నెమలిని చూసి నక్క నాట్యం చేసినట్లుంది ప్రధాని మోదీ వ్యవహారం. ఇటీవల కర్ణాటకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంపై స్పందించారు. కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడి తత్వాలపై మాట్లాడుతూ బసవేశ్వరుడు రూపొందించిన బసవ మండపం ఆధునిక ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఇది ప్రస్తుత ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్తూ ప్రతిపక్షాలు నన్ను రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నాయనడం ఓ హాస్యాస్పదం. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రధాని మోదీ దేశ వాసులను మరోసారి భ్రమల్లోకి నెట్టారు. ఆయన పరిపాలనా తీరు గత ఎనిమిదేండ్లలో సామాన్య మానవుడి నడ్డి విరిచేలా ఉన్నది. ఆయన పరిపాలనా విధానాన్ని తెలుసుకునేముందు నాడు బసవేశ్వరుడు తన బసవ మంటపం ద్వారా చేసినటువంటి సేవలను ఆదర్శాలను ఒకసారి చర్చిద్దాం.
బసవేశ్వరుడు హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖుల్లో ఒకరు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది.బసవేశ్వరుడు స్థాపించిన ‘అనుభవ మం టపం’ ఇప్పటి పార్లమెంటు తరహాలో ఉండేది. అక్కడ అన్నిరకాల కులాలు, జాతులు తమ సమస్యలు వినిపించేవారు. ప్రతిరోజు లక్షా తొంభై ఆరు వేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి తర్వాత తాను భుజించేవాడు.
బసవన్న కార్ల్ మార్క్స్ కన్నా ముందే సమానత్వం, సోషలిజం కోసం పోరాటం చేశారు. రాజ్యాంగం రాసే సమయంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజ లింగప్ప బసవన్న గురించి చెప్పినప్పుడు అంబేద్కర్ ఆశ్చర్య పోయారు. ఇంత గొప్ప ఆలోచనలున్న వ్యక్తి కర్ణాటకకే ఎందుకు పరిమితమైపోయారా అని, ఆయన వచనాలను ప్రపంచానికి పరిచయం చేయకుండా కన్నడిగులు ఈ దేశానికి అన్యాయం చేశారని బాధపడ్డారని చెప్తారు. తెలుగు భక్తి ఉద్యమకారులైన అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతరకాలంలో లింగాయత ధర్మంగా స్థిరపడింది.
ఇంతటి సర్వమానవ సంక్షేమం కోసం పరితపించిన బసవన్న అభ్యుదయ భావాలకు విరుద్ధంగా నేటి మోదీ పాలన కొనసాగుతున్నది. నాటి బసవ మంటపం ద్వారా బసవన్న అన్ని కులాలకు, జాతులకు, మహిళలకు సమ ప్రాధాన్యం కలిపిస్తే నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే తన బుల్డోజర్ పరిపాలన ద్వారా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐనే పావుగా వాడుకుం టే నేడు తానేం తక్కువ కాదన్నట్టు అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను తన జేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్షాలపై పంజా విసురుతున్నది.
సీఎం కేసీఆర్ ప్రకటించినట్టు రూ.12 వేల కోట్లతో దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చడం వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల కోసమే అనుకూలంగా పనిచేస్తున్న బ్యూరోక్రాట్లకు ప్రమోషన్లు, ఎక్స్టెన్షన్లు కల్పిస్తూ కార్యనిర్వాహక వర్గాన్ని తన చెప్పుచేతుల్లో వాడుకుంటున్నది. ఈడీ అధికారి సంజయ్కుమార్ మిశ్రా అదే కోవలోకి వస్తాడు. త్వరలో రాబోయే పార్లమెంటరీ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను, కార్పొరేట్ సంస్థలను, వ్యాపారవేత్తలను లొంగదీసుకోవడం ద్వారా అనధికారికంగా వేల కోట్ల నిధులను సమీకరించాలనే లక్ష్యం విచారణ సంస్థలకు అప్పగించినట్లు ఢిల్లీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీన్నిబట్టి బీజేపీ ఎంతటి దుర్మార్గ పద్ధతులు అవలంబిస్తున్నదో అర్థం చేసుకోవాలి.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటూ మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నది. చట్టసభల్లో మహిళల ప్రవేశం కోసం ఇప్పటివరకూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ నోరు మెదపలేదు. ఈ విషయంలో బీజేపీ నీతి SYMBOLIC INCLUSION-STRATEGI C EXCLUSIONగానే భావించాలి. దేశానికి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును తీసుకురావడంలో ఒక SYMBOLIC INCLUSIONగా మాత్రమే చూడాలి. ఈ దేశ మహిళలకు చట్టసభల నుంచి దూరంగా ఉంచడం ఒక STRATE GIC EXCLUSIONగా పరిగణించాలి. ఈ మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీ దీక్ష గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆర్ఎస్ఎస్ వాదులు కలవరపాటుకు గురయ్యారు. ఈ సందర్భంగా మన్మోహన్ వైద్య మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సామాజిక సేవ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం పెంచే తీర్మానాన్ని జాతీయ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పడం వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోతానని చెప్పినట్టుంది.
గుజరాత్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ నిందితులను వదిలిపెట్టడం ద్వారా ఎంత క్రూరమైన పక్షపాత ధోరణిలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదో దేశవాసులు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఎన్నడూ లేనివిధంగా అధిక ద్రవ్యోల్బణంతో సగటు మానవుల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తయారైంది. మరోవైపు ప్రతి రాష్ర్టాల ఎన్నికల అనంతరం పెంచిన ధరలతో నిరుపేదలు అల్లకల్లోలమవుతున్నారు. లక్షల మంది జంగమలకు అన్నం పెట్టిన తర్వాతే తాను భుజించిన బసవేశ్వరుడి గురించి ప్రధాని మోదీకి ఏం అర్థమైందో తెలియదు కానీ గ్రామీణుల నోటికాడి అన్నం లాగేసుకోవడంలో మోదీ ముందున్నారు. ఉపాధి హామీ కార్మికుల పనిదినాలు పెంచకపోగా బడ్జెట్లో నిధులు తగ్గించడం ఏ సామాజిక సహజ సూత్రాలకు మోదీ నిదర్శనమో సిగ్గుచేటుగా ఉన్నది. రైతులకు ఈ ఏడాది బడ్జెట్లో నిధులు తగ్గించడం కార్పొరేట్ పక్షపాతానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఓ వైపు అదానీ గ్రూపు వల్ల దేశం లక్షల కోట్లు నష్టపోతూ ఉంటే దానిపై మాత్రం నోరు మెదపరు. ఆ సంస్థకు కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ విచారణకు ఒప్పుకోకపోవడం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా భావించాలి. జమ్మూకశ్మీర్లో లభ్యమైన రూ.35 లక్షల కోట్ల విలువైన లిథియం నిక్షేపాలను ప్రైవేట్పరం చేస్తామని చెప్పడం పబ్లిక్ సెక్టర్ యూనిట్లను (పీఎస్యూ)అవమానపరచడమే. ఇది భవిష్యత్తులో మరో కుంభకోణానికి దారితీస్తున్నదన డంలో సందేహం లేదు.
మనుషులందరూ ఒక్కటే. ఆహారం, ఇల్లు, బట్ట, జ్ఞానం, వైద్యం ఇవి మానవుని కనీస హక్కులు. దేహమే దేవాలయం, స్త్రీ పురుష భేదం లేదు. శ్రమను మించిన సౌందర్యం లేదు, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం. హత్యలు చేయకు లాంటి ఆదర్శాలతో నిర్మించిన బసవ మంటపం లక్ష్యాలను ప్రధాని మోదీ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే ఆధునిక ప్రజాస్వామ్యానికి మంచిది. అప్పుడే బసవ తత్వానికి ఆయన ఒక నిజమైన వారసుడు!
ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రతిపక్షాలను అణచివేస్తున్న తరుణంలో ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకువస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అందుకే ఆయనను నిలువరించడంలోనూ కుట్రలు పన్నుతున్నారు. కోట్లాదిమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపమైన కృత్రిమ మేధస్సు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమను గుర్తించడం ఇక్కడ ప్రస్తావించాలి. పలు రాష్ర్టాల ప్రాంతీయ లక్ష్యాలను గుర్తించి నవీన జాతీయతను నిర్మించగల శక్తి కేసీఆర్కు ఉన్నదని కృత్రిమ మేధస్సుతో పుట్టిన చాట్ జీపీటీ చెప్పడం ప్రతి తెలంగాణ వాది గర్వపడాలి.
ఆయన తనయుడైన కేటీఆర్ను భారతదేశానికి రైజింగ్ స్టార్గా ఒక ఆశాకిరణంగా చాట్ జీపీ టీ చెప్పిందంటే బీఆర్ఎస్ నాయకత్వం దేశానికి ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఇరికించడం ద్వారా కేసీఆర్కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. Policy Manipulation ప్రస్తావిస్తున్న బీజేపీ నేతలు అదానీకి అక్రమ ఆస్తులు కట్ట బెట్టడంలో చూపిన Policy Manipulation ప్రస్తావన చేయరు. గంగవరం, ముంబై పోర్టులను అదానీకి ఇవ్వడంలో నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసీఏ) వ్యతిరేకించిన విషయాన్ని పక్కదోవ పట్టించి ఆశ్రిత పక్షపాతంతో Policy Manipulation ద్వారా అదానీకి మోదీ కట్టబెట్టింది నిజం కాదా? దానితో పోల్చినప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నది. ఇంతటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న బీజేపీ తాను దొంగతనం చేస్తూ ఇతరులను దొంగలుగా చిత్రీకరించడం సిగ్గుచేటు కాదా? రిమాండ్ రిపోర్టుల్లో పదే పదే సౌత్ గ్రూప్ అని పలకడం దక్షిణ భారతదేశ మనోభావాలకు ఒక అవమానమే. ఇప్పటికే యావత్ తెలంగాణ మనోభావాలు దెబ్బతినడంతో భవిష్యత్తులో విస్ఫోటనం రానున్నది. ‘నక్క వినయం కొంగ జపం’లా తయారైన మోదీ ప్రభుత్వం దేశానికి ఒక భస్మాసుర హస్తంలానే పని చేస్తుంది. FACTS ARE STRANGER THAN FICTION అన్నట్టు మోదీ తన కల్లబొల్లి మాటలతో దేశ వాసులను ఇంకా మోసం చేయలేరు.
ఢిల్లీ వసంత్: 81424 44345
(వ్యాసకర్త: మేనేజింగ్ డైరెక్టర్, జీకాట్)