తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 1969 నాటి తొలి దశ ఉద్యమం నుంచి 2009లో మలి దశ ఉద్యమం దాకా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మూలస్తంభాలు విద్యార్థులే. కానీ, ఈ రోజు అదే విద్యార్థి లోకం నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహ, నిరుద్యోగం మధ్య కొట్టుమిట్టాడుతున్నది.
2023లో నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువత భవిష్యత్తును గాలికొదిలేసింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల చావులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయి. పాముకాట్లు, ఫుడ్ పాయిజన్, నీటి కొరత, శానిటైజేషన్పై నిర్లక్ష్యం గురుకుల విద్యార్థుల జీవితాలను హరిస్తున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద విద్యార్థుల కుటుంబాలు లక్షల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. గురుకులాల బోధనలో నాణ్యత లోపం కనిపిస్తున్నది. ఒకవైపు జాతీయ స్థాయిలో పోటీ పెరుగుతుంటే, మన విద్యా విధానం మాత్రం పాత పద్ధతుల్లోనే సాగుతూ వెనకబడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకుండాపోయింది. అబద్ధపు హామీలతోనే మభ్యపెడుతూ, సమయానుకూలంగా వాగ్దానాలను వాయిదా వేస్తూ వస్తున్నది.
ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలు అటకెక్కాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ విద్యార్థి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమైంది. ఇది కొత్తగా మేలుకోవాల్సిన సమయం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. విద్యారంగంలో సమర్థవంతమైన మార్పు కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, ఫీజు రీయింబర్స్మెంట్ నిబంధనల సవరణ, రెసిడెన్షియల్ విద్యాలయాల పునరుద్ధరణ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు కోసం పోరాటం చేయాలి.
ఓ విద్యార్థి మేలుకో! నీవు నిద్రపోతే, నీ కలలను వేరే వారు దోచేస్తారు. నీవు మౌనంగా ఉంటే, నీ హక్కులు మట్టిలో కలిసిపోతాయి. నీవు గళమెత్తితే భవిష్యత్తు మారుతుంది. నీవు పోరాటానికి సిద్ధమైతే పాలకులు జవాబుదారీగా మారుతారు.
రాష్ట్రంలో విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ముందుకువస్తున్నది. ఒక సంఘటిత విద్యార్థి శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. ఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ భూమిలో మరోసారి విద్యార్థి గళం మార్మోగాలి.
ఓ తెలంగాణ విద్యార్థి! నీ గళాన్ని వినిపించు!
నీ న్యాయం కోసం నువ్వే పోరాడాలి!
సంకేతాలు స్పష్టంగా ఇవ్వు.
‘మా హక్కులు మా చేతుల్లోకి రావాలి’
‘మేం చదివితేనే తెలంగాణ వెలుగుతుంది’
ఓ విద్యార్థి నీ హక్కులకై మేలుకో!
తెలంగాణ సాధనకు ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఆందోళనలు తెలంగాణ ఏర్పాటుకు వేదికయ్యాయి. 1969లో మొదలైన ఉద్యమం నుంచి 2014లో రాష్ట్ర స్థాపన వరకు విద్యార్థి సంఘాలే గొంతెత్తి నినదించాయి. అలాంటి పునాది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం జరుగుతున్నది. గ్రూప్-1, డీఎస్సీ, టీస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. వచ్చినా పరీక్షల రద్దు, అవకతవకల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యలో నాణ్యత లోపాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లు లేరు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యమవుతున్నది. నిరుద్యోగ యువత నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావంతో విద్యారంగాన్ని ప్రైవేటీకరిస్తూ, సామాన్య విద్యార్థికి విద్యను అందకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ అవసరం ఎంతో ఉన్నది. ఈ సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారమవుతాయి. బీఆర్ఎస్వీ విద్యార్థి వాణిగా మారాలి. ఉద్యమ గళంగా మారాలి. ఇప్పుడు ఉన్న విద్యార్థి సంఘాలు బలహీనంగా మారిన నేపథ్యంలో కేవలం జెండా కోసం కాదు, పోరాట విలువల కోసం ఒక శక్తిగా మారాలి. బీఆర్ఎస్వీ అదే ఆకాంక్షతో పనిచేయాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే విద్యావ్యవస్థ కోసం పోరాడాలి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచే విధానాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. హిందీని ప్రవేశపెట్టాలనుకోవడం, జాతీయ ప్రవేశ పరీక్షల్లో స్థానిక విద్యార్థులకు అన్యాయం, కేంద్ర బోర్డుల పెత్తనం నేపథ్యంలో తెలంగాణ స్ఫూర్తికి అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దే ఉద్యమ వేదికగా మారాలి. యూనివర్సిటీ, డిగ్రీ, ఇంటర్ స్థాయిలో విద్యార్థి సమస్యలపై చట్టపరంగా పోరాడాలి. క్యాంపస్ లెవెల్ నుంచి జిల్లాల వరకు స్టూడెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరంతరం పోరాడాలి. సామాజిక న్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యా హక్కుల కోసం నిలబడాలి.
– సల్వాజి మాధవరావ్ 93916 73807