రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమి సేకరించి అమరావతిలా కొత్త నగరాన్ని నిర్మిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా అటు అమరావతి, ఇటు రాచకొండ చర్చలోకి వచ్చాయి. మన కాలంలో దేశంలో అతిపెద్ద ఫెయిల్యూర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అమరావతి. ఈ ఫెయిల్యూర్ నుంచి టీడీపీకి అండగా ఉండేవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా కోలుకోలేని దెబ్బ తాకింది. సాధారణంగా ఎవరైనా ఒక సక్సెస్ అయిన ప్రాజెక్టు గురించి ఉదహరిస్తారు కానీ, రేవంత్రెడ్డి డిజాస్టర్ అయిన ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించడం విశేషం.
ఇతర రాజధాని నగరాలతో పోలిస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్ భౌగోళిక పరిస్థితి వేరు. ముంబై, చెన్నై వంటి నగరాల విస్తరణకు సముద్రం అడ్డుగా ఉంటుంది. భూమి లభ్యత తక్కువ. ఎటువెళ్లినా సముద్రం వస్తుంది. తెలంగాణ రాజధాని నుంచి ఎటువెళ్లినా భూమే. దాదాపు రెండు మూడు గంటల్లో తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్లవచ్చు. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా నగర విస్తరణ, అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఎంత దూరమనే లెక్కలతో జిల్లాలకు కూడా పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతిలా ఇక్కడ వేల ఎకరాల భూమి సేకరించి చతికిల పడాల్సిన అవసరం లేదు.
అమరావతి రాజధాని మొత్తం లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ మాయాజాలం. అది ప్రజల రాజధాని అయి ఉంటే ఐదేండ్లలో రాజధాని నగరంగా అభివృద్ధి చెందేది. జనం కేంద్రంగా కాకుండా రియల్ ఎస్టేట్ కేంద్రంగా అమరావతిని చూశారు కాబట్టే అది రియల్ ఎస్టేట్ చరిత్రలోనే పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. హైదరాబాద్కు అమరావతితో పోలిక లేదు. అమరావతి ఫార్ములా ఇక్కడ పనిచేయదు. రాజకీయాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధిని అడ్డుకునే మత కలహాలు, శాంతి భద్రతలు, విద్యుత్తు సంక్షోభం వంటి పాత రోజులను తెచ్చిపెట్టకపోతే చాలు హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. రాచకొండ వద్ద 50 వేల ఎకరాల భూమి సేకరించి ఇంకో నగరాన్ని నిర్మించడం సాధ్యమా? లాభమా?
అమరావతిపై అప్పటి టీడీపీ పాలనలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోణంలో చూడటాన్ని సొంతవర్గం వారు కూడా హెచ్చరించారు. అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు ఇంటర్వ్యూ ఓ పత్రిక రెండు పేజీల్లో సుదీర్ఘంగా ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూలో అమరావతి ఫెయిల్యూర్ ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించారు. చైనా దేశంలో ఇలానే పెద్ద పెద్ద నగరాలను నిర్మించారు. భవనాలే తప్ప ఆ నగరాల్లో మనుషులు లేరని మృత నగరాలుగా మిగిలిపోయాయని హెచ్చరించారు. హైదరాబాద్తో పోలిక వద్దు నగరం క్రమంగా పెరుగుతుంది కానీ, భవనాల నిర్మాణంతో కాదని హెచ్చరించారు.
అమరావతి రాజధాని శంకుస్థాపనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ ఉర్దూ నానుడి చెప్పారు. ‘బస్తే బస్తే బస్తీ బన్తా.. బస్తీ బనాతే నహీ’ అనేది ఓ ఉర్దూ నానుడి. అంటే క్రమంగా ప్రజలు నివసిస్తూ పోతుంటే బస్తీ (నగరం) తయారవుతుంది కానీ నగరాన్ని నిర్మించరని బాబుకు చెప్పుకొచ్చారు. హైటెక్ సిటీని చూపించి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న టీడీపీ అనుకూల వర్గం పెద్ద ఎత్తున అమరావతిలో భూములు కొని ఇప్పుడు నిండా మునిగారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయి ఉంటే వారి పంట పండేది. బాబు అధికారంలోకి వస్తారు. మళ్లీ మా కలలు పండుతాయనేది వారి ఆశ. ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో సైతం తమ చెప్పుచేతుల్లో ఉండే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అమరావతి ప్రాజెక్ట్లానే రాచకొండ నగర నిర్మాణం కోసం 50 వేల ఎకరాల భూమి సేకరిస్తానని రేవంత్రెడ్డి ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటో? అది కాంగ్రెస్లో చర్చించి తీసుకున్న నిర్ణయమా? తన సొంత నిర్ణయమా? రేవంత్రెడ్డి చెప్పలేదు. అంతకుముందు కాంగ్రెస్లో కొత్త నగర నిర్మాణం గురించి ఎలాంటి చర్చ జరిగినట్టు వార్తలు రాలేదు. ఇది రేవంత్రెడ్డి సొంత నిర్ణయమే అయి ఉంటుంది.
అమరావతి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలోనే చెప్పారు. యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మించే బదులు రాయలసీమ నీటి ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పినట్టు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
అమరావతి ఆంధ్రను ఎలా దెబ్బ తీసిందో ఇప్పుడు తెలిసివస్తున్నది. గ్రాఫిక్స్తో చంద్రబాబు ఐదేండ్ల పాటు కాలం వెళ్లదీశారు. పెట్టుబడి పెట్టిన టీడీపీ వర్గం సైతం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. కండ్లముందు ఇది కనిపిస్తున్నా రేవంత్రెడ్డి రాచకొండలో 50 వేల ఎకరాలు సేకరించి కొత్తనగరం నిర్మిస్తామని చెప్పడం ఏమిటో? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫైరింగ్ రేంజ్ కోసం రాచకొండ ప్రాంతంలో భూమి సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే జనం పెద్దఎత్తున ఉద్యమించారు. ప్రజల ఉద్యమంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది.
హైటెక్ సిటీ అయినా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చెందుతుంది. నగరాన్ని నిర్మిస్తే ఎదగదు. 2014లో తెలంగాణ ఏర్పడగానే హైదరాబాద్ నుంచి పరిశ్రమలన్నీ ఆంధ్రకు వెళ్లిపోతున్నాయని ఉద్దేశపూర్వకంగా వార్తలు రాసేవారు. నూజివీడు సీడ్స్ అనే ఒకే ఒక విత్తనాల కంపెనీని ఉదాహరణగా చూపుతూ ప్రముఖ పత్రికలోనూ పదేపదే వార్తలు వచ్చేవి. జర్నలిస్ట్గా ఓసారి అప్పటి పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కలిసి విషయం అడిగితే అలాంటిదేమీ లేదన్నారు. హైటెక్ సిటీ వైపు స్థలం అడిగే ఐటీ కంపెనీలకు ఘట్కేసర్ వైపు ఇస్తామని చెప్తే 25 కిలో మీటర్ల దూరమే వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇక వందల కిలో మీటర్ల దూరం వెళ్తారా? ఖండించడం ఎందుకు రెండు రోజులు అయితే వారికే తెలుస్తుంది కదా అన్నారు. అలానే జరిగింది. చివరికి అమర్రాజా వంటి కంపెనీ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చింది కానీ, హైదరాబాద్ నుంచి ఏ కంపెనీ వెళ్లలేదు.
హైదరాబాద్ శివార్లలో గతంలో తొమ్మిది మున్సిపాలిటీలుండేవి. హైదరాబాద్ క్రమంగా విస్తరించినకొద్దీ వాటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపేశారు. దాదాపు 40 ఏండ్ల కిందట నార్నే ఎస్టేట్ వాళ్లు బీబీనగర్ వద్ద ఈస్ట్ సిటీ పేరుతో వందలాది ఎకరాల్లో వేలాది ప్లాట్స్ అమ్మారు. సికింద్రాబాద్లో వీరి వెంచర్ ఒకటి విజయవంతం కావడంతో రెండవ వెంచర్ అని దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఉండే సైనికోద్యోగులు వీటిని కొన్నారు. 40 ఏండ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నది.
హైదరాబాద్ను ఆధారం చేసుకొని నగరం విస్తరిస్తున్నప్పుడు మధ్యలో అంత ఖాళీ ఎలా భర్తీ అవుతుంది. ఇప్పుడు యాదాద్రి ప్రాజెక్టు, బీబీనగర్ వరకు మెట్రో, యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతాల్లో వేగంగా కదలిక వస్తుంది. బాంబే హైవే, నాగపూర్ హైవే, వరంగల్ హైవే, కరీంనగర్ హైవే, బెంగళూరు హైవేలపై హైదరాబాద్ నుంచి ఎటు చూసినా 50 కిలోమీటర్ల వరకు నగరం వేగంగా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉప్పల్ గ్రామంలా కనిపించేది ఇప్పుడు నగరం ఘట్కేసర్ను దాటింది. మెట్రోతో బీబీ నగర్ దాటుతుంది.
వరంగల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ వైపు దూసుకువస్తున్నది. శాంతిభద్రతలు కాపాడి, ఇలానే విద్యుత్తు కొరత లేకుండా, పరిశ్రమలతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే మొత్తం తెలంగాణనే మహానగరం అవుతుంది. ఇప్పటికే పలు జిల్లాకేంద్రాల్లో ఐటీ భవనాల నిర్మాణం జరిగింది. ఐటీ కంపెనీల కార్యకలాపాలు మొదలయ్యాయి. సమయం పట్టవచ్చు కానీ, తెలంగాణనే మహా నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. యాభై వేల ఎకరాలు సేకరించి అమరావతిలా అక్రమాలకు అవకాశం లేదు. ప్రజలు కేంద్రంగా కాకుండా రియల్ ఎస్టేట్ ముఠాల కేంద్రంగా ఆలోచన చేసి అమరావతిలో బోల్తాపడ్డ వర్గం తెలంగాణలో సైతం అలానే దెబ్బతినడం ఖాయం.
– బుద్దా మురళి