‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా ! రక్తబంధం విలువ నీకు తెలువదురా.. నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా! తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా’ అని ఎలుగెత్తి తెలంగాణ గోసను లోకానికి వినిపించిన పాట ఆగిపోయింది. మట్టిమనుషుల గోసను కండ్లకు కట్టిన స్వరం మూగపోయింది. ఉద్యమగీతమై రెపరెపలాడిన వేద సాయిచంద్ ఇక లేడనే వార్త రాష్ట్ర ప్రజలకు తీవ్ర వ్యధను మిగిల్చింది. పాటల కోట మీద నుంచి యుద్ధ ప్రకటన చేసిన వాగ్గేయకారుడు చిన్న వయసులోనే గుండెపోటుకు గురయ్యాడన్న బాధ అందరినీ దొలుస్తున్నది. గోదాముల కార్పొరేషన్ చైర్మన్గా సేవలందిస్తున్న సాయిచంద్కు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. తాను అందుకోవాల్సిన శిఖరాలు, చేరుకోవాల్సిన తీరాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇంతలోనే నడమంత్రపు గుండెపోటు యువగాయక కిశోరాన్ని కబళించింది. ఉద్యమానికి కవాతు సంగీతం అందించిన గాయకుని మృతి తెలంగాణ సాంస్కృతిక లోకానికి తీరని లోటును మిగిల్చింది. మలిదశ ఉద్యమానికి తన గొంతును దన్నుగా నిలిపిన దళిత బిడ్డను తెలంగాణ గడ్డ యాది మరువదు.
మట్టిమనుషుల గోసకు అద్దం పట్టేది అతని పాట. అతని పాట లేకుండా సభలు జరిగేవా? అతని పాట, ప్రసంగం చెట్టపట్టాలు వేసుకుని నడిచేవి. ప్రసంగం మధ్య పాట ఎగిసేది. పాటల మధ్య ప్రసంగం ఉబికేది. ఆనాడు ఉద్యమనేత కేసీఆర్ నాయకశ్రేణులను వెంటపెట్టుకొని వేదిక మీదకు వచ్చేదాకా సభికులను ఉర్రూతలూగించినది సాయిచంద్. స్వరాష్ట్ర సాధన తర్వాత సకల జనహిత పాలననూ సంబుర గీతాలుగా మలచినదీ సాయిచంద్. ఇలా ఉద్యమంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో తనదైన గొంతు వినిపించాడు. ఇంకా ఎన్నెన్ని పాటలు పాడాలో లెక్కతేలక ముందే మన మధ్య నుంచి ఉన్నట్టుండి మాయమయ్యాడు.
సాయిచంద్ అకాల మరణం మనకు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నది. ఇటీవలి కాలంలో పిన్నవయస్కుల్లో గుండెపోట్లు పెరగడం మనం చూస్తున్నాం. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. వృత్తివ్యాసంగాలు ఎటూ ఉంటాయి. వాటి మీద మనసు పెడతాం. కానీ మన ఆరోగ్యం గురించిన ధ్యాస కూడా ఉండాలని వైద్యనిపుణులు సూచించడం తెలిసిందే. ఉత్పాతాలకు ముందు శరీరం ఏదో ఒక మేర సంకేతాలు ఇస్తుంది. వాటిని గమనిస్తుండాలి. ఆరోగ్యవంతులైన యువత, మధ్యవయస్కుల్లో గుండెపోట్లు గణనీయంగా పెరిగినట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. మనరాష్ట్రంలో జరిపిన సర్వేలో మొత్తం గుండెజబ్బుల్లో 30-60 ఏండ్ల వయసువారి వాటా 68 శాతంగా ఉండ టం గమనార్హం. అంటే కుటుంబాలను పోషించేవారు, బాగోగులు చూసుకోవాల్సిన వారే గుండె సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం స్టెమీ పథకం ద్వారా సకాలంలో వైద్యసహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. కానీ చికిత్స కన్నా నివారణే ఉత్తమం అనే సూక్తిని అందరూ గుర్తుంచుకుంటే మంచి ది. నేను మీ గుండెల్లో పదిలం.. కానీ మీరు మీ గుండెలను పదిలంగా ఉంచుకోండని సాయిచంద్ మనకు చెప్తున్నాడు.