‘విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్న పూలే మాటల ఆంతర్యానికి గౌరవం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ప్రభుత్వ బడులను కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యా ప్రమాణాలు పెంచే బృహత్ కార్యాన్ని భుజాన వేసుకున్నది. మొత్తం సర్కారు బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నది.
గత కొన్నేండ్లుగా పాఠశాల విద్యపై తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ను గమనిస్తున్నట్లయితే పాఠశాల విద్యపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని గమనించవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.9,113.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తదుపరి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.9844.47 కోట్లు కేటాయించింది. అదనంగా రూ.2 వేల కోట్లను పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయించింది. ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లీషు మీడియంలోనే విద్యను బోధించాలనే ఉక్కు సంకల్పంతో రూ.7289.54 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధించాలని సంకల్పించడం తెలంగాణలోని నిరుపేద విద్యార్థులకు వరం. మొదటి దశలో అత్యధిక విద్యార్థులున్న 9,123 స్కూళ్లలో రూ.3497.62 కోట్లు ఈ విద్యా సంవత్సరానికి విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపాదికన లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ స్వయంగా తన చేతుల మీదుగా నేడు వనపర్తి నుంచి ప్రారంభించనున్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఈ విద్యా యజ్ఞానికి దాతల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఎక్కడికక్కడ పూర్వ విద్యార్థులు, విదేశాల్లో స్థిరపడినవాళ్లు, వ్యాపారరంగాల్లో అభివృద్ధి చెందినవాళ్లు సమావేశాలు ఏర్పర్చుకొని తమ ప్రాంతంలోని పాఠశాలను బాగుచేయాలని, ప్రభుత్వ లక్ష్యానికి తోడుగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం జనగామకు చెందిన వ్యాపారస్థుడు తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి తాను చదువుకున్న బీబీనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆరు కోట్ల పైచిలుకు నిధులతో కట్టించడమే కాకుండా రెండు కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటుచేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి-జమునారెడ్డిలు ఏర్పాటుచేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిమ్మాజీపేటలోని ప్రభుత్వ పాఠశాలను రూ.3 కోట్లతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేవిధంగా అత్యాధునిక భవనాన్ని నిర్మించి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలంలోని బాజీపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కీర్తిశేషులు ఏడు దొడ్ల చిన్నరాంరెడ్డి, సంజీవ్రెడ్డిల జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు అదనపు తరగతి గదుల నిర్మాణం చేయించారు. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 225 మంది పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు ముందుకువచ్చారు.
పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్థులు, ఎన్నారైలు తమ గ్రామాల్లోని స్కూళ్ల నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం కూడా రెట్టింపైన ఉత్సాహంతో కొత్త పథకాలను తీసుకొచ్చి తమ స్వప్నాన్ని నెరవేరుస్తుంది. ప్రభుత్వం సంకల్పించిన విద్యాయజ్ఞంలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రు లు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధు లు, గ్రామాల్లోని యావత్ ప్రజానీకం ప్రభుత్వ బడుల బాగుకోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలి. విద్యలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా తోడ్పాటునందించాల్సిన అవసరం ఉన్నది.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మక్లూరులోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.4.7 కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తాను ఓనమాలు దిద్దిన పాఠశాల కోసం మంత్రులు కేటీఆర్, సబితలకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ.5.7 కోట్లతో స్కూల్ను పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేయిస్తున్నారు.
– సామల ముఖేష్
9703973946