‘ప్రచారం లేకుండా వ్యాపారం చేయడమంటే చీకటిలో కన్నుకొట్టడం లాంటిది’ – అన్నాడు ప్రముఖ మార్కెటింగ్వేత్త ఎస్.హెచ్. బ్రిట్. వర్తమాన ప్రపంచంలో మార్కెటింగ్ ప్రాముఖ్యాన్ని ఈ సూక్తి చాటుతున్నది. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్న మాట వాస్తవం. తెలంగాణ నేడు సంక్షేమ రాజ్య మే కాదు, పెట్టుబడులకు స్వర్గం. ఇక్కడ వ్యాపారం చేసేవారికి ఏ ఆటంకాలు లేకపోగా అనేక ప్రోత్సాహకాలు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యాపార సంస్థలకు చేరవేయగలగాలి. యూకే, దావోస్ పర్యటనల ద్వారా కేటీఆర్ ఇందు కోసమే కృషిచేయగలిగారు. తెలంగాణ సానుకూల పరిమళాన్ని విశ్వవ్వాప్తంగా చాటిచెప్పారు.
45 వ్యాపార భేటీలు, నాలుగు రౌండ్టేబుల్ సమావేశాలు, నాలుగు చర్చాగోష్ఠులు – స్వల్ప కాలంలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, తెలంగాణ భావి పురోగతికి కేటీఆర్ బాట వేశారు. దాదాపు పదిరోజులు సాగిన ఈ పర్యటనలో ఫార్మా మొదలుకొని ఫుడ్ ప్రాసెసింగ్ వంటి భిన్న రంగాల పెట్టుబడులను కేటీఆర్ రాబట్టగలిగారు. విద్యా, నైపుణ్య వృద్ధి విషయమై సంబంధిత వర్గాలతో అవగాహనకు వచ్చారు. ఉత్పత్తిలో మాత్రమే కాకుండా పరిశోధనలో తెలంగాణను ప్రపంచానికి తలమానికంగా మార్చాలనే నవీన దృక్పథం కేటీఆర్లో కనిపించింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలనే ఆకాంక్ష నెరవేర్చడానికి స్టాడ్లర్ రైల్ కంపెనీని ఒప్పించారు.
యూకే, దావోస్ పర్యటనల ఫలవంతానికి కేటీఆర్ బహుముఖ వ్యక్తిత్వమే ప్రధాన కారణమనవచ్చు. అధునాతన సాంకేతిక అభివృద్ధి, వ్యాపార ధోరణులు, అంతర్జాతీయ పోకడలు- లోతుపాతులు, సమాజ అవసరాలు మొదలైనవన్నీ ఆయన ఆకళింపు చేసుకున్నారు. ఆంగ్ల పరిజ్ఞానం, సంభాషణా చాతుర్యం, పరిణత భాష ణం, ఉన్నత సంస్కారం ఆయన పనితీరుకు మరింత వన్నె తెచ్చా యి. కృత్రిమ మేధతో కూడిన ముఖ గుర్తింపు వంటి సాంకేతిక పరిజ్ఞానాలను అమలుచేయడం పెద్ద సవాలు అంటూ కేటీఆర్ దావోస్ వేదిక చెప్పిన మాటలు ఆయన సామాజిక దృక్పథాన్ని, ప్రజాస్వామిక తాత్వికత లోతును వెల్లడిస్తున్నది. ప్రభుత్వం వివక్ష రహితంగా వ్యవహరించాలని, సాంకేతికత ద్వారా ప్రజలపై నిఘా ఉండదనే భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. కృత్రిమ మేధ, యంత్ర అభ్యసనం, బ్లాక్ చైన్, డేటా సైన్స్ వంటి రంగాలకు మేధావులు అవసరమని అంటూనే, ఈ సాంకేతికతలతో సమస్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. అందుకే ‘మీ నాయకత్వంలో తెలంగాణ సాంకేతిక శక్తికేంద్రంగా పరివర్తన చెందడం గణనీయమ’ని కేటీఆర్ను వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బార్జ్ బ్రెండ్ ప్రస్తుతించారు. కేటీఆర్ భావి ప్రధాని అంటూ ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా వ్యాఖ్యానించారు!