ఇటీవల కాలంలో బాలికలు బాలురతో సమానంగా చదువులు, క్రీడల్లో రాణిస్తున్నారు. మరోవైపు బాలికలపై అత్యాచారాలు, దాడులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లను మహాలక్ష్మిగా భావించే మన దేశంలో కన్న వెంటనే ఆడ పిల్లలను చెత్త కుప్పల్లో పడేయడం నేటికీ కొనసాగుతున్నది. బాలికల్లో రక్త హీనత ఆందోళన కలిగిస్తున్నది. బాలికలు లేనిదే సమాజ మనుగడ లేదు. బాలికలకు సరైన విద్యావకాశాలతోనే వారి సాధికారత సాధ్యం. ఇందుకు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సిన కృషి ఎంతో ఉన్నది.
అనాదిగా చాలా ప్రపంచ దేశాల్లో పితృస్వామ్య వ్యవస్థ రాజ్యమేలుతూనే ఉంది. బాలికలను ఇంటి పనికి పనికొచ్చే పని మనిషిలాగా చూసే భావన పూర్తిగా తొలిగిపోలేదు. ఈ పరిస్థితిని మార్చాలని అమెరికా పౌర హక్కుల నేత ఎలానార్ రూజ్ వెల్ట్ సంకల్పించారు. లింగ సమానత్వంలో భాగంగా ‘మ్యాన్’ అనే మాటకు బదులుగా ‘పీపుల్’ అనే పదాన్ని విస్తృతంగా వాడుకలోకి తెచ్చారు. బాలికల సాధికారతకు ఆమె చేసిన కృషిని స్మరించుకుంటూ ఆమె జన్మ దినమైన అక్టోబర్ 11ను ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. బాలికలకు సమాన హక్కులు కావాలని కోరుతూ 2012 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కెనడాకు చెందిన ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ‘ఐ యామ్ ఏ గర్ల్’ ప్రచారం వల్ల ఈ దినోత్సవం ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితి బాలికల సాధికారతకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ‘మన హక్కులే మన భవిష్యత్తు – ఈ కాలం మనదే’ నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని యూనిసెఫ్ పెద్ద యెత్తున నిర్వహిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఇరాన్, అఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో బాలికల చదువు, స్వేచ్ఛపైనా ఇప్పటికీ ఆంక్షలు అమలు కావడం విషాదం. చివరికి వారి వస్త్ర ధారణపైనా ఆంక్షలు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బాలికలపై పని భారం ఎక్కువ అవుతున్నది. బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల ఈ పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. బాలికల అక్రమ రవాణా, అదృశ్యం ఇటీవల ఆందోళన కలిగిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి రోజు సగటున ఒక బాలిక కనిపించకుండా పోతున్నది. బాలికలపై అత్యాచారాలు పెరగడం ఆందోళన కలిగించే మరో అంశం.
తండ్రి, సోదరుడు లాంటి సొంత కుటుంబ సభ్యులే బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల వీడియోలు తదితర కారణాల వల్ల ఈ దుస్థితి తలెత్తుతున్నది. దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజంపై ఉన్నది. తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం అధిక శాతం బాలికలు పౌష్టికాహారం లోపం, హిమోగ్లోబిన్ లోపంతో బాధ పడుతున్నారు. బాలికలు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బాలికల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. చాలా రాష్ర్టాలు బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శానిటరీ న్యాప్కిన్స్ వినియోగంపై అవగాహన కల్పించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. భ్రూణ హత్యల కారణంగా బాలబాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం తలెత్తుతున్నది. ఈ పరిణామం భవిష్యత్తులో వివాహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
బాలికలపై వివక్ష తొలగిపోవడానికి ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాలి. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలి. మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలకు తగిన పౌష్ఠికాహారం అందించాలి. బాలికల ఆసక్తి మేరకు వారిని ఉన్నత చదువులు చదివించాలి. బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పాలి. క్రీడలు, లలిత కళలు, పరిశోధనల్లో ప్రతిభ చూపే బాలికలకు ప్రత్యేక ఉపకార వేతనాలు ఇవ్వాలి. బాలికలతో గౌరవంగా ప్రవర్తించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. బాలికలకు ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలి. మద్యపానం, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలి. బాలికలకు, విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయాలి. అంగన్ వాడీల ద్వారా వారికి తగినంత పౌష్టికాహారం అందించి వారిలో రక్త హీనతను నివారించాలి. గిరిజన ప్రాంతాల్లోని బాలికల సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలి. బాలికల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 60 కోట్ల మంది బాలికలకు మెరుగై న భవిష్యత్తు కల్పించినప్పుడే ప్రపంచం లింగ సమానత్వంతో వర్ధిల్లుతుంది. ఆడపిల్లను రక్షించుకుందాం… సృష్టిని కాపాడుకుందాం అనే భావన సమాజంలో బలపడినప్పుడే అది సాధ్యం.
– రావుశ్రీ (నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం)