బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె సుమతి!
Ebrahim Raisi | వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అతి పురాతన దేశాల్లో ఒకటి. క్రీ.పూ.550లో పర్షియా సామ్రాజ్యంగా మొదలై, క్రీ.శ.1501లో సఫావిడ్ రాజవంశం, 1794లో కజర్ రాజవంశం, 1925లో ఇరాన్ పహ్లవి రాజవంశాల కింద కొనసాగి.. 1979లో ఖామెనీ ఆధ్వర్యంలో ఇరానియన్ విప్లవం ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. దీన్నే ఇరాన్ అని పిలుస్తారు. అయితే 1979 నుంచి మతపరమైన చట్టాలను అడ్డుపెట్టుకుని ఇరాన్ నేతలు మానవ హక్కుల్ని మంటగలిపారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ ఉరిశిక్షలు అమలు చేసే దేశంగానూ ఇరాన్ రికార్డుల్లోకెక్కింది.
శాశ్వత సుప్రీం లీడర్ (జీవిత కాలం), ప్రజల ద్వారా ఎన్నికైన (4 ఏండ్లు) అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. న్యాయవ్యవస్థ అంతా ఇస్లాం షరియా చట్టం ఆధారంగానే ఉంటుంది. 1979 నుంచి ఇద్దరు శాశ్వత సుప్రీం లీడర్లుగా, 13 మంది అధ్యక్షులుగా కొనసాగారంటేనే ఆ దేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన సొంత మిలిటరీ (ఐఆర్జీసీ), గూఢచార సంస్థ (క్యూఎఫ్)లను ఉపయోగించి ఇరాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. 1979 నుంచి ప్రపంచవ్యాప్తంగా తన ప్రధాన భాగస్వామి లెబనీస్ హెజ్బుల్లా ద్వారా 35కు పైగా దేశాల్లో హత్యలు, దాడులు చేయించినట్టు ఆరోపణలున్నాయి. 2012లో ఢిల్లీలో ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ-క్యూఎఫ్ సంస్థలు ఇజ్రాయెల్ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు నగదు, ఆయుధాలను ఇరాన్ అందిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇరాన్ 13వ అధ్యక్షుడైన రైసీ హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 1960లో మషాద్లో జన్మించిన రైసీ.. ప్రాథమిక విద్యను మాత్రమే అభ్యసించారు. షరియా చట్టాన్ని కఠినంగా పాటించే ఆయన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ ఆశీర్వాదంతో అంచెలంచెలుగా ఎదిగారు. కరాజ్ జిల్లా అటార్నీగా, డిప్యూటీ ప్రాసిక్యూటర్గా పని చేసిన ఆయన 2021లో ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
1988లో టెహ్రాన్ సమీపంలోని ఎవిన్, గోహర్దష్ట్ జైళ్లలో ఉన్న వేల మంది రాజకీయ అసమ్మతివాదులను రహస్యంగా, చట్టవిరుద్ధంగా ఉరితీసిన ‘డెత్ కమిషన్’లో ఇబ్రహీం రైసీ ముఖ్య సభ్యుడు కావడం గమనార్హం. రైసీ అధ్యక్షుడయ్యాక ఇరాన్ ప్రజల అణచివేత ఎక్కువైంది. ఉరిశిక్షలు పెరిగాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు, అసమ్మతివాదుల అణచివేత తీవ్రతరమైంది. 2022లో మహిళలు, బాలబాలికలు సహా 582 మందికి మరణశిక్ష విధించినట్టు నివేదికలు తెలుపుతున్నాయి.
రైసీ అణచివేత ఎక్కువ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అలా క్రూరమైన హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకే మహ్సా అమినీ అనే మహిళ పోలీసు కస్టడీలో మరణించారు. ఈ ఘటనను నిరసిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గాజాకు ఇరాన్ మద్దతుగా నిలుస్తున్నది. దీంతో రైసీ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ప్రమేయం ఉండొచ్చని ప్రపంచం కోడై కూస్తున్నది. రైసీ ప్రయాణించిన హెలీకాఫ్టర్పై అత్యాధునిక స్పేస్ లేజర్ ఆయుధంతో దాడి జరిగి ఉండొచ్చని అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొసాద్ ఏజెంటే అధ్యక్షుడి హెలికాప్టర్ పైలట్గా వ్యవహరించారని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే ఎస్కార్ట్ హెలీకాఫ్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని, అధ్యక్షుడి హెలీకాఫ్టర్ ప్రమాదానికి గురైందని వారు వాదిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా రైసీ మృతి మాత్రం మిస్టరీగా మారింది. ఏదేమైనప్పటికీ సుప్రీం లీడర్ కావాలనే కలను సాకారం చేసుకోకుండానే రైసీ మరణించారు.
(వ్యాసకర్త: సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
– నూతలపాటి రవికాంత్
97044 44108