రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందా అని యావత్ ప్రపంచం ఓవైపు ఎదురుచూస్తుంటే.. మరోవైపు, అగ్నికి అజ్యం పోసేలా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటో లో చేరుతామని స్వీడన్, ఫిన్లాండ్ ప్రకటించటంతో వివాదం మరింత ముదిరేట్లు కనిపిస్తున్నది. దీనిపై రష్యా, టర్కీ ఇప్పటికే అగ్గి మీద గుగ్గి లం కాగా, అమెరికా, బ్రిటన్ సానుకూలంగా స్పందించాయి. యూరప్లో అంటుకున్న చిచ్చు ఇప్పట్లో ఆరిపోయే మాట అటుంచి మరింత విస్తరిస్తున్నది. వాస్తవానికి స్వీడన్, ఫిన్లాండ్ రెండూ దశాబ్దాలుగా శాంతికాముక దేశాలుగా పేరొందాయి. ప్రపంచశాంతి కోసం, అణు నిరాయుధీకరణ కోసం కృషి చేసే మధ్యవర్తిగా స్వీడన్ గుర్తింపు పొంది ంది. రెండో ప్రపంచయుద్ధంలో సోవియట్ రష్యా చేతుల్లో ఓటమి అనంతరం ఫిన్లాండ్ మరోసారి యుద్ధం వైపు తొంగిచూడలేదు.
నాటోలో చేరాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దీనికి ఇరుదేశాల్లో పెద్దగా ప్రజా మద్దతు ఉండేది కాదు. కానీ, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఈ దేశాలను అంతర్మథనంలో పడేసింది. పరిణామాలు, అభిప్రాయాలు వేగంగా మారిపోయాయి. ఫిన్లాండ్లో 76 శాతం, స్వీడన్లో 57 శాతం మంది ప్రజానీకం నాటోలో చేరాలంటున్నట్లుగా సర్వేలు వెల్లడించాయి. ఈ మేరకు తొలుత ఫిన్లాండ్, ఆ తర్వాత స్వీడన్ నాటోలో చేరనున్నట్లు ప్రకటించాయి. దీనికి అమెరికా, బ్రిటన్ తక్షణం మద్దతు తెలుపటమేగాక సభ్య త్వం లభించేలోపే ఏమైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా తాము ఆదుకుంటామని అభయహస్తం ఇచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ రెండు దేశాల చేరికతో తమకు ప్రమాదమేమీ ఉండబోదంటూనే, తమ సరిహద్దుల దగ్గరి దాకా వాటి సైనిక విస్తరణ జరిపితే మాత్రం తమ ప్రతిస్పందన తప్పకుండా ఉంటుందంటూ హెచ్చరిక చేశారు. తమ దేశంలో అంతర్యుద్ధానికి కారణమవుతున్న కుర్దు మిలిటెంట్లకు ఆశ్రయం కల్పించే ఈ రెండు దేశాలు నాటోలో చేరడాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని నాటో సభ్యదేశం టర్కీ అంటున్నది. నాటో నియమాల ప్రకారం.. కూటమిలోకి కొత్త దేశాన్ని చేర్చుకోవాలంటే సభ్యత్వదేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది.
ప్రపంచ యుద్ధాల అనంతర కాలంలో ఆవిర్భవించిన నాటో, ఇప్పుడు సరికొత్త వివాదాలకు కేంద్రం అవుతున్నది. కూటమి పేరుతో అమెరికా, పశ్చిమదేశాలు తమ సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్నాయని, తన పొరుగుదేశాలను కావాలనే కుట్రలో భాగస్వాములను చేస్తున్నాయనేది తొలినుంచీ పుతిన్ ఆరోపణ. ఉక్రెయిన్కు చెందిన క్రిమియాను 2014లో ఆక్రమించుకున్నప్పుడుగానీ, ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్పైనే దాడికి దిగినప్పుడుగానీ రష్యా వాదన ఇదే. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు చొరవ తీసుకొని, ఇరుపక్షాల్లో భరోసా కల్పించి ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉండింది. కానీ, ఆ సంస్థలు అందుకు తగిన గౌరవాన్నిగానీ, తటస్థతనుగానీ కోల్పోయిన విషాద పరిస్థితి. ఏదేమైనా చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలనే ప్రజాస్వామిక మౌలిక సూత్రాన్ని అన్ని దేశాలూ పాటించాలి. అప్పుడే ప్రపంచశాంతి సాధ్యం.