తీవ్ర భావోద్వేగాలు కలిగిన నాయకుడిలోనే జనసామాన్యం తమను తాము చూసుకుంటారు. సంగారెడ్డి సభలో కేసీఆర్, హరీశ్రావు ప్రసంగాలు పై వాక్యానికి చక్కని ఉదాహరణ. జనం గుండె చప్పుడు వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనించింది.
కేసీఆర్ తాను రవాణాశాఖా మంత్రిగా పనిచేస్తున్నప్పుడు జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, సంగారెడ్డి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు జనం ఆనాడు అనుభవించిన కడగండ్లను గుర్తు చేసుకుంటూ.. రేగోడు, రాయికోడు, మనూరు, కంగ్టి.. అని గ్రామాల పేర్లను గుర్తు చేసిన తీరుతో జనం ఉబ్బితబ్బిబ్బయ్యారు. బుగ్గ రామన్నచెరువు, గంగ కత్వ, ఏడాకులపల్లి చెరువు అంటూ చెరువుల పేర్లను గుర్తు చేసిన తీరైనా కేసీఆర్ స్థానిక జీవనంతో ఎంతగా మమేకమై పోతారనేదానికి అద్దం పట్టింది. ఆ పేర్లు ఆయన చెప్తున్నప్పుడు జనం పెద్ద పెట్టున స్పందించిన తీరు చూసినా అది అవగతం అవుతుంది.
తెలంగాణ బతుకురుచిని, ఆర్ద్రతను, ఆవేశాన్ని ప్రతిబింబిస్తూ మాట్లాడటమే కేసీఆర్ ప్రత్యేకత. కేసీఆర్కు ‘మాటల మాంత్రికుడు’ అని మీడియా పేరు పెట్టింది. అయితే జనాన్ని మంత్రముగ్ధం చేసే ఆయన మాటల వెనుక అక్కడి బతుకుంది, ఆ బతుకులోని బరువుంది అని మర్చిపోవద్దు. ఉన్క మీది రోకలోలె దుంకులాడుతున్న బీజేపీ నాయకులు ‘తిట్లు మాత్రమే భాష’ అని భ్రమిస్తున్నరు. తాము కేసీఆర్ లాగ మాట్లాడుతున్నామని భావిస్తున్నారు.
నిజంగా వాళ్లు కేసీఆర్ నుంచి నేర్చుకోదలిస్తే అందమైన నుడికారం నేర్చుకోవాలి. అద్భుతమైన పదజాలం పట్టుకోవాలి. సాహిత్య పరిమళం అద్దుకోవాలి. జనజీవనంలోని సామెతలు, చమత్కారాలు, పద్యాలు, పాటలు ఒడిసిపట్టాలి. అన్నిటికి మించి తెలంగాణ జీవితం ప్రతిబింబించాలి. అవన్నీ కలగలిస్తేనే కేసీఆర్ ప్రసంగం. ఆయన కదాచిత్గా విసిరే విసుర్లను పట్టుకొని ఆయనలా మేం మాట్లాడుతున్నామని అనుకోవటం అవివేకం.
‘హద్నూరకు ఎద్దునియ్యొద్దు, బోరంచకు పిల్లనియ్యొద్దు’ అని హరీశ్ రావు చెప్పిన సామెత స్థానికులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ సామెత పుట్టు పూర్వోత్తరాలు చెప్పటంతో పాటూ, స్థానిక బంజారా మహిళ చిమ్నీ బాయి ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. నారాయణఖేడ్ జీవితాన్ని ఎంతో లోతుగా అర్థం చేసుకుంటే తప్ప అంత సన్నిహితంగా మాట్లాడటం సాధ్యం కాదు. ఆ ఒక్క సామెతతో ఆయన ఆ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్న వేదనను జనం భాషలోనే వివరించారు. అందుకే జనం ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కేసీఆర్ వేసిన బాటలో హరీశ్రావు తన ప్రసంగ రీతిని రూపుదిద్దుకున్నారు. జనం వ్యక్తీకరణలపై తగిన పరిశీలన ఉన్నప్పుడే అది సాధ్యం. ఇది పుస్తకాలతో వచ్చేది కాదు. నాయకుడు జన హృదయాన్ని చదవాలి. జీవితాల్ని చదవాలి. ప్రజల బాధ తన బాధగా తన గొంతులో పల్లవింపజేయాలి. ఆ గొంతులోనిజాయితీ తొణికిసలాడాలి. అదే ఇవ్వాళ కేసీఆర్, హరీశ్రావు చేశారు.
‘రాయి అహల్య అయినట్టుగా.. కేసీఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ పచ్చని పంటల సీమ’గా మారుతున్నదని హరీశ్రావు చెప్పిన మాట అక్షర సత్యం. గోదావరికి ఉపనది మంజీరా. నిజామాబాద్ జిల్లా కందనూరు వద్ద మంజీరా గోదావరిలోకి సంగమిస్తుంది బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో గోదావరి వెనుకకు మరలి వచ్చి మంజీరతో సంగమించడం నిజంగా సాంకేతిక అద్భుతం. ఈ అద్భుతంతో సంగారెడ్డి జిల్లా అపూర్వ ప్రగతికి నోచుకుంటుం దనటంలో సందేహం లేదు. అత్యంత వెనుకబాటును అనుభవించిన జిల్లా కొత్త వెలుగులు విరజిమ్మాలి. బసవేశ్వరుడు, సంగమేశ్వరుడు స్థానికుల ఆరాధ్య దైవాలు. ఎత్తిపోతల పథకాలకు ఆ పేర్లు పెట్టడంలోనూ స్థానిక మట్టిపరిమళం గుబాళింపు ఉన్నది. స్థానికతకు ప్రతీకలుగా నిలిచిన నేతల సారథ్యంలో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు చిమ్నీబాయి వెత శాశ్వతంగా తీరిపోతుంది. హద్నూరకు ఎద్దునిచ్చే కాలం కూడా వస్తుంది. బోరంచకు ఇచ్చిన పిల్లా సుఖపడుతుంది.
-బాలార్క