అవే నేలలు.. నాడు పగుళ్లతో కరువు కాటకాలకు నిలయమైతే, నేడు సిరులు పండించే భూములయ్యాయి. అవే వేదికలు.. నాడు ఆర్భాటపు ప్రకటనలకు, ఆచరణకు రాని పథకాలకు అడ్రస్గా నిలుస్తే నేడు వేల కోట్ల పెట్టుబడుల వెల్లువకు, ఉద్యోగాల కల్పనకు కేంద్రమయ్యాయి. విజయవంతంగా ముగిసిన బయో ఏషియా సదస్సే దీనికొక తాజా ఉదాహరణ. ఉమ్మడి ఏపీలో 2004లోనే బయో ఏషియా సదస్సు మొదలైనప్పటికీ.. దానికి అంతర్జాతీయ గుర్తింపు రావటానికి అక్షరాల పదేండ్లు పట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ ప్రాధాన్యాన్ని, అవి సృష్టించే సంపదను, మానవాళికి చేసే సేవలను గుర్తించింది. ఏటా బయో ఏషియాను చిత్తశుద్ధితో, పకడ్బందీ కార్యాచరణతో నిర్వహించటం ప్రారంభించింది. ఫలితాలను గణాంకాలే ప్రస్ఫుటం చేస్తున్నాయి.
2014 వరకు జరిగిన 11 సదస్సుల ద్వారా రూ.1300 కోట్ల పెట్టుబడులు వస్తే.. ఆ తర్వాత జరిగిన ఎనిమిది సదస్సుల ద్వారా రూ.23,700 కోట్లు రాష్ర్టానికి వచ్చాయి. ఇదే స్థాయిలో ఉద్యోగ కల్పన కూడా జరిగింది. కేవలం ఈ ఏడాది సదస్సు ద్వారానే రూ.7,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తున్నట్లు అంచనా. ‘అందరి కోసం ముందంజ.. వచ్చే తరం మానవీయ ఆరోగ్య సంరక్షణకు రూపకల్పన’ అనే అంశంతో జరిగిన ఈ ఏడాది బయో ఏషియా సదస్సు ఆశించిన దానికన్నా మిన్నగా విజయవంతమైంది. 50 దేశాలకు చెందిన 2,000 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. 200కుపైగా సమావేశాలు జరిగాయి. బయోసైన్సెస్ రంగంలో జరుగుతున్న అత్యున్నత స్థాయి పరిశోధనలు చర్చకు వచ్చాయి. ఆ రంగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి సాధించిందో యావత్ ప్రపంచం చూసింది. అమెరికాకు చెందిన ఎఫ్డీఏ ధ్రువీకరణ పొందిన ఫార్మా కంపెనీలు అమెరికాలోని ఏ నగరంలోనూ లేనట్లు హైదరాబాద్లోనే అత్యధికంగా (214) ఉన్నాయంటేనే మన సత్తా ఏమిటో తెలుస్తున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తీసుకొచ్చిన వినూ త్న పారిశ్రామిక విధానం, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో బహుళజాతి కంపెనీలు మన రాష్ర్టానికి క్యూ కట్టడం వల్లనే ఇది సాధ్యమైంది.
తెలంగాణ ప్రగతి రథం ప్రతి రంగంలోనూ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. జీవశాస్ర్తాల రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువను ఇప్పుడున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ బయోఏషియా సదస్సులో ప్రకటించారు. ఈ మేరకు తగిన కార్యాచరణతోపాటు మౌలిక సదుపాయాలు కూడా శరవేగంగా సమకూరుతున్నాయి. 14 వేల ఎకరాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా రూపుదాల్చనుంది. జీనోమ్వ్యాలీలో 50 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో జరిగే టీకాల ఉత్పత్తిలో 35 శాతం మన వద్దే జరుగుతుండగా, వచ్చే ఏడాదికి ఇది 50 శాతానికి చేరుకోనుంది. బయోసైన్సెస్ రారాజుగా తెలంగాణ అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు.