సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల కూడా తెలంగాణలో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. కానీ, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అమలు జరిగిన అన్ని సంస్కరణలు రెండింతల అనూహ్య ఫలితాలు సాధించాయి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలో నంబర్ వన్గా పురోగమిస్తున్నది.
విజినరీ గల నాయకత్వం ఉంటే ఒక రాష్ట్రం ఎలా పురోగమిస్తోందో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణను ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే మంచిని మంచి అనడం ఒక వర్గం మీడియాకు నచ్చకపోవడం బాధాకరం. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వరుసగా అచ్చవుతున్న విషపు రోత రాతలను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం అన్నా.. ముఖ్యంగా కేసీఆర్ సంస్కరణలు, పాలన అన్నా వారికి ఒకింత కంటగింపుగానే కనిపిస్తున్నది.
దేశంలో సంస్కరణలు తీసుకురావాలని సాహసించిన ఏ ఒక్క పాలకుడినీ ఎక్కువకాలం అధికారంలో ఉండనీయని రాజకీయ వ్యవస్థ మనది. రాజకీయాలకతీతంగా.. సమాజంలో సబ్బండవర్గాలకు సమష్టి ప్రయోజనం కలిగేలా భారీఎత్తున సంస్కరణలను ఏ పరిపాలకుడైనా చేపడుతారని ఊహించడం కూడా కష్టమైన పనే. అందుకే ఆయుధం కన్నా ఆశయమే గొప్పదని చెప్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలుపెట్టి, అంతిమంగా విజయం సాధించాలంటారు. వస్తున్న విమర్శలు, పసలేని ఆరోపణలను పట్టించుకుంటే మన లక్ష్యం సిద్ధించదని కూడా కేసీఆర్ తరుచూ చెప్తుంటారు. కానీ ఇవే విషపు పత్రికలు, కొన్ని వార్త, ప్రసార మాధ్యమాలు సమైక్య పాలనలో విధ్వంసకర, విచ్ఛిన్నకర వాతావరణాన్ని కండ్లారా చూశాయి. అయి నా కొన్ని ఒత్తిళ్ల మేరకు తెలంగాణ ఆకాంక్షను మీడియా సాక్షిగా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయినా నాడు, నేడు కేసీఆర్ సదరు మీడియాను పట్టించుకోలేదు.
ఇవాళ మన తొమ్మిదేండ్ల తెలంగాణను చూస్తే నక్కకూ, నాగలోకానికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. స్వల్పవ్యవధిలోనే తెలంగాణ ఈ స్థాయిలో ఉంటుందా అని ఊహించుకోలేదు కూడా. కానీ తెలంగాణ దేశానికే మాడల్గా మారడం, అందుకు కారణం కేవలం కేసీఆర్ మాత్రమే. ఆయన ఆలోచన, ఆయన ఆశయం. కేసీఆర్ అసాధారణమైన, అనూహ్యమైన సంస్కరణ పథాన్ని ఎంచుకున్నారు. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకమైన నిర్ణయానికి సాహసించి ఉండరు. తెలంగాణ సిగలో సరికొత్త శ్వేత సౌధంగా వెలసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని చూస్తే కేసీఆర్ విజనరీని మరోసారి గుర్తుచేయక తప్పదు.
భారతదేశం వ్యవసాయ దేశమని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ.. ఇంతటి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని ఇంతకాలం పట్టించుకున్నదే లేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ‘రైతుబంధు’, ‘రైతు బీమా’, ‘రుణమాఫీ’ వంటి సంక్షేమాలకు తోడు భూ సంపదకు జల సంపదను తోడు చేసి సేద్యానికి అవసరమైన మానవ వనరుల సంపదను సృష్టించారు. ముఖ్యంగా వ్యవసాయ, సాగునీటి విప్లవంలో ఆయన తెచ్చిన సంస్కరణలు అన్నీ ఇన్నీ కావు. కాళేశ్వరం ప్రాజెక్టు, నీటి సంరక్షణ చర్యలు, నిర్మించిన రిజర్వాయర్ల ఫలితంగా రాష్ట్రంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 24 గంటల నిరంతర విద్యుత్తో వ్యవసాయరంగాన్ని పూర్తిగా సంస్కరించారు. ఫలితంగా ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డులు బద్దలు కొడుతున్నది.
గతంలో పనిచేసిన ఏ పాలకుడికీ భూ సంస్కరణలు చేపట్టడం సాధ్యం కాలేదు. 1970లలో ఒకసారి ఈ ప్రయత్నం జరిగినప్పటికీ.. అది విఫలమైంది. ఇందుకు కారణం నాడు శాసనకర్తల్లో అత్యధికులు భూస్వాములే ఉండటం. రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం ఒకటైతే, భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం మరొకటి. గ్రామాల్లో వీఆర్వోలు, తాసీల్దార్లు, ఆర్డీవోలు ఇష్టారాజ్యంగా భూముల రికార్డులను తారుమారు చేస్తూ అటు రైతులకు శోకం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికీ స్పష్టత లేకుండా చేశారు.
చివరికి భూ సంస్కరణలు అన్న పదాన్ని ఉచ్ఛరిస్తే అదొక ముళ్లకంపగా భావించి ఏ పాలకుడూ దాన్ని ముట్టుకోలేదు. రెవెన్యూ అధికారుల లీలలు ఒక్కో ఊళ్లో ఒక్కో కథ. సేత్వార్లో ఉండే భూమి పహాణీలో ఉండదు. పహాణీలో ఉన్న భూమి పట్టాలో కనిపించదు. ఒకరి భూమి మరొకరికి పట్టా చేస్తారు. ఉన్న భూమిని తక్కువ చేసి రికార్డుల్లో రాస్తారు. సర్వే నంబర్లు తొలగిస్తారు. ఒకే భూమిని ఇద్దరికి మ్యుటేషన్ చేస్తారు. రైతు కొన్న భూమి తనకే సొంతమన్న గ్యారంటీ ఉండదు.
ఎప్పటికప్పుడు రెవెన్యూ ఆఫీసుకు వెళ్లి చెక్ చేసుకుంటూ ఉండాలి. అతని భూమి ఎప్పుడు ఎవరి పేరు మీదికి మారుతుందో తెలియదు. ఏ రికార్డునైనా, ఏ విధంగానైనా మార్చగల సత్తా, సామర్థ్యం రెవెన్యూ అధికారులకే ఉన్నది. ఎన్ని విమర్శలు వచ్చినా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చి భూ వివరాలు పారదర్శకంగా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా చెప్పుకొంటే కేసీఆర్ పాలనలో ప్రతిదీ సంస్కరణే.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేయడం, మిషన్ భగీరథ అనే బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడం వంటి తదితర కార్యక్రమాలు ‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో అమలు జరిపారు.
కేసీఆర్… మానవీయతకు మారు పేరు. ఆత్మీయతకు మరో రూపు. విశ్వాసానికి చిరునామా. ఆత్మ విశ్వాసానికి
నిలువెత్తు నిదర్శనం. పోరాటానికి పిడికిలి. ధిక్కారానికి ధీరుడు. మూడక్షరాలే.. కానీ ముల్లోకాలు ఉన్నంతకాలం
కేసీఆర్ అధ్యాయం సువర్ణశోభితం. ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిపెట్టడమే కాదు,
పరిపాలనా దక్షతతో రాష్ర్టాన్ని సిరిసంపదల నిలయంగా మార్చారు.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా తదితర అభివృద్ధి, సంక్షేమంపై నిధుల వరద పారించారు. ప్రజల వద్దకే పాలన తీసుకుపోవడమే ధ్యేయంగా పరిపాలనా వికేంద్రీకరణ వైపు అడుగులు వేశారు. ఇక రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఐటీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలకూ విస్తరించింది. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన కంపెనీలు ఇప్పుడు పల్లెల బాట పట్టాయి. ఫలితంగా రెండున్నర లక్షల మంది యువతీ యువకులకు ఐటీ కొలువులు దక్కాయి.
అందుకే కేసీఆర్… మానవీయతకు మారు పేరు. ఆత్మీయతకు మరో రూపు. విశ్వాసానికి చిరునామా. ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. పోరాటానికి పిడికిలి. ధిక్కారానికి ధీరుడు. మూడక్షరాలే.. కానీ ముల్లోకాలు ఉన్నంతకాలం కేసీఆర్ అధ్యాయం సువర్ణశోభితం. ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిపెట్టడమే కాదు, పరిపాలనా దక్షతతో రాష్ర్టాన్ని సిరిసంపదల నిలయంగా మార్చారు. 2014కు పూర్వం, 2014 తర్వాత పరిస్థితులు చూస్తే ప్రతీ పల్లెలో ఆయన చెరగని సంతకం ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి ‘రీ డీజైన్ తెలంగాణ-రీ ఇన్నోవేషన్ తెలంగాణ’లో అసాధ్యాలన్నీ సుసాధ్యాలయ్యాయి. అది కేసీఆర్తోనే సాధ్యమైంది.
వెంకట్ గుంటిపల్లి: 94949 41001