ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్(సవరణ)చట్టం-2020 బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం బహుళ రాష్ట్ర సహకార సంఘాలు, సహకార బ్యాంకులు ఇతర పెట్టుబడిదారులకు షేర్లు అమ్మవచ్చు.
ఈ సవరణ ద్వారా పెద్ద పెద్ద కంపెనీ కంటే మిన్నగా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్, సహకార బ్యాంకుల్లో ఏ పెట్టుబడిదారైనా రూ.100 షేరు విలువ ఉన్న ఒక షేర్ కొని పెట్టుబడిదారు కావచ్చు. కానీ ఈ సహకార బ్యాంకులు రైతుల సభ్యత్వంతో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమాఖ్య సంస్థలు. వీటిలో పెట్టుబడుదారులకు సభ్యత్వం కలిగించడం సహకార సిద్ధాంతానికి, సహకార ఆర్థిక విధానానికి విరుద్ధం. సహకార సంస్థలు వినియోగదారుల కలయిక ద్వారానే ఏర్పడతాయి. పెట్టుబడిదారులు, దోపిడీదారుల నుంచి రక్షింపబడడానికి ఈ సహకార సంస్థ ఏర్పడింది. వినియోగదారుడు, పెట్టుబడిదారుడి ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
కానీ ఈ చట్ట సవరణ ద్వారా ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్, సహకార బ్యాంకుల లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పెట్టుబడిదారులకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇది భారీ కుట్ర. గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను బహుళ ఫైనాన్స్ కార్పొరేషన్ గుప్పిట్లో పెట్టడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఇలాంటి మౌలిక ఆర్థిక విధానాన్ని జాతీయ అభివృద్ధి మండలి లాంటి అత్యున్నత సంస్థ నిర్ణయించాలి. కానీ చట్టంలో ఒక సెక్షన్ చేర్చడం ద్వారా భారత దేశ ఆర్థిక మౌలిక స్వభావాన్ని మార్చడం సాధ్యం కాదు. కేంద్రం తేవాలనుకుంటున్న ఈ సవరణ భారత రాజ్యాంగ పీఠిక లక్ష్యాలను, 19(1)(జి), 38, 39(సి), 43, 43బి, 246 అధికరణలను అతిక్రమిస్తున్నది. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన సవరణ కాబట్టి దీనిని వ్యతిరేకించాలని ‘సహకార ధర్మ పీఠం’ దేశంలోని ఎంపీలందరినీ కోరింది. దురుద్దేశంతో కూడిన బ్యాంకింగ్ రెగ్యులేషన్(సవరణ)చట్టం-2020లోని సెక్షన్ 12(1)ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
(వ్యాసకర్త : ధర్మకర్త,సహకార ధర్మ పీఠం)
సంభారపు భూమయ్య: 82478 16648