కరోనా కొత్త రకం వైరస్ చైనాను కకావికలం చేస్తున్న నేపథ్యంలో మన దేశం కూడా అప్రమత్తం కావలసి వచ్చింది. ఈ ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ ఇప్పటికే మన దేశంలో ప్రవేశించడం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ వైద్య మండలి ముందు జాగ్రత్తగా ఇప్పటికే మార్గర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ వంటి తీవ్ర చర్యలు ప్రస్తుతం అవసరం లేనప్పటికీ, వ్యక్తిగత స్థాయిలో మాస్క్లు ధరించడం, దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి భద్రతా నియమాలు అనుసరించవలసిందే.
విదేశాల నుంచి వచ్చిన వారిలో మచ్చుకు కొందరి వంతున, మొత్తం రెండు శాతం మందిని పరీక్షిస్తున్నారు. రాష్ర్టాలు కూడా అప్రమత్తమై తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొత్తరకం వైరస్ జన్యు పరిశీలన కూడా సాగుతున్నది. అయితే మొత్తంగా కట్టుదిట్టం చేస్తే ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజలకూ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ఏ రాష్ట్రమైనా ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆంక్షల కన్నా, స్వీయ క్రమశిక్షణే ముఖ్యమనేది మనకు ఇప్పటికే అనుభవానికి వచ్చింది.
చైనా పారదర్శక వ్యవస్థ కానందువల్ల అక్కడి వాస్తవ పరిస్థితి బయటకు రాదు. అయినప్పటికీ అక్కడ రోజుకు పది లక్షల మందికి కరోనా సోకుతున్నదనీ, ఐదు వేల మంది మరణిస్తున్నారనీ అంచనా. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని తెలుస్తున్నది. వృద్ధులే ఎక్కువగా మరణిస్తున్నట్టు చెబుతున్నారు. జనవరి, మార్చి నెలల్లో తారస్థాయికి చేరుకోవచ్చునని కూడా అంచనా వేస్తున్నారు.
ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాలలో కూడా వ్యాపించింది. అయితే చైనాలో మాదిరిగా ఈ దేశాలలో పేట్రేగిపోవడం లేదు. బ్రిటన్లో అక్కడి ప్రభుత్వం అంచనా కన్నా తక్కువ ప్రభావం చూపింది. అయితే ఇదే పరిస్థితి ఇక ముందు కూడా ఉంటుందని చెప్పలేము. అందువల్ల ప్రపంచదేశాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వివిధ దేశాల అనుభవాలను బట్టి భారత్ పెద్దగా భయపడవలసిన అవసరం లేదని, అలాగని ముందు అతి జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే అని భావించవచ్చు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్టు ప్రపంచ దేశాలలో వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను చక్కదిద్దుకోవడం తక్షణావసరం. కరోనా వైరస్ రావడమే వైద్య ఆరోగ్య వ్యవస్థలో నెలకొన్న పరిమితులకు చిహ్నమని గ్రహించాలి.
భారత్లో 2020, 2021లలో సంభవించిన రెండు భారీ వేవ్లతో సామూహిక రోగ నిరోధకశక్తి పెరిగినందున, ఈసారి ఆ స్థాయిలో మహమ్మారి వ్యాపించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చైనాతో పోలిస్తే, మన దేశంలో కరోనా టీకాలు కూడా పెద్ద ఎత్తున వేయటం అనుకూలాంశం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైద్య వ్యవస్థను పటిష్ఠం చేయడం ఇప్పుడు కలిసి వస్తున్నది. మన రాష్ట్రంలో చేపట్టిన జ్వర సర్వే దేశానికే ఆదర్శవంతమైనది. అయితే ప్రజలు మరింత అవగాహన పెంచుకోవాలి. ఏ రకమైన అనారోగ్య సమస్య వచ్చినా సత్వరం వ్యాధి నిర్ధారణ చేసుకొని, చికిత్సపై దృష్టి సారించాలి.
పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మకుండా, ప్రభుత్వ సూచనల మేరకు సహకరిస్తే, కరోనా మన దరిదాపులకు కూడా రాదు. మనకు గతంలో కరోనా వైరస్ను ఎదుర్కొన్న అనుభవం ఉన్నది. వైద్య వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మొదలుకొని ప్రజల వరకు అందరికీ ముందు జాగ్రత్తలు, చికిత్సలపై ఎంతో కొంత అవగాహన ఏర్పడింది. అందువల్ల భయాందోళనలకు గురికాకుండానే, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధపడటం మంచిది. కరోనా విస్తరణను కట్టడి చేయడమే ఉత్తమమైన మార్గం.