెరిగి సామాన్యుల నడ్డి విరగటం ఖాయం.
విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేటు సంస్థలను తీసుకురావడానికి ఉద్దేశించినదే ఈ విద్యుత్ (సవరణ) బిల్లు-2022. విద్యుత్ రంగంలో పోటీ పెంచడం, నియంత్రణ సంస్థలను మరింత బలోపేతం చేయడం, డబ్బులు చెల్లింపు వ్యవస్థను గాడిలో పెట్టడం వంటి కీలకాంశాలు ఇందులో ఉన్నాయి. ప్రతిరోజూ విద్యుత్ కోతలు, సరఫరాలో అంతరాయం ఎదురవుతూ ఉంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మార్చుకోవచ్చని ఈ బిల్లులో పేర్కొన్నారు.
డి-లెసెన్స్: ఇకపై విద్యుత్తు పంపిణీ చేయాలంటే లెసెన్స్ అవసరం లేదని బిల్లులో పేర్కొన్నారు. ఫ్రాంచైజీ: పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ ప్రాంత పరిధిలో ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు. అంటే కేఎఫ్సీ వంటి రెస్టారెంట్ల మాదిరిగా ఎవరైనా పంపిణీ సంస్థల నుంచి ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు.
టారిఫ్ సీలింగ్: సంస్థలు ఏకఛత్రాధిపత్యానికి పాల్పడకుండా మినిమం టారీఫ్ను నిర్ణయిస్తారు. అలాగే వినియోగదారులకు నష్టం కలగకుండా గరిష్ఠ టారీఫ్ మీద సీలింగ్ పెడతారు.
క్రాస్ సబ్సిడీ: ఒక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలు సేవలు అందిస్తూ ఉంటే యూనివర్సల్ సప్లయి ఆబ్లిగేషన్ (యుఎస్ఓ) ఫండ్ను ఏర్పాటు చేస్తారు. విద్యుత్
నిలుపుదల: ఒప్పందాల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు డబ్బులు చెల్లించకపోతే రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఇకపై విద్యుత్ సరఫరా చేయవు. మీటరింగ్: మీటర్ లేకుండా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వరు. ఈ మీటర్ కూడా స్మార్ట్ ప్రీ పేమెంట్ మీటర్ అయి ఉండాలి.
ఈ కీలకమైన అంశాలను గమనిస్తే మనకు అనేక కుట్రలు కనిపిస్తాయి. ఈ బిల్లు చట్టమై అమల్లోకి వస్తే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తారు.‘డి-లెసెన్స్’ చేయడం వల్ల ప్రైవేటు కంపెనీలు కూడా విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి అడుగు పెడతాయి. ఇవి ప్రవేశించిన తర్వాత నిబంధనలు స్థిరంగా ఉండవు. సామాన్య, మధ్య తరగతి, పేద వినియోగదారులకు కరెంటు ఛార్జీలు భారంగా మారతాయి. పేద రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత కరెంట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలు తమ ఖర్చుతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ప్రైవేటు కంపెనీలు వాటిని వాడుకొని లాభాలు ఆర్జిస్తాయి. అవి రూపాయి కూడా పెట్టుబడి పెట్టవు. ప్రైవేటు కంపెనీలు లాభాలు ఇచ్చే వినియోగదారులకు విద్యుత్ పంపిణీ చేస్తే, వ్యవసాయ, నివాస వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పంపిణీ సంస్థలపై పడుతుంది. ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడుతుంది. కాబట్టి దాన్ని తట్టుకొనేందుకు టారిఫ్లు పెంచాల్సి వస్తుంది. తద్వారా భారం ప్రజల మీద పడుతుంది.
విద్యుత్ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశం. కానీ 1996 నుంచి విద్యుత్తు రంగానికి సంబంధించి కేంద్రం మెల్లగా రాష్ర్టాల అధికారాలను పరిమితం చేస్తున్నదని మాజీ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు, విద్యుత్తు రంగ నిపుణులు సభ్యులుగా ఉండే పీపుల్స్ కమీషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ సర్వీసెస్ విమర్శించింది. విద్యుత్ (సవరణ) బిల్లు -2022 తో రాష్ర్టాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా బలహీన పడతాయని ఆ సంస్థ తెలిపింది. రాష్ర్టాలతో తగిన రీతిలో చర్చించకుండా బిల్లు తీసుకురావటం, ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ఈ బిల్లు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
డబ్బు చెల్లించని విద్యుత్ పంపిణీ సంస్థలకు డిస్పాచ్ సెంటర్లు విద్యుత్ సరఫరా ఆపివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రైవేటు కంపెనీల రాకతో ప్రభుత్వ పంపిణీ సంస్థలు బలహీనపడితే, ఆ ప్రభావం ఉద్యోగుల మీద పడుతుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించారు. విద్యుత్ ఉమ్మడి జాబితాలోని అంశం కనుక రాష్ర్టాలతో, నిపుణులతో సమగ్ర చర్చ జరిపి, కేంద్రం నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ బిల్లును తీసుకురావడం వల్ల కేంద్రం రైతులకు, సామాన్య ప్రజలకు ద్రోహం చేసినట్లే. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఉపసంహరించుకోవలసిన అవసరం ఉందని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఇటీవల అసెంబ్లీ తీర్మానం కూడా చేసి పంపింది. విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారులు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. లేదంటే ప్రజాగ్రహాన్ని చవి చూడక తప్పదు.
విద్యుత్ ఉమ్మడి జాబితాలోని అంశం కనుక రాష్ర్టాలతో, నిపుణులతో సమగ్ర చర్చ జరిపి, కేంద్రం నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ బిల్లును తీసుకురావడం వల్ల కేంద్రం రైతులకు, సామాన్య ప్రజలకు ద్రోహం చేసినట్లే. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఉపసంహరించుకోవలసిన అవసరం ఉందని బిజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.
సి.వి.వి.ప్రసాద్: 80196 08475
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)