Girl in UP | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అయితే ఈ దారుణ ఘటనపై బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తీవ్రంగా స్పందించారు. మన పిల్లలు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో ఆలోచించాలని కోరిన ఆమె, ఈ ఉదంతం మన దెబ్బతిన్న సమాజానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న వరుస దాడులపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బల్లియా జిల్లా హల్దీ ప్రాంతంలో బాధితురాలి గ్రామానికే చెందిన 11, 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు మైనర్ బాలురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను భూమి పెడ్నేకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతోందని, మన పిల్లలకు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తున్నామో చూసి కూడా మనం ఎందుకు అప్రమత్తం కావడం లేదని, సిగ్గుపడటం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ చిన్నారితో పాటు, సదరు మైనర్ బాలురు కూడా ఈ చెడిపోయిన సమాజం సృష్టించిన బాధితులేనని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపై ఎదురవుతున్న వేధింపులపై భూమి స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఒక మహిళ గోడ పెయింటింగ్ను ఉద్దేశించి ఒక యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన వైరల్ వీడియోపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు. నేటి యువత మానసిక స్థితి ఇలాగే ఉంటే, భవిష్యత్తులో వారు మహిళలు, పిల్లలపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవలం మాటలు, సానుభూతి సరిపోవని, ఇటువంటి నేరాలను అరికట్టడానికి అత్యంత కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.