దేశానికైనా, రాష్ట్రానికైనా ‘రాజధాని’ అనేది ‘అభివృద్ధి గ్రోత్ ఇంజిన్’ వంటిది. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ర్టానికి రాజధాని కనీస అవసరం. మరోపక్క ప్రతిష్టాత్మకమైన, జాతీయ ప్రాజెక్టు అయిన‘పోలవరం’ నిర్మాణం కూడా సరిగా జరగలేదు. ఆ ఐదేండ్ల సమయం చంద్రబాబుకు ప్రచారానికి కూడా సరిపోలేదనేది వాస్తవం. ఒక చేత్తో రాజధాని నిర్మాణం, మరో చేత్తో పోలవరం నిర్మాణాన్ని ప్రచారం చేయడాన్ని చూసిన ప్రజలు రెండోసారి ఆయనను విశ్వసించలేకపోయారు. అందుకే రెండవ దఫా జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలంటే పాలనానుభవం కలిగిన చంద్రబాబు నాయకత్వం అవసరమని భావించి ఆంధ్రా ప్రజలు నాడు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. బాబు తన ఐదేండ్ల పాలనలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలని దేశ విదేశాల్లో పర్యటించారు. ఆయా దేశాల్లో నిర్మాణరంగంలో పేరు మోసిన కంపెనీలను ఆంధ్రాకు ఆహ్వానించి అనేక ఒప్పందాలు చేసుకున్నారు. రాజమౌళి లాంటి సినీ డైరెక్టర్లను సైతం సంప్రదించి ‘బాహుబలి’ స్థాయిలో రాజధానికి సంబంధించిన గ్రాఫిక్స్ను తయారుచేయించారు. అయితే రాజధానికి సంబంధించి శాశ్వత భవనాలను నిర్మించకుండా తొలి ఐదేండ్లు కేవలం ఒప్పందాలకు, గ్రాఫిక్స్లకే పరిమితమయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విలువైన కాలాన్ని వృథా చేశారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ‘నవరత్నాలు’ అనే సంక్షేమ పథకాలను అమలుచేస్తామని జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మిన ప్రజలు జగన్కు అధికారాన్ని అప్పజెప్పారు. అయితే గత నాలుగేండ్లలో ఏపీ ప్రజలకు జగన్ కూడా ఒరగబెట్టిందేమీ లేదు. పాలనలో జరిగిన అంతులేని అవినీతి, నియంతృత్వంతో కూడిన అరాచక, అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారు. ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీ దొందూ దొందే అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేయడంలో పోటీపడ్డాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. రెండు పార్టీలు అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, దోపిడీలో పోటీపడి రాష్ర్టాన్ని అధోగతి పాలుచేశాయి. ఆర్థికాభివృద్ధి కుంటుపడటంతో సంపదను పెంచడం ఆ పార్టీలకు సాధ్యం కాలేదు. అప్పులు చేసి మరీ అరకొర సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వచ్చాయి. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంచుతూనే, ఇంకో చేత్తో నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజల ఆదాయానికి గండికొడుతున్నారు. పెట్టుబడుల్లేవు, పరిశ్రమలు రావడం లేదు, వ్యాపారాలు మూతబడి నిరుద్యోగం పెరిగి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ఆంధ్రా ప్రజలు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా బీజేపీ వ్యవహరించడం వల్ల తన ఉనికిని కూడా కోల్పోయింది. మరోపక్క జనసేన పార్టీ నాయకుడు పవన్కళ్యాణ్ తన లక్షలమంది అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడానికి సరిపడినంత పార్టీ నిర్మాణం సంస్థాగతంగా లోపించింది. అందుకే ఎన్నికల్లో తగిన ఫలితాలను రాబట్టలేకపోతున్నారు. ఆర్థిక వనరుల కొరత కూడా జనసేనకు పెనుసవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఏపీ ప్రజలు నేడు నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడిన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో జరుగుతున్న అప్రతిహత అభివృద్ధి, పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలను ఏపీ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని అభినందిస్తున్నారు. తెలంగాణ వలె ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభివృద్ధి కావడం లేదనే పెద్ద చర్చ ఏపీలో ఇప్పు డు జరుగుతున్నది. ఉపాధి, విద్య, వైద్య, ఆరోగ్య, వ్యాపార అవసరాల కోసం ఆంధ్రా నుంచి లక్షల మంది ప్రజలు తెలంగాణకు తరలివస్తుండటం కండ్లారా చూస్తున్నాం.
ఏపీకి రాజధాని అడ్రస్ గల్లంతయితే, తెలంగాణలో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది.ఒకరకంగా చెప్పాల్నంటే కేసీఆర్ నాయకత్వంలో నేటి తెలంగాణ కష్టాల్లో ఉన్న ఆంధ్రా ప్రజలను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ‘తెలంగాణ మాడల్’ అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తుతున్నారు.
ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాలను ఒకదానితో ఒకటి పోల్చిచూస్తే చిత్రం ఈ విధంగా ఉంటుంది. మచ్చుకు ఒక్కటి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వినాశనమైతే, తెలంగాణ వికాసం చెందుతున్నది. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ తిరోగమిస్తుంటే, తెలంగాణ పురోగమిస్తున్నది. ఏపీలో రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం అమలవుతుండటంతో రైతుల హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీకి రాజధాని అడ్రస్ గల్లంతయితే, తెలంగాణలో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. ఒకరకంగా చెప్పాల్నంటే కేసీఆర్ నాయకత్వంలో నేటి తెలంగాణ కష్టాల్లో ఉన్న ఆంధ్రా ప్రజలను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ‘తెలంగాణ మాడల్’ అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ తరహా అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అమలుచేయాలనే దృక్పథంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీఆర్ఎస్ను స్వాగతిస్తూనే ఏపీలోని టీడీపీ, వైసీపీల కుళ్లు, కుతంత్ర, కక్షపూరిత, అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. అవినీతిరహిత, సుస్థిరమైన, సమర్థవంతమైన కేసీఆర్ పాలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
మొత్తంగా ఏపీలోని రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి భయపడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఒక శాశ్వత రాజధాని ఏర్పాటవుతుంది. అంతేకాకుండా, తెలంగాణ ప్రజల వలె ఏపీ ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయనడంలో సందేహం లేదు.
రావెల కిషోర్బాబు
(వ్యాసకర్త: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు)