కాకతీయ సామ్రాజ్యాధినేతల్లో రుద్రమదేవి పరిపాలనా కాలం విశేషమైనది. ఆమె కాలంలో నల్లగొండ జిల్లాలోని ఆలుగడప (నేటి ఆలగడప)గ్రామంలో వరద
గోపీనాథ స్వామి ప్రతిష్ఠ జరిగిన సందర్భంలో వేసిన శాసనం ఉంది. శాసన కాలం శ.సం.1186 = క్రీ.శ. 1265 రక్తాక్షి సంవత్సరం మాఘశుద్ధ పంచమి. శాసన ప్రారంభంలో వేంకటేశ్వర, గోవింద, శ్రీనివాస నామాలతో, అతని శాసనంతో చేయబడిందని ఉన్నది.
రుద్రమదేవి కాలంలో రామానుజదాసులు, పెరుమాడి దాసులు, బంభొని విల్లిదాసులు, కోమటిభండారి లక్ష్మణదాసులు అనే ఈ నలుగురు ఆలుగడప గ్రామం మధ్యలో వరద గోపీనాథ దేవుని తిరుప్రతిష్ఠ చేసి శాసనం వేయించారు. మన్మహా ప్రధాని రాయస్థాపనాచార్య కన్నార దేవనాయకులు ఈ ప్రతిష్ఠ సమయంలో అముదుపడి (స్వామి నైవేద్యాలకు) ఆలుగడపలో రావుల చెరువు వెనక ఉన్న పెద్ద తూము కాలువ కుంటలోపల అడ్డశేను వ్రిత్తులు పెట్టినారు. మన్నయ సాహిణి ఈ చెరువు వెనక కుంట కింద కాలువలో రెండు వీసాలు శేను వ్రిత్తి పెట్టినాడు. ఖేయిదేవనింగారు కాలువలో ఆలోచితమూల్యం తీసుకొని వరద గోపీనాథ దేవునికి ముప్పాతిక శేను క్రయమిచ్చినారు. కేయిదేవరాజులు అద్దశేను, ఎక్కదేవ పండితులు పాతిక శేను, త్రిపురారిభట్టు అడ్డశేను, వల్లభప్పయ్య ముప్పాతిక శేను, ఏటి కాలువలో గుడివారు పాతికశేను, పినమల్దేవరాజులు అలువు కాలువ కింద సర్వమాన్యంగా పాతికశేను, దేవినేనిపల్లి చెరువు వెనక కనువల్లూరి బొల్లయ పాతిక స్వామికి సమర్పించినారు.
శాసనపర్వం- 64
కన్నార దేవనాయుండు దేవుని దీపానికి ఒక గానుగను వ్రిత్తిగా సమర్పించినాడు. బయట నూనె, నేయి, ఆముదము కోసం సిద్ధాను తవ్వెండు, గంపాను తవ్వెండు, ఆకు మోపునకు ఒక పిడె, కూరగాయల గంపకు పదిగాయలు అష్టాదశ ప్రజలు కొలబడి మాడకు వీసము ఇచ్చినారు. నువ్వుల నూనె నిత్యదీపాలకు సమర్పించినారు. రాచవారు తిరు మెత్సవాలకు ధరణము (తెలియరాలేదు) ఇచ్చినారు. అదేవిధంగా తిరుపవిత్రాలకు, జయంతికి, దీపావళి నాటి దీపాలకు అడ్డుగ, దవన పున్నమనాటి దవనానికి కూడా సమర్పించినారు. శ్రీమత్ప్రౌఢ ప్రతాపచక్రవర్తి పరశురామ దేవరాజుల పాద పద్మోపజీవి, సర్వాధికారి అయి న హేమాండి దేవనాయనిగారు, ఆలుగడపలోని అష్టాదశ ప్రజలు కలిసి ఒక మాడ కు వీసము సమర్పించినారు. ఈ ధర్మము పాటించినవారు అనేక స్వర్గ ఫలాలు పొందుతారని, మరచినవారు అనేక నరకాలు పొం దుతారని శాపోక్తులు చెప్పబడినాయి.
ఇంకా ఆలుగడపలోని సమస్త అష్టాదశ ప్రజలు, నాయకులు అనేకులు రాచపొలానికి, దేవుని మూడు పూటల నైవేద్యానికి కింది కాల్వలో రెండు వీసాలు సమర్పించారు. శాసనంలో చివరగా రామానుజదాసుల కొడు కు పెద్దిన్ని పిళ్ళ పెరుమాడి దాసుల కొడుకు కేసయాను శ్రీకార్యం (దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యముల నిర్వహణ బాధ్యత) చేసేవాడుగా చెప్పబడినాడు.
ఈ విధంగా ఒక ఊరిలో ఉండే దేవుని అన్నిరకాల సేవలకు, నైవేద్యాలకు గ్రామంలో ఉండే ప్రజలు, అధికారులందరూ తమకు ఉన్న ఆర్థిక స్థితిని బట్టి సామూహికంగా స్వామికి సమర్పించడం అనేది ఎంతో అద్భుతమైన విషయం.
– భిన్నూరి మనోహరి