ఆంధ్ర రాష్ట్రంతో బలవంతపు విలీనం నుంచి తెలంగాణ బయటికి వచ్చి పదేండ్లవుతున్నది. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను రాజకీయ అనాథలా చూశారు. యావత్తు భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు 1948, సెప్టెంబర్ 17న వచ్చింది. కేంద్ర మిలిటరీ, పౌరపాలన కింద 1948 నుంచి 1952 వరకు నాలుగేండ్లు గడిచాయి. 1953 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రం కొంత రాజకీయ స్వాతంత్య్రం అనుభవించింది.
దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భాషా ప్రయుక్త రాష్ర్టాల డిమాండ్ల మేరకు రాష్ర్టాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ) ఏర్పాటైంది. ఎస్ఆర్సీ కంటే ముందే భాష ప్రాతిపదికపై 1953లో ఆంధ్రరాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయింది. చెల్లాచెదురుగా ఉన్న భాషాధిక్య ప్రాంతాలను ఇటూ అటూ కలపడం, తీసేయడం ద్వారా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ వంటి భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటయ్యాయి.
భాష ప్రాతిపదికపై ఏర్పడిన కొత్త రాష్ర్టాల్లోని ప్రజ లు అన్నాదమ్ముల్లా కలిసిపోయారు. ఆంధ్ర-తెలంగాణ విలీనం విషయంలో అది జరగలేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకు తెలుగు భాష మాట్లాడేవారి ప్రాంతంగా గుర్తింపు లేదు. 1956లో ఎస్ఆర్సీ కూడా మిగులు హైదరాబాద్ (తెలంగాణ) రాష్ర్టాన్ని ఆంధ్రాతో కలుపమని చెప్పలేదు. ఒకవేళ భాష ఒకటే అనుకున్నా అప్పటి పరిస్థితుల్లో విలీనం అవసరమని భావించలేదు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించి, 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండు రాష్ర్టాలు కోరుకుంటే విలీనం గురించి ఆలోచించవచ్చని సూచించింది. తెలంగాణ ప్రజలు మొదటినుంచీ విడిగా ఉండాలనే కోరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆంధ్ర రాష్ర్టానికి సాయపడేందుకు వేసిన రాజకీయ ఎత్తుగడల ఫలితంగా కేంద్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటుచేసింది. తెలంగాణను ఒప్పించేందుకు అనేక రక్షణలతో కూడిన పెద్ద మనుషుల ఒప్పందం చేయించారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ అస్తిత్వంలోకి రావడంతో మెజారిటీ ఆధిపత్యం పగ్గాలు చేపట్టింది. అనతికాలంలోనే పెద్ద మనుషుల ఒప్పందాన్ని మరిచిపోయారు. తెలంగాణ అదనపు ఆదాయంతో సమతూకం చేసి సమైక్య ఏపీ బడ్జెట్ రూపొందించేవారు. తెలంగాణ ఆదాయం, ఉద్యోగాలు, నదీజలాల వాటాకు రక్షణ కల్పించే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారు. ఫలితంగా 1969 ఉద్యమం వచ్చింది. తిరుగుబాటును అణచివేసేందుకు 369 మంది తెలంగాణ బిడ్డలను పోలీసు కాల్పుల్లో చంపేశారు. మూల ఒప్పందాలను నీరుగార్చేందుకు 8 సూత్రాల పథకాలు, 6 సూత్రాల పథకాలు ముందుకుతెచ్చారు. అదివరకే ఆంధ్రాకు మళ్లించిన నిధులతో సహా తెలంగాణ ఆదాయాన్ని ఈ ప్రాం తానికే ఖర్చు చేయాలని ఒప్పందం కుదిరింది. అయినా ఏమీ జరుగలేదు. ఆ సూత్రాలను పక్కనపెట్టేందుకు చట్టసభల్లోని మెజారిటీని వాడుకున్నారు. హైదరాబాద్ ఆంధ్రాకు బంగా రు గని అయింది. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతం రెండోస్థాయికి దిగజారింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రాజుకున్నది. జాతీయపార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం దాన్ని ఎగదోశాయి. తుది దశ రాజకీయ పోరాటం 2001 నుంచి 2009 మధ్యకాలంలో జరిగింది. ఏపీ శాసనసభ వెలుప ల అన్ని పార్టీల ఒప్పందాల తర్వాత 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడింది. కానీ, కొద్దిరోజుల్లోనే కేంద్రం, ఆంధ్ర ప్రాంతం మాట మార్చాయి.
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణ మెడలు వంచేందుకు విచిత్రమైన సమైక్యాంధ్ర ఉద్యమం నడిపించారు. తెలంగాణ ఆకాంక్షలను అంతం చేసేందుకు ఉద్దేశించిన కుటిల జన విద్వేష రాజకీయ ఎజెండాతో అది వచ్చింది. నాలుగున్నరేండ్ల తర్వాత అది వీగిపోయింది.
కాంగ్రెస్ విద్రోహాన్ని నిరసిస్తూ వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణకు పాల్పడ్డారు. ఈలోగా పక్షపాత రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ రెండు ప్రాంతా ల్లో, ముఖ్యంగా ఆంధ్రాలో కాంగ్రెస్ బలహీనపడటం మొదలైంది. ముప్పై పైచిలుకు ఉప ఎన్నికలు జరిగితే అందులో దాదాపు అన్నింటిలో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ చేతుల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కనిపించ లేదు. తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు, కొన్ని ఎంపీ స్థానాలు పదిలం చేసుకునేందుకు తప్పనిసరి పరి స్థితుల్లో కాంగ్రెస్ చివరి నిమిషంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లును హడావిడిగా తీసుకువచ్చింది. ఎన్ని కల్లో ఓడిన కాంగ్రెస్ ఆంధ్రాలో, కేంద్రంలో అధికారం కోల్పోయింది.తెలంగాణలోనూ గెలవలేకపోయింది. తెలంగాణకు వ్యతిరేకంగా తాను సాగించిన అనైతిక రాజకీయాలకు తానే బలైపోయింది. ఈ చరమాంకంలోనే కాదు, 1956 ఆ తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారం లో ఉన్నా తెలంగాణను రాజకీయ అనాథలానే చూశా యి. ఎస్ఆర్సీ సిఫారసు చేయలేదు. నెహ్రూ సామ్రాజ్యవాదం అన్నాడు కూడా. అయినప్పటికీ తెలంగాణ గతి ఏం కానున్నదో స్పష్టమైపోయింది. కేంద్రం బలవంతం గా తెలంగాణను ఆంధ్రాలో కలిపేసింది. ఎన్ని ఉద్యమా లు వచ్చినా పట్టించుకోకుండా విధికి వదిలేసింది. కేంద్రం వేర్వేరు రాష్ర్టాల విషయంలో వేర్వేరు వైఖరి అవలంబించింది. మహారాష్ట్ర, పంజాబ్ విషయం లో తన నిర్ణయాన్ని 1960, 1966లో సవరించుకున్నది. 2000 లో బీజేపీ అడిగితే చాలు అన్నట్టుగా మూడు రాష్ర్టాలను విభజించింది. హామీ ఇచ్చిన తెలంగాణను మాత్రం టీడీపీకోసం పక్కనపెట్టింది. ఈశాన్యం లో కూడా ఎన్నో ఉదాహరణలున్నాయి. తెలంగాణ విషయంలో మాత్రం 58 ఏండ్లు, 1500కు పైగా చావుల తర్వాత నిర్ణయం జరిగింది. అనేక వలస దేశాల్లోనూ స్వాతంత్య్ర పోరాటాల్లో ఇంతమంది మరణించిన దాఖలాలు లేవు.
జస్టిస్ ఫజుల్ అలీ, పండిత్ నెహ్రూల జోస్యాలు నిజం కావడమే కాదు, తెలివైన ఆంధ్రుల చేతుల్లో ఈ ప్రాంత దోపిడీ అంచనాలను మించిపోయింది. ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణ ఆదాయం, ఇతర వనరుల విషయంలో చెప్పుకొన్న లెక్కలన్నీ నిజమేనని తేలింది. తొమ్మిది ప్రధానమైన ఆర్థిక విభాగాల్లో తన సత్తా ఏమిటో తెలంగాణ తొమ్మిదేండ్లలోనే చాటిచెప్పింది. కేంద్రం మద్దతు ఏ మాత్రం లేకుండానే ఎన్ఎస్డీపీలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. 1956 లో విడిగా ఉండనిచ్చినా, లేదా 1969లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినా రాష్ర్టాల సమాఖ్యలో తెలంగాణ ఇంకా ఎంతో సమున్నతమైన స్థితిలో ఉండేది.
తెలంగాణ, దాని పాలకపక్షం రాష్ట్ర స్థూల, సర్వ సమగ్రాభివృద్ధి పథాన్ని ఎంచుకొని, సత్వర అభివృద్ధిలో అంగలు వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు తమ కాలం చెల్లిపోయిన కుల, మత రాజకీయాలతో, రాష్ట్ర విభజనపై పచ్చి అబద్ధాలతో నిస్పృహను రాజేస్తూ తెలంగాణ రాష్ట్ర సత్వరాభివృద్ధిని పట్టాలు తప్పించాలని చూస్తున్నాయి. ప్రగతి నిరోధక భావజాలంతో, కట్టు కథలతో పురోగతిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, అవేవీ పనిచేసే సూచనలు కనిపించడం లేదు. కొత్త రాష్ట్రం బలాలేమిటో, పాలకపక్షం చేపట్టిన వ్యూహాత్మక పునర్నిర్మాణం ఏమిటో ప్రజలు తమ కండ్లారా చూసి ఉండటమే అందుకు కారణం.
తెలంగాణను కాంగ్రెస్ రాజకీయ అనాథగా చూసిన సుదీర్ఘ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. 2014లో ఆ పార్టీని విస్పష్టంగా తిరస్కరించారు. ప్రతిపక్షం కావడానికి అవసరమైనన్ని సీట్లు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పట్ల బీజేపీ మెతక వైఖరి, తుది ఘట్టంలో శల్య సారథ్యం, గత 9-10 ఏండ్ల కాలంలో చూపిన సవతి తల్లి ప్రేమ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడీ రెండు పార్టీలు తెలంగాణను సార్వ భౌమాధికారాలు గల రాష్ట్రంగా చూసి, ఇక్కడి ప్రజలు తమ రాజకీయ విజ్ఞతను చూపారని తెలుసుకొని, ఇక్కడి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో పునరుజ్జీవనాన్ని సాధించిందని, రాష్ర్టాన్ని రాజకీయ అనాథగా చూడటాన్ని ఇక్కడి ప్రజలు ఇక ఎంతమాత్రం సహించే స్థితిలో లేరని గ్రహించాలి.
ఈ నేపథ్యంలో, ‘సాంకేతికంగా చూస్తే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదనడం’ పిచ్చిమాటే. ఇక హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నడిపే మత రాజకీయాలు, యూటీ, రెండో రాజధాని అంటూ చేసే హంగామా, స్థానిక, ఆంధ్రా ప్రాంతంలోని నిస్పృహకు గురైన శక్తులు వేసే రాజకీయ ఎత్తుగడలూ సాధించేదేమీ ఉండదు. తెలంగాణ ప్రజలు రాజకీయ స్వాతంత్య్రాన్ని, తమ వనరులపై సార్వభౌమాధికారాన్ని, ప్రగతి పరుగులను అనుభవించారు. ఎక్కడో దూరాన కూర్చుండి పెత్తనం చేసే పార్టీలకు దీన్నంతటినీ అప్పగించే ఆలోచనలో ఎలా ఉంటారు. నిరాశలో కునారిల్లుతున్న స్థానిక అతుకుల బొంతలనూ వారు పట్టించుకోవడం లేదు.
తెలంగాణ రాష్టం శాశ్వతం, సొంత ప్రజలే దాని భాగ్య విధాతలు. బయటివారు కాదు. దీనిపై ఎలాంటి రాజీకి తావు లేదు!
అనువాదం: తుమ్మలపల్లి రఘురాములు
– జేఆర్ జానుంపల్లి 83743 68944