ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్ర హాని చేస్తున్నాయి. ప్లాస్టిక్ ప్రభావంతో భూమిపై నివసిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నది. మనం వాడుతున్న అధిక శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులు ఒక్కసారి మాత్రమే వాడదగినవి. రెండవ సారి పునర్వినియోగానికి అవకాశం లేకపోవటంతో వాటి వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇతర దేశాలతో చూస్తే మన దేశంలో జనసంఖ్య అధికంగా ఉన్నా, ప్లాస్టిక్ వాడకం తక్కువ. కానీ వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటిని పునర్వినియోగానికి తీసుకువచ్చే వ్యవస్థ, యం త్రాంగం లేని కారణంగా పరిసరాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణం కలుషితమై విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ వినియోగంలో 100 లోపు స్థానంలో ఉన్న మన దేశం కాలుష్య కారకమైన ప్రభావిత దేశాల్లో మాత్రం 10 లోపు స్థానంలో ఉండటం ఆందోళనకరం. సాధారణంగా మనం వాడుతున్న ప్లాస్టిక్ 125 మైక్రాన్ల మందం ఉంటే తప్ప దాని పునర్వివినియోగానికి అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ప్లాస్టి క్ ఉత్పత్తులను, ఒకేసారి మాత్రమే వాడి కాలుష్యానికి కారణమయ్యే వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం- పునఃసేకరణ (రీకలెక్ట్), పునరుద్ధరణ(రీసైకిల్), పునర్వినియోగం(రియూజ్)తో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించడానికి చర్యలు తీసుకోవటం ఆహ్వా నించదగిన పరిణామం.
రోజువారీ దినచర్యలో మనం వాడుతున్న అనేక ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, నీళ్ల సీసాలు, తాళ్లు, కవర్లు, చేతి సంచులు, బస్తాలు, అలంకరణ సామగ్రి మొదలైన వాటిని మనం ఒకేసారి వాడి పాడేస్తాం. తక్కువ మైక్రాన్ల మందంతో తయారైన వీటిని మన పరిసరాలలో వేయడం వల్ల భూమిలో అవి కరిగి పోవడం లేదు. తద్వారా వాయు కాలుష్యం, భూగ ర్భ జలాలు పెరుగక పోవటం, ఇంకా అనేక విధాలుగా కాలుష్యవ్యర్థాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
ఈ ప్లాస్టిక్ వ్యర్థాలకు తోడు ఇటీవలి కాలంలో ఆచారాలు, పండుగల పేర చేస్తున్న క్రతువుల ఫలితంగా కూడా కాలుష్యం పెరుగుతున్నది. వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాలుష్య కారక రసాయన పదార్థాలతో తయారు చేస్తున్నారు. వీటిని ప్రజలకు ఉపయోగార్థంగా ఉన్న చెరువులు, కొలనులు, నదుల్లో వేయ డం తీవ్రమైన కాలుష్యానికి దారితీస్తున్నది. వీటికి బదులుగా ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిర్మించిన నీటి కొలనుల్లో నిమజ్జనం చేస్తే.. పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతాం. పెద్ద పెద్ద విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ఎంతో మంచిది.
పర్యావరణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజ హితం కోరేవారి సలహాలు పర్యావరణ సంబంధ ప్రభు త్వ విభాగాలు తీసుకోవాలి. కాలుష్యాన్ని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పునర్ వినియోగంపై, ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించాలి. అన్ని వర్గాలు, మతా ల వారిని ఈ పర్యావరణ కాలుష్య రాక్షసిని తరిమికొట్టడానికి కార్యోన్ముఖులను చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరు డు బాధ్యతతో స్వయంగా తనకు తానే కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలి. అందుకు అనుగుణంగా ప్రజలను చైతన్య పరిచి కాలుష్య నివారణకు కార్యోన్ముఖులను చేయాలి.
దేవిరెడ్డి సుధీర్రెడ్డి