భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే ఏకైక అధికార పీఠం రాష్ట్రపతిదే. మిగతా వారంతా రాష్ట్రపతి ద్వారా నియమించబడటమో, లేదా నామినేట్ చేయబడటమో జరుగుతుంది. భారత రాష్ట్రపతిని ఎన్నికైన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ర్టాల శాసనసభ సభ్యులంతా కలిసి ఎన్నుకుంటారు. కానీ, ప్రధానమంత్రి లోక్సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు.
1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి నెగ్గారు. ఈ సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని అత్యున్నత స్థానానికి ఎన్నిక జరగబోవడం గతంలో ఎన్నడూ జరగలేదేమో! వాస్తవానికి అప్పట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సంజీవరెడ్డికే పడ్డాయి. కానీ స్వల్ప మెజారిటీతో వీవీ గిరి గెలువడానికి కారణం కాంగ్రెస్ మైనారిటీ ఓట్లతో సహా వామపక్షాల ఓట్లు, ఒక విచిత్రమైన ప్రతిపక్ష కూటమి ఓట్లు రావడమే.
తాను కోరుకున్న అభ్యర్థి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నుకోబడాలని ఇందిర పట్టుదలగా ఉండటానికి స్పష్టమైన కారణం ఉంది. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గమైన ‘సిండికేట్’ ఎంపిక చేసింది. రాజ్యాంగం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేషాధికారాలను ఉపయోగించి సమర్థుడైన సంజీవరెడ్డి సహాయంతో తనను పదవి నుంచి తొలగించడానికి ‘సిండికేట్’ పన్నిన కుట్రలో భాగం అని ఇందిర పసిగట్టింది. ఫలితంగా తన పంతం నెగ్గించుకొని సంజీవరెడ్డిని ఓడించింది.
ఇక ఇప్పటి విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా పార్టీలో, పార్టీ బయటా నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకత, ఆయన పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బలపడుతున్న విపక్షాల ఐక్యత, బహుశా రాబోయే సార్వత్రిక ఎన్నిక తర్వాత ప్రధాని నియామకం విషయంలో రాష్ట్రపతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. అందుకేనేమో ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. ఇందిరాగాంధీ హయాంలో వలె బీజేపీలోని మోదీ వ్యతిరేక వర్గం కూడా వారు కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అయితే మంచిదని భావిస్తుండవచ్చు కూడా. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు!
భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే ఏకైక అధికార పీఠం రాష్ట్రపతిదే. మిగతా వారంతా రాష్ట్రపతి ద్వారా నియమించబడటమో, లేదా నామినేట్ చేయబడటమో జరుగుతుంది. భారత రాష్ట్రపతిని ఎన్నికైన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ర్టాల శాసనసభ సభ్యులంతా కలిసి ఎన్నుకుంటారు. కానీ, ప్రధానమంత్రి లోక్సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. దీనర్థం, ప్రాతినిథ్యపరంగా రాష్ట్రపతే ప్రధానికంటే ఎక్కువ. ప్రధానిని రాష్ట్రపతే నియమిస్తాడు. ఎవరిని నియమించాలనే విచక్షణాధికారం ఆయనదే.
సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో ఆ పదవికి ఉన్న అసలు సిసలైన అధికారం మొట్టమొదటిసారిగా తెలిసొచ్చింది. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయాన్ని వెల్లడించకముందే, రాష్ట్రపతి జీఎల్ నందాను సర్వేపల్లి ప్రధానిగా నియమించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కూడా అదే విధానాన్ని పాటించారు. మరోసారి గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారు. ఆయన్ను నియమించేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎన్నుకోలేదు. కాకపోతే రెండుసార్లు కూడా గుల్జారీలాల్ నందా ఆపద్ధర్మ, తాత్కాలిక ప్రధానిగానే పదవిలో కొనసాగారు.
ఇందిరాగాంధీ హత్యానంతరం అప్పటి రాష్ట్రపతి జైల్సింగ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీవ్గాంధీని ఎన్నుకోకముందే ఆయన చేత ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి విముఖత వ్యక్తపరచడంతో వీపీ సింగ్ను ప్రధానిగా నియమించడానికి, ఆ తర్వాత ఆయన రాజీనామా దరిమిలా, మొదట రాజీవ్గాంధీని, తర్వాత చంద్రశేఖర్ను ఆహ్వానించడానికి, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచక్షణాధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.
ఇంతవరకూ చెప్పిన ఉదాహరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించినవి. 1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తర్వాత మొదలు వైబీ చవాన్ను ఆహ్వానించడంలో, తర్వాత మొరార్జీకి మరో ఛాన్స్ ఇవ్వకుండా ఉండటంలో చివరికి చరణ్సింగ్ను ప్రధానిగా నియమించడంలో రాష్ట్రపతి పాత్ర ప్రాము ఖ్యం సంతరించుకున్నది. ఆ తర్వాత చరణ్సింగ్ను విశ్వా స పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం మొదటిసారి. 25 రోజుల్లోపలే చరణ్సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్కు వెళ్లని మొదటి, చివరి ప్రధానిగా చరిత్రకెక్కారు. లోక్సభను రద్దు చేయమన్న ఆయన సిఫారసుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్సింగ్ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు రాష్ట్రపతి. దరిమిలా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కానీ ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. ఎందుకంటే రాష్ట్రపతి అధికారం అంత గొప్పది కాబట్టి. చరణ్సింగ్ను ప్రధానిగా కొనసాగమని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కోరడానికి కారణం, రాజ్యాంగపరమైన బాధ్యతే.
ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రధాని, ఆయన మంత్రిమండలి వందకు వంద శాతం రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. కొనసాగి తీరాలి. ఇంతవరకూ జరగకపోయినా, ఇకముందు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానిని, ఆయన ప్రభుత్వాన్ని రద్దుచేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతే కనుక తన విచక్షణాధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోకపోతే, ఆయన పదవీ స్వీకా రం చేసే సందర్భంలో ‘రాజ్యాంగాన్ని, చట్టా న్ని శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ’ అనే మాటలకు అర్థం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు విశేష ప్రాధా న్యం ఏర్పడింది.
– వనం జ్వాలా నరసింహారావు