అమరుల ఆశయ సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్నది. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. తెలంగాణ కోసం కేటాయించుకున్న ప్రత్యేక నిధులను చూశాం. కాళేశ్వరం నీళ్లనూ చూశాం. ఇప్పుడు ఉద్యోగాలను చూస్తున్నాం. గతంలో నియమించిన 1,33,942 ఉద్యోగాలు, మొన్నటి 91,142 మెగా ఉద్యోగాల నియామక ప్రక్రియతో నాటి ఉద్యమ ఆకాంక్షలు సంపూర్ణమయ్యాయి.
తొలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ రాదనే శూన్యతలోకి నెట్టబడింది. అలాంటి స్థితి నుంచి తెలంగాణను సాధించిన కార్యదక్షుడు కేసీఆర్. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయి కేవలం ఏడేండ్ల స్వల్ప కాలంలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక బలమైన శక్తిగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారు. గత రెండు దశాబ్దాల తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే ప్రతి రాజకీయ మలుపులో కేసీఆర్ కేంద్రంగా కనిపిస్తారు.
రాష్ట్ర అవతరణ తర్వాత వ్యవసాయం, సాగు, తాగునీరు, పేదల సంక్షేమాన్ని ప్రాధాన్య అంశాలుగా కేసీఆర్ భావించారు. అందుకే మేడిగడ్డ వద్ద మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మూడేండ్లలోనే 618 మీటర్ల ఎత్తుపై ఉన్న మల్లన్నసాగర్, కొండపోచమ్మకు గోదావరిని తరలించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు. నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత ఆర్థికవేత్తలు ఆమర్థ్యసేన్, అభిజిత్ బెనర్జీలు సూచించిన విధంగా బడ్జెట్ నుంచి పేదలకు పలు పథకాల పేరుతో నేరుగా నగదును బదిలీ చేస్తున్నారు. ఈ పథకాలు బడుగు బలహీనవర్గాలు, పేదలు, మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నాయి. గతంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల తాయిలాలుగా మాత్రమే వాడుకున్నారు. తర్వాత ఆర్థిక అభివృద్ధికి వ్యతిరేకమైనవని తిరస్కరించి ఆర్థికవ్యవస్థను మార్కెట్ శక్తులకు వదిలివేసి, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేశారు. దానికి ‘సరళీకృత ఆర్థిక విధానం’ అని ముద్దుపేరు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తూ రాష్ట్ర సంపదను నగదు రూపంలో నేరుగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. దేశ సంపదను నగదు రూపంలో పంపిణీ చేస్తే ఆ డబ్బుతో వినియోగదారుని కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది అంతిమంగా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుందని నిరూపించారు.
తెలంగాణ ఉద్యమం, విద్యార్థులది విడదీయరాని సంబంధం. తొలిదశ, మలిదశ పోరాటాల్లో విద్యార్థుల పోరాటం, వారు చూపించిన సాహసం, అనన్య సామాన్యమైనవి. అందుకే కేసీఆర్ విద్యార్థుల త్యాగాలను గుర్తించి అధికారంలోకి రాగానే 1,56,254 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి, మొన్న అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కేలా ఆర్టికల్ 371 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలను చేయించారు. కేసీఆర్ ముల్కీ నిబంధనల స్ఫూర్తితో భవిష్యత్తులో తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలు, వెనుకబడిన ఆదివాసీ గూడేలు, తండాలు, వెనకబడిన ఏజెన్సీ ప్రాంతాలు అనే తారతమ్యం లేకుండా తెలంగాణ బిడ్డలందరికీ సమాన అవకాశాలు దక్కేట్లు చేశారు.
భవిష్యత్తులో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ఉండదని, జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 9, 10వ షెడ్యూల్లకు సంబంధించిన సంస్థల వివాదం పరిష్కారమైతే మరిన్ని ఉద్యోగాలను భవిష్యత్తులో ప్రభుత్వం భర్తీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించడం నిరుద్యోగ యువత పట్ల కేసీఆర్కు గల చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని కలిగి నిత్య చైతన్యవంతులైన ప్రగతిశీల కాముకులైన తెలంగాణ యువత అభివృద్ధి వ్యతిరేకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది.
– డి.రాజారాం యాదవ్, 97051 31472