‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది. నిరంతర సరఫరా అవుతున్న కరెంటుకు కాంగ్రెస్ వాళ్లు అనవసరపు అంతరాయం కల్పించి నానా బీభత్సం చేస్తున్నారు. తొమ్మిదేండ్లు ఏకదాటిగా నడుస్తున్న మోటర్ల ఫ్యూజులను పీకేందుకు యత్నిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద, సీఎం కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదు. అందుకే రైతులకు అందుతున్న 24 గంటల నిరంతర విద్యుత్తు మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆగిన నీళ్లకు ‘వంక’ పెట్టుడే, పారే కాలువకు ‘ఎరుక’ పెట్టుడే. చినుకుపడితే చిందేసుడే, ఖర్మకాలి వాన పడటం ఆలస్యమైనా కదం తొక్కుడే. అసలు వాళ్లేం చేయాలనుకుంటున్నారు. ఏం చేస్తున్నారు. అర్థం చేసుకుందామంటే బుర్రకెక్కడం లేదు. వదిలేసి ఊరుకుందామంటే మనసొప్పడం లేదు. మంచి చేస్తే ఎవరూ కాదనరు, కానీ మంచి చేస్తున్న మనిషినే కంట్లె వెట్టుకొని పబ్బం గడపాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా?
ప్రజలు చాలా తెలివైనవారు. వారు గమనించడం లేదని, మన ఆటలు పుష్కలంగా సాగుతాయని భ్రమల్లో ఉండటమంటే ‘కండ్లు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి’ శాత్రం లెక్కనే. పొరలొచ్చిన కండ్ల తెరలు తీయడానికి సమయం రావాలే, కానీ ఎద్దు ఎగిరినప్పుడే.. అన్నట్టుగా అన్ని వెంటనే జరిగిపోవాలనుకుంటే దాన్ని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు.
కరెంటు.. కాంగ్రెస్.. పరస్పర విరుద్ధాలే అనొచ్చు. ఆ మాటకొస్తే కరెంటుకు వ్యతిరేక పదం కాంగ్రెస్. గతం గురించి, అందునా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అని చరిత్రలోకి వెళ్లాల్సిన పనిలేదు. మొన్నటివరకు అంటే రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పుడు సాగిన పాలన చూస్తే చాలు. అసలు కరెంటుకు వారిచ్చిన ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పాలకుల వ్యక్తిగత విషయాలు అప్రస్తుతం. వారి ‘మంద’కొడి పాలనతో బలైన రైతుల బతుకుల గురించి చర్చించాల్సిన అవసరం తప్పనిసరి.
‘పడుకునేది పగలు, పనులకు పోయేది రాత్రి’ అన్నట్టుగా అన్నదాత రాత్రంతా భార్యాపిల్లలను వదిలి వరిచేన్లతో, పొలం గట్లతో చెలిమి చేయాల్సిన దుస్థితి అప్పుడు. పాముల కోరలు పలుకరించేవి. కరెంటు తీగలు కౌగిలించుకునేవి. సరే ఏదైనా తప్పదు కదా అనుకుంటూనే గుడ్డిదీపపు టార్చీతో ఒడ్లపై నడుస్తూ పడుతూ లేస్తూ నెమ్మది నెమ్మదిగా వెళ్లి స్టార్టర్ మీట నొక్కి, హమ్మయ్యా.. అని ఒడ్డుకొచ్చి కూర్చుంటరో లేదో పది నిమిషాలకే ట్రిప్ చేసే కరెంటోళ్ల ట్రిక్తో ఉసూరుమనాల్సిందే. అర్ధరాత్రి జరుగుతున్న ‘కైలాసం’ ఆట లెక్క మళ్లీ పాము మింగినవాడిలా అక్కడెక్కడో వందురు పొలంలో ఉన్న బాయికాడికి రొప్పుతూ వెళ్లాల్సిన దుస్థితి.
బడికెళ్లి వచ్చిన పిల్లలు తిని పడుకునే ముందు కనిపించిన అయ్య, మళ్లీ నిద్రలేచేసరికి పక్కలో కనిపిస్తే ఆ పూటకు వాళ్లు మహా అదృష్టవంతులన్నట్టే. కానీ, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతేనో, కాలిపోయిన మోటర్ను వైండింగ్ చేయమని మెకానిక్ దగ్గర పెడితేనో ఆ రాత్రి ఇంట్లో కనిపించేది. కానీ, ‘బాపు బాయికాడికి పోయిండు బిడ్డా.. మోటర్ పెట్టేతందుకు., మీరు జల్దీ తయారై ఉంటే రాంగనే వచ్చి బడికి తీస్కపోతడు’ అన్న అవ్వ మాటలతో పిల్లలకు కాస్త ఊరట. తయారై ఉన్న పసిచూపులకు, పెనిమిటి వచ్చేయాళ్లకు కాస్త కమ్మగా ఏదైనా చేద్దామని ఆతృతగా పనిలో మునిగిన ఆ ఆలికి ‘కాటేసిన’ విధి పలకరించిన సందర్భాలు లెక్కకు మిక్కిలి. శవాలు పడుకున్న పొలాలు, ఆర్తనాదాలు నిద్రలేపిన గుమ్మాలెన్నో.
అయినా పంట పండించే రైతుకు టైం పెట్టడమేంటో మేధావులకే తెలియాలి. వర్షం చెప్పొస్తుందా, కాలం అనుకున్నట్టు అవుతుందా.? దేశానికి అన్నం పెట్టడానికి తన కడుపును కాల్చుకుంటూ, జీవితాన్ని పణంగా పెట్టిన రైతుకు అడగకముందే అన్నీ సమకూర్చాల్సింది పోయి చేస్తున్న పెద్దలను తప్పుపట్టడం వారికే చెల్లింది. తనకు వీలైనప్పుడు, బావిలో నీరు ఉన్నప్పుడు పెట్టుకునే వెసులుబాటుగా 24 గంటలు కరెంటు ఇస్తానంటే ‘మూడే’ చాలు, మిగతాదంతా వేస్ట్ అనేలా సెలవిచ్చిన మీ మేధోసంపత్తి అమోఘం.
‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటారు పెద్దలు. ఏదో కీడు జరిగేటప్పుడే మాటలు గట్లు దాటుతాయి. చేతలు శృతిమించుతాయి. మూడు చాలంటే ఎవరికి మూడనుందో జనం తేల్చేందుకు సిద్ధమయ్యారు. రాళ్లు, రప్పలతో కూడిన నేలల్లో నార్లు పోసి ఒక్కటి కాదు, రెండుకాదు, మూడు పంటలు తీస్తూ కరువు నేల అన్న పేరును చెరిపేసుకొని అన్నపూర్ణగా మారిందీ నేల. అటువంటి నేలమీద పండిన తిండి తింటూ ఆ మాటలు అనడానికి నోరెలా వచ్చిందో మహాశయా.
చివరగా ఒక్కమాట…‘మూడు పంటలు తీస్తాం.. మీకు మూడిందని చెప్పేందుకు సిద్ధం. రాష్ట్రంలోని ఏ ఊరి పొలిమేరను అడిగినా పొలం బాగుందనే చెప్తుంది.., పాలన మళ్లీ కావాలనే కోరుతున్నది..’ కరెంటును వదిలేసి, మరిదేన్నైనా పట్టుకోండి.. తీగ సన్నగా ఉందని వేలాడుతామంటే మాడిపోవడం మాత్రం ఖాయమని గుర్తెరగండి.
– రాజేంద్ర ప్రసాద్ చేలిక 9985835601