రోగి- రోగం- ఔషధం అన్న మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యేక ప్రాధాన్యమున్నది. స్వస్థత, అస్వస్థత, వ్యాధి- ఈ అంశాలను రోగపరంగా కాక రోగిపరంగా విశ్లేషించాలి అన్నది హోమియో వైద్య మౌలిక సూత్రం. సూక్ష్మమైన హోమియోపతి గుళికలతో అనితరసాధ్యమైన క్యాన్సర్ లాంటి వ్యాధులనుండి సైతం రక్షించే అవకాశం కలదు. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం జర్మనీలో పుట్టిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ (1755 ఏప్రిల్ 10) కృషి ఫలితంగా ఈ వైద్యవిధానం పురుడు పోసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఆయన జయంతిని ఏటా హోమియోపతి దినంగా జరుపుకొంటున్నారు.
మనిషిని కేవలం ఒక రోగిలా యంత్రంలా చూస్తూ నిమిషాలలో చీటీ రాసిచ్చేయడం కాకుండా మనిషితత్వాన్ని, శరీరంలో తలెత్తిన సంక్షోభాన్ని సానుకూలంగా అర్థం చేసుకుని, దానిని బట్టి చికిత్స చేయడం హోమియోపతిలోని మౌలిక అంశం. ప్రతి వ్యక్తి కూడా భిన్నమైన వ్యక్తే. వ్యాధితోపాటు అతని వ్యక్తిత్వం కూడా ముఖ్యమే.
మనిషిలో ప్రాణం, మనస్సు, దేహం అనే మూడు అంశాలున్నాయి. శరీరంలో కణాలు, ధాతువులు, అవయవాలు, మనస్సు తదితర వ్యవస్థలో అన్నిటి కార్యక్రమాలను అనుసంధానం చేసేది ప్రాణశక్తి. ఇది వక్రించి దేహ కార్యక్రమాలు కుంటుపడితేనే మనం వ్యాధి అంటు న్నాం. వ్యాధి దశలను పరిశీలిస్తే మొదట ప్రాణశక్తిలో, తర్వాత మానసిక స్థాయి లో ఆ తర్వా త దేహంలో మార్పులు జరుగుతాయి. హోమియో వైద్యంలో ఔషధ ఎంపికలో ప్రాణ, మానసిక స్థాయిలో మార్పులను పరిగణనలోకి తీసుకుంటారు. మనిషి మానసిక స్థాయిలో ఎంతో పరిణామం చెందిన జీవి. అందుకే మనసులోని రెండు భాగాలైన బాహ్య మనస్సు, అంతర మనస్సు పాత్ర- శరీర కణాల ఆరోగ్య స్థాయిని శాసిస్తాయి. మనసు శరీరాల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొనే ఔషధ ధర్మాల నిర్ధారణ కోసం మానవులపైనే ప్రయోగాలు జరపాలని డాక్టర్ హానిమన్ నొక్కి చెప్పారు.
ప్రతి మనిషికి ప్రాణశక్తి ఉంటుందని, వ్యాధి వచ్చినపుడు అది కుంగుతుందనీ, ఉత్తేజపరిస్తే వ్యాధి తగ్గుతుందని, ప్రాణశక్తి భౌతికమైనది కానందున దానిని సరిచేసే మందు కూడా శక్తిస్వరూపంలో- అంటే అతి సూక్ష్మంగా ఉండాలని ప్రతిపాదించి, ఆ రకంగానే మందుల్ని తయారుచేసి వ్యాధుల నివారణతో అద్భుత ఫలితాలు చూపించారు హోమియో ప్రదాత డాక్టర్ హానిమన్. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమి యో వైద్య ధ్యేయం. ప్రతి పదార్థానికి భౌతిక, రసాయనిక ధర్మాలే కాక, వైద్యధర్మాలు కూడా ఉంటాయని హోమి యో విధానం విశ్వసిస్తుంది. ఆ రకంగానే ఎందుకూ పనికిరానిదిగా భావించేవాటి నుంచి తయారుచేసిన మందులను చికిత్సలో వినియోగిస్తుంటారు. ఇసుక నుంచి తయారుచేసిన సైలీషియా హోమియోపతిలో సర్జన్గా పనిచేస్తుంది. మనం నిత్యం వాడుకునే ఉప్పు నుంచి తయారుచేసిన నేట్రమ్మూర్ అనేది క్యాన్సర్కు సైతం మందుగా పనిచేస్తుంది.
యూరప్లో క్రూప్ వ్యాధి ప్రబలినప్పుడు, జర్మనీలో ప్రమాదకరమైన స్కార్లెట్ ఫీవర్ వచ్చినప్పుడు , రష్యాలో కలరా వ్యాధి సోకినప్పుడు లక్షల మందిని రక్షించిన చరిత్ర హోమియోపతికి ఉంది. మన రాష్ర్టానికి సంబంధించి పసిపిల్లల పాలిట మహమ్మారి అయిన మెదడు వాపు వ్యాధి నివారణలో తోడ్పడింది. చికున్గున్యా, స్వైన్ఫ్లూ విషయంలోనూ ఈ వైద్యవిధానం ఫలితాలు తెలిసొచ్చాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి విషయానికే వస్తే వివిధ పరిశోధనల ఫలితంగా హోమియోపతి ఔషధాల పనితీరును ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం అమెరికా, జర్మనీ, రష్యా మొదలుకొని సుమారు 158 దేశాలలో హోమియో వైద్యం అధికారికంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు, వైద్యశాలల్లో సేవలందిస్తున్నది. భారతదేశం విషయానికి వస్తే సుమారు 180 వైద్యకళాశాలలు, 40 పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కళాశాలలున్నాయి. దాదాపు మూడు లక్షల మంది శిక్షణ పొందిన వైద్యు లు సేవలందిస్తున్నారు.
(నేడు హోమియోపతి వైద్యప్రదాత డాక్టర్ శామ్యూల్ హానిమన్ జయంతి)
ఒక ఔషధం ఆరోగ్యవంతునిలో ఏ వ్యాధి లక్షణాలను సృష్టిస్తుందో ఆ లక్షణాలు గల రోగికి అదే ఔషధాన్ని సూక్ష్మ రూపంలో ఇచ్చినట్లయితే స్వస్థత చేకూరుతుంది. గ్రీకు భాషలో హోమియోపతి అంటే ‘అదే విధమైన బాధ’ అని అర్థం. శరీరానికి ఏ విధమైన బాధ ఉన్నదో, అదే విధమైన బాధను శరీరంలోకి మందుల ద్వారా చొప్పించి అసలు బాధను నిర్మూలించడం.