జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాసిన బహిరంగ లేఖ…
నేడు జరుగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కొన్ని కీలకమైన ప్రజా సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజల పక్షాన మా వాదనను వినిపించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాము.
చేనేతపై జీఎస్టీ రద్దు – ఇది మా హక్కు, మీ బాధ్యత: తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. చేనేత మిత్ర పథకంతో ముడి సరకును 50 శాతం సబ్సిడీకే ఇవ్వడంతో వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు బీమాతో ధీమా ఇచ్చింది. అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించాం. లోకం మానం కాపాడటానికి మగ్గం పట్టిన నేతన్న తయారుచేసిన వస్ర్తాలపై ఎలాంటి పన్నులు ఉండొద్దన్న ఉదాత్తమైన ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో పాటు మా అందరికీ ఉండేది. ఎన్నో వేదికలపై ఇదే విషయాన్ని మేం స్పష్టం చేశాం. కానీ, ప్రజా సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ఏ కోశానా పట్టించుకోని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీ విధించింది. అంతటితో ఆగకుండా పన్నును 12 శాతం పెంచాలని ఆ తర్వాత నిర్ణయించింది. ఆ సమయంలో దేశంలో అందరికంటే ముందే నేను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాశాను. వ్యవసాయం తర్వాత లక్షల మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై పూర్తిగా పన్నును ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా అని ప్రశ్నించాను. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో 12 శాతం నిర్ణయం అమలును మీరు వాయిదా వేశారు. అయితే, చేనేత వస్ర్తాలపై ఇప్పుడున్న 5 శాతం జీఎస్టీని కూడా పూర్తిగా రద్దుచేయాలని మరోసారి నేను బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. చేనేత అనేది వస్త్ర తయారీ రంగమే కాదు, అది మన సాంస్కృతిక వారసత్వం కూడా. దానిపై పన్ను వేయడమంటే మన సంస్కృతిని అవమానించడమే.
12 శాతం స్లాబ్ రద్దు ప్రతిపాదన కంటితుడుపు చర్య, మరో మోసపూరిత హామీ: జీఎస్టీలోని 12 శాతం స్లాబ్ను రద్దుచేసి, పేద, మధ్యతరగతి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు కేంద్రం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజలను మభ్యపెట్టే మరో జుమ్లానే. మొత్తం జీఎస్టీ పరిధిలోని రూ.22 లక్షల కోట్లకు పైగా వచ్చే ఆదాయంలో ఈ 12 శాతం స్లాబ్ వాటా 5 శాతమే. ఇంత నామమాత్రపు వాటా ఉన్న స్లాబ్ను రద్దు చేసి, అందులోని వస్తువులను వేరే స్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలందరినీ ఉద్ధరించినట్టు మోదీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదం. గత దశాబ్ద కాలంగా పాలు, పెరుగు, ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలపైనా జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచింది మీ బీజేపీ ప్రభుత్వం. ఇంతేకాదు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ఈ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నది.
అసలు సమస్య పెట్రో భారం.. దానిపై దృష్టి సారించండి: గత పన్నెండేండ్లుగా బీజేపీ పాలనలో విపరీతంగా పెరిగిన ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్పై మీరు విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2014 నాటి స్థాయికి పడిపోయినా, దేశంలో మాత్రం పెట్రో ధరలు మాత్రం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉన్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజల సంపదను లూఠీ చేస్తున్న ఈ భారాన్ని తగ్గించకుండా, జీఎస్టీలో నామమాత్రపు మార్పులు చేయడంతో ప్రజలకు ఒరిగే ప్రయోజనం శూన్యం. నిత్యావసర ధరల పెరుగుదలకు మీరు పెంచిన పెట్రో, ఎల్పీజీ రేట్లే అసలు కారణమన్న సంగతిని గ్రహించనంత వరకు దేశ ప్రజలకు ఎలాంటి ఉపశమనం లభించదు. మీరు ఇష్టారీతన పెంచిన పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గిస్తేనే రవాణా భారం తగ్గి ఆటోమెటిక్గా ధరాభారం తగ్గుతుంది.
ఇక పెట్రో ధరలను పన్ను రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెంచడం మీరు తీసుకున్నది మరో అప్రజాస్వామిక నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పన్నుల రూపంలో పెంచితే వచ్చిన ఆదాయంలో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న అక్కసుతో పెట్రో ధరలను సెస్సుల రూపంలో పెంచి మీరు రాష్ర్టాలను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూశారు. బలమైన రాష్ర్టాలు ఉంటేనే బలమైన కేంద్రం ఉంటుందన్న సమాఖ్య స్ఫూర్తిని మరిచి మీరు వ్యవహరించారు. అందుకే పెట్రో, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించడంతో పాటు సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను.
పెట్రో, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసిన కేంద్ర ప్ర భుత్వం ఇప్పుడు జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ.. దానితోనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ప్రచారం చేసుకుంటున్నది. ప్రతీ నెల పేద, మధ్యతరగతి ప్రజల నుంచి వేల రూపాయలను కొల్లగొట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ స్లాబ్ రద్దుతో వారికి కలిగే నామమాత్రపు ప్రయోజనాన్ని కూడా తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. నిజంగా ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం కలిగించాలని కేంద్రం భావిస్తే తక్షణమే పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గించి, సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. అలా చేయకపోతే ఈ ప్రచారం కూడా మరో జుమ్లా లాగానే మిగిలిపోతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ధరలు తగ్గించి, దేశ ప్రజలకు అసలైన దీపావళిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ధరల మంటకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీరు పెంచిన ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.