‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్’ ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వంటి వాటిల్లోకి చొరబడుతున్నారనే అభియోగాలు వచ్చాయి. వీటిపై జరుగుతున్న దర్యాప్తు నత్తనడకన సాగుతున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమా అన్న అనుమానం కలుగుతున్నది.
గోప్యత, భావప్రకటన, ఆలోచన, వ్యక్తీకరణ వంటి హక్కులకు రాజ్యమే భంగం కలిగించటమన్నది ఈ వివాదంలో ప్రధాన విమర్శ. విపక్షాలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలతో సహా గిట్టనివారిపై ‘సాంకేతిక నిఘా నీడ’ పేరుతో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలవడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం నిపుణుల కమిటీ ఏర్పర్చి దర్యాప్తునకు ఆదేశించింది. మధ్యంతర నివేదిక సమర్పించిన సదరు కమిటీ పూర్తి నివేదికకు మరింత సమయం కావాలని సుప్రీం కోర్టును కోరుతున్నది. కోర్టు విచారణకు హాజరుకావాల్సిన కేంద్రం వాయిదా కోరింది. ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన ఇజ్రాయెల్ న్యాయశాఖ వారం రోజుల్లో పరిశోధన ముగించి నివేదిక ఇవ్వటం గమనార్హం.
హక్కుల మీద దాడి: అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో ఇటీవల వచ్చిన ఓ తాజా కథనం సంచలనం రేపింది. 2017లో ఇజ్రాయెల్తో భారత్ కుదుర్చుకున్న ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా, పెగాసస్ సర్వీసులు కూడా తీసుకున్నారనేది ఆ కథన సారాంశం. సుమారు రూ.15,000 కోట్ల ఈ ఒప్పందంలో దేశ రక్షణ విభాగానికి అవసరమయ్యే మిసైల్ సాంకేతికతతో పాటు ‘పెగాసస్ నిఘా’ సేవలు కూడా ఇమిడి ఉన్నాయి. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ఆధారంగా మన దేశంలో జాతీయ మీడియా తెల్లారేసరికి కోడై కూసింది. మొదట్లో రెండుసార్లు వచ్చిన ఆరోపణలు, విమర్శలను, ఘాటైన మాటలు, పదునైన ప్రత్యారోపణలతో ఎదుర్కొన్న కేంద్రం, తాజా నివేదిక తప్పని మాత్రం ఖండించలేదు. అప్పటికే సుప్రీంకోర్టు త్రిసభ్య నిపుణుల కమిటీ ఏర్పర్చి దర్యాప్తునకు ఆదేశించింది. నిజానికిది, లక్ష్యం చేసుకున్న వ్యక్తుల మొబైల్లోకి సాంకేతికంగా చొరబడి సంభాషణలు వినడం వరకే పరిమితమైంది కాదు. మొబైల్ను తాకే పనిలేకుండా, సదరు వ్యక్తికి తెలియకుండా ఆ మాయా సాఫ్ట్వేర్ వచ్చి మొబైల్లో దూరుతుంది. ఇక అప్పట్నుంచి మొబైల్.. ఎక్కడో ఉన్న మానిటర్ సిస్టమ్ పరిధిలోకి వెళ్లిపోవటం అంతా ఆటోమెటిక్గా జరిగిపోతుంది. సంభాషణలే కాకుండా కాల్ డేటా, డాక్యుమెంట్లు, ఫొటోలు, ఇతరేతరమైనవన్నీ రహస్యంగా సంబంధిత నియంత్రణ/ నిఘా కేంద్రానికి చేరవేస్తుంది. ఇజ్రాయెల్లోని ‘ఎన్ఎస్ఓ’ గ్రూప్ సంస్థ విక్రయించే ఈ సాంకేతికతను వివిధ దేశాలు భద్రత, దేశ రక్షణ వంటి వ్యవహారాల్లోనే వినియోగిస్తున్నాయి. అందుకే ‘ఎన్ఎస్ఓ’ కూడా ప్రభుత్వాలకు, ప్రభుత్వం వినియోగించే సంస్థలకు తప్ప ఇతర ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు ఈ సాంకేతికతను విక్రయించదు. కానీ, దేశంలో సుమారు వెయ్యి మందిని లక్ష్యం చేసుకోవడం, అందులో ఓ యాభై మందిపై నిరంతర నిఘా చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. ఇద్దరు కేంద్రమంత్రులు, ముగ్గురు ప్రతిపక్షాలకు చెందినవారు, 40 మంది వరకు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, ఒక న్యాయవేత్త.. తదితరులు ఉండటంతో ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వ నిర్వాకమేనని, ప్రభుత్వమే తన పౌరులపై నిరంతర నిఘా పెడితే ఇక ప్రజాస్వామ్యానికి తావేదనే ప్రశ్న ఉదయిస్తున్నది.
సుప్రీం ఆశ్చర్యపోయింది!: సభలో చర్చ, లోపల- బయట పలు విమర్శల తర్వాత కేంద్రం చిన్నపాటి దర్యాప్తునకు సమ్మతించింది. అంతకుముందే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసు నమోదు చేయించి పెగాసస్ చొరబాట్లపై రాష్ట్ర పరిధిలో దర్యాప్తుచేపట్టారు. ఎడిటర్స్ గిల్డ్ తరపున ఎన్.రామ్ వంటి సీనియర్ సంపాదకులతో పాటు ఇతర జర్నలిస్టులు, యశ్వంత్ సిన్హా, గోవిందాచార్య వంటి పలువురు ప్రత్యేకంగా సంప్రదించిన మీదట సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. నిర్దిష్టంగా వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. గడువు లోపల ఒక చిన్న వివరణ నోట్ మాత్రమే కేంద్రం దాఖలు చేసింది.‘ఇదేంటి? మేం ఏమడిగాం, మీరేం ఇచ్చారు! ఇది సరైన పద్ధతి కాదు, నిర్దిష్ట ఆరోపణలు వచ్చినపుడు ఏ వైఖరి తీసుకోకుండా ప్రభుత్వం ఎలా ఉండగలదు? వివరంగా సమర్పించండి’ అని పురమాయించిన తర్వాత కూడా కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల సుప్రీంకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. ‘ప్రపంచస్థాయిలో ఇంతటి ఆరోపణలు వచ్చి, వివిధ దేశాలు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినపుడు మనం మౌనంగా కూర్చోలేం, ఇక్కడ కూడా దర్యాప్తు, అదీ సమగ్రంగా జరగాల్సిందే’ అని తనంత తాను ఒక నిపుణుల కమిటీని నియమించింది. దేశ భద్రత చర్యలు సరే, వ్యక్తిగత గోప్యత హక్కు, భావప్రకటన స్వేచ్ఛకేమైనా భంగం వాటిల్లిందా అన్నది సుప్రీం తెలుసుకోగోరింది. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో ఆలోక్ జోషి, సుదీప్ ఒబెరాయ్లతో ఏర్పడిన ఈ కమిటీ వీలైనంత తొందరగా దర్యాప్తు జరిపి, సమగ్ర నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఐటీ, సైబర్ క్రైమ్-ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన ముగ్గురు నిపుణులతో ఉప కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
‘పెగాసస్’ ఒప్పందంపై నిర్దిష్టంగా విమర్శలు, ఆరోపణలు వచ్చినపుడు కేంద్రం సరిగా స్పందించకపోవడం విస్మయం కలిగిస్తున్నది. దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక సభ అయిన పార్లమెంట్లో ఈ అంశం చర్చకు వచ్చినపుడు, సభ్యులు నిర్దిష్టంగా అడిగిన ప్రశ్నలకు కూడా దాటవేత సమాధానాలే దిక్కయ్యాయి. ‘ఏ ఎలక్ట్రానిక్ జోక్యమైనా చట్టం ప్రకారం పరిమితులు, నిబంధనలకు లోబడే జరుగుతుంది. చట్టం ఈ విషయంలో విస్పష్టంగా ఉంది’ అంటూ కేంద్రం ఓ అస్పష్టమైన జవాబు ఇచ్చింది.
దేశ భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత పరస్పర విరుద్ధ అంశాలు కావు. కాబట్టి, సయోధ్యతో రెండింటినీ కాపాడటం ఎలాగో ఒక అధ్యయనం కూడా జరుగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో పాలన పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వా లు జవాబుదారీతనంతో ఉండాలనుకునే వారంతా ‘పెగాసస్’ దుర్వినియోగ పర్వం బట్టబయలు కావాలని కోరుకోవటం సహజం.
– రాంరెడ్డిగారి దిలీప్ రెడ్డి
99490 99802