ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ‘అచ్ఛేదిన్’ అనే మాట ప్రస్తావిస్తుంటారు. నిజంగానే ‘మరుపురాని’ రోజులను భారతీయులు అనుభవంలో చూస్తున్నారు. పదేండ్ల కిందటికి ఇప్పటికీ పెరుగుతున్న ధరల తీరు చూసి చుక్కలకే చెక్కరొచ్చేటట్లున్నది. మోదీ హయాంలో రెండురకాల అంశాల్లో భారీ పెరుగుదల కన్పిస్తున్నది. ఒకటి జనం నిత్యం ఉపయోగించే వస్తువుల ధరల్లో. మరొకటి తమను ప్రశ్నించినవారిపై ఈడీ, సీబీఐ కేసుల నమోదులో. ఈ రెండు అంశాలు చాలావేగంగా తమ సూచీలను ఊర్ధ ముఖంగా నమోదు చేస్తున్నాయి.
పల్లె నుంచి పట్నం దాకా అందరి అనుభవం వంట గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల. కానీ జనాలు భరిస్తున్నారే తప్ప ధరల గురించి కిమ్మనడం లేదు. బాధలు భరించడం కూడా ప్రజలు బాగా అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలేమిటి? తమపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాల గురించి ఆలోచించే తీరిక ప్రజలకు లేదు. పొద్దుతో పోటీపడి వారు బతుకుబండిని లాక్కొస్తున్నారు. ఇదీ యావత్ భారత ప్రజల జీవితం. ఎవ్వరి బతుకుదెరువు బిజీలో వారున్నారు. చడీచప్పుడు కాకుండా ధరలు పెంచే పనిలో మోదీ ప్రభుత్వం తలమునకలై ఉన్నది. దేని ధర ఎంత పెరిగిందనే లెక్కలకంటే మచ్చుకు ఒకటి, రెండు ముఖ్యాంశాలు చూపిస్తే వాటి తీవ్రత ఎంతో అర్థమవుతుంది. అంతేకాదు, కొత్తకొత్త రకాల పన్నులు ఎట్లా వేయాలో కూడా మోదీ ప్రభుత్వం ప్రజల అనుభవంలోకి తీసుకొస్తున్నది. ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వేసేందుకేనని ప్రజలకు సంపూర్ణంగా అర్థమయ్యేలా చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
తమది ‘స్మార్ట్’ ప్రభుత్వం అని ఇన్నాళ్లు చెప్పుకొంటున్న మోదీజీ ‘స్మార్ట్’ అంటే ఏమిటో మాంచి రుచి చూపించారు. వ్యాలెట్లు, కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్పై ఇంటర్ఛేంజ్ ఫీజుల వసూలును నేటి నుంచి అమలు చేయబోతున్నారు. ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ఈ పన్నుల వడ్డన ఉండబోతున్నదట.
ప్రధానంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిన దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించరంటూ తాజాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. 2013లో బ్యారెల్ ధర 110 డాలర్లు ఉంటే పెట్రోల్ ధర 76 ఉండేదని, ఇప్పుడు అదే బ్యారెల్ ధర 66 డాలర్లు ఉంటే పెట్రోల్ ధర 110కి చేరడమేమిటని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 శాతానికి పైగా పెట్రో ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా భారమై సామాన్యుడు కొనే ప్రతి సరుకు ధర భారీగా పెరగటంతో వాటిని భరించే శక్తి లేని ప్రజలు తల్లడిల్లుతున్నారు.
కార్పొరేట్ శక్తులకు పన్నులు తగ్గించి, ఇంధనం ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తున్నదని తన లేఖలో కేటీఆర్ బాహాటంగానే విమర్శించారు. పెట్రో ధరలే కాదు, నిత్యం వినియోగించే ఔషధాల ధరలను సైతం 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. బీపీ, చర్మ వ్యాధులు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, ఎనీమియా తదితరవాటికి వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ వంటి 800కు పైగా అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం. గడిచిన ఎనిమిదేండ్లలో ఔషధాల ధరలను 60 శాతం పెంచారు. అంతేకాదు, ఏటా సుమారు రూ.12 వేల కోట్లు కేవలం మందులపైనే పన్నుల రూపంలో కేంద్రం వసూలు చేస్తున్నది. ఇలాంటి లెక్కలు కోకొల్లలు.
ధరలు పెరగడంతో ఇంతకంటే మంచిరోజులు ఏం కావాలని ఎవ్వరూ అడిగే అవకాశం కూడా లేదు. ‘దేశం కోసం-ధర్మం కోసం’ ఈ మాత్రం భరించకుంటే ఎలా అని వాట్సాప్ యూనివర్సిటీలు సిద్ధంగా ఉంటాయి. అందుకే ధరలు పెరుగుతున్నా ఆహా.. ఓహో.. చాలా మంచి రోజులని జనం భావించాలి. లేదంటే వీళ్ల ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది. అలాంటి రుచి కూడా దేశంలో ఏదో రాష్ట్రంలో ఏదో పార్టీ చూస్తూనే ఉన్నది. ఇదంతా అందరి కండ్లముందు జరుగుతున్న విషయమే. కానీ అంతటా మౌనం. కారణం, ప్రతిదానికి రాజీ పడటమే. గతంలో ప్రభుత్వాలు చారాణా బస్సు ఛార్జీలు పెంచితే గయ్యిమని లేచే కమ్యూనిస్టులు కూడా నేడు కిమ్మనడం లేదు. పార్లమెంట్లో అధికార పక్షాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టే ప్రధాన ప్రతిపక్షమూ నేడు పరేషాన్లో ఉన్నది. ప్రజా వ్యతిరేక చర్యలంటూ ప్రభుత్వ పాలసీలు పెట్టబడిదారులకు అనుకూలంగా ఉన్నట్లు కాస్త అన్పించినా చాలు ధర్నాలు, రాస్తారోకోలతో రోడ్లు కిక్కిరిసిపోయేవి. ప్లకార్డులు, బంద్లు అంటూ ప్రజాస్వామ్యం బతికే ఉన్నదనే చర్చను ప్రపంచానికి చాటిచెప్పేవి. కానీ, ప్రస్తుతం విపక్షాలు, ప్రజలు అప్రకటిత బంద్ ప్రకటించుకొని తలుపులే కాదు, కిటీకిలు కూడా మూసుకొని మౌనవ్రతంలోకి వెళ్లినట్లు వర్తమాన చరిత్ర ముందుతరాలకు అందజేయబోతున్నది.
ఒకవేళ ధైర్యం చేసి ఏ పార్టీ నాయకుడైనా మోదీ పాలసీని ప్రశ్నిస్తే వెంటనే వారు ఇబ్బందులపాలు కాక తప్పదు. అందుకే 75 ఏండ్ల స్వర్ణోత్సవ భారతంలో ఈడీ, సీబీఐలు మునుపెన్నడూ పని చేయని విధంగా శరవేగంగా స్పందిస్తున్నాయి. కాదు కాదు, స్పందించేలా మోదీ బృందాలు పనిచేస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమను ప్రశ్నించేవారిని దారికి తెచ్చుకునేందుకు ఈడీ ప్లస్ సీబీఐ అనే ఫార్ములాను మోదీ ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తున్నదని విపక్షాల ప్రధాన ఆరోపణ. ఇప్పటి వరకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని వారందరిపై పదుల సంఖ్యలో ఈడీ కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. అంటే నయనో భయనో అందరినీ తమదారికి తెచ్చుకునేందుకు అన్ని దారులూ వెతుక్కొని మరీ తమ సంగతేమిటో చూపిస్తున్నది ప్రధాని మోదీ ‘అచ్చేదిన్’ ప్రభుత్వం. ఎనుకటికి ఎవరో కోరి కోరి… కోడె దూడను తెచ్చుకుంటే తిర్గిన దిక్కల్లా పొడిచిందట. ఇప్పుడు దేశంలోని ప్రజల పరిస్థితి కూడా అట్లాగే ఉన్నదని పెరుగుతున్న ధరలే కాదు, కేసులు కూడా రుజువు చేస్తున్నట్లుంది.
అస్కాని మారుతీసాగర్: 90107 56666
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)