తెలంగాణ సీఎం కేసీఆర్ తన 8 ఏండ్ల పాలనలో దాదాపు 90 శాతం హామీలను పూర్తి చేశారు. మిగిలినవి దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావు లేకుండా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎలాంటి భేద భావం లేకుండా సబ్బండ వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలను అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేసీఆర్ దార్శనిక పాలనకు నిదర్శనం.
కుల వృత్తులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ రంగాలపై ఆధారపడినవారికి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నింపి మత్స్యకారులకు ఉపాధి కలిపిస్తున్నారు. దేశంలో ఎకడా లేని విధంగా ప్రతి ఎకరా సాగు భూమికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా భవిష్యత్తు తరాల బాగు కోసమే వాటిని అమలు చేస్తున్నారు. ప్రజల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. సుమారు 90 లక్షల కుటుంబాల్లోని పేదలను గుర్తించి వారి ఆర్థికాభివృద్ధికి సరికొత్త పథకాలు ప్రారంభించారు. అవినీతికి తావు లేకుండా అర్హులైన వారికే పథకాలను అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. పరిమితి లేకుండా పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. డిజిటల్ రేషన్ కార్డులను మంజూరు చేసి రేషన్ సరకులు నల్ల బజారుకు తరలడాన్ని 90 శాతం అరికట్టింది. పేదలకు 9.37 లక్షల రాయితీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది.
స్త్రీలు, బాలికల రక్షణ కోసం మహిళా పోలీసులతో షీ టీమ్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సన్న బియ్యంతో చేసిన అన్నం వడ్డిస్తున్నది. రైతుల రుణాలను మాఫీ చేసి వారికి అండగా నిలుస్తున్నది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ.5 లక్షల నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం 300 కు పైగా గోదాములను నిర్మిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 180 రెసిడెన్షియల్ పాఠశాలలను కొత్తగా ప్రారంభించింది. అంబేదర్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నది.
అణగారిన వర్గాల వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 50 శాతం వరకు పెట్టుబడి రాయితీలను అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. న్యాయవాదుల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించింది. డ్రైవర్లు, హోం గార్డులు, జర్నలిస్టులకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా పథకం పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. పాత్రికేయుల సంక్షేమానికి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నది. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం 100 శాతం విజయవంతమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు వారి తల్లులకు చెల్లిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ దవాఖానాల్లో జన్మించిన శిశువులకు కేసీఆర్ కిట్ అందిస్తున్నది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ ఒకపూట పోషకాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పంచాయితీ రాజ్ చట్టం అమలు చేసి తండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సౌర, పవన, జల విద్యుత్తు ఉత్పత్తికి పెద్ద పీట వేసి విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు సాధించింది. వివిధ రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నది. ఇలా అనేక వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారం కోసం అర్రులు చాస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలి. లేకపోతే ప్రజా సంక్షేమం కుంటుపడే ప్రమాదం ఉన్నది.
(వ్యాసకర్త: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
మోటె చిరంజీవి 99491 94327